కొవిడ్​తో ఉత్తర కొరియా ఉక్కిరిబిక్కిరి.. తలపట్టుకుంటున్న 'కిమ్​'!

author img

By

Published : May 14, 2022, 10:17 AM IST

North Korea Corona cases:

North Korea Corona cases: ఉత్తర కొరియాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో శుక్రవారం ఒక్క రోజే 21 మంది జ్వరంతో మరణించారు. మొత్తం మరణాలు 27కు చేరాయి. మరోవైపు.. మొత్తం జ్వరపీడితులు 5 లక్షలు దాటారు. ఈ క్రమంలో కరోనాను దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాల్​గా పేర్కొన్నారు కిమ్ జోంగ్​ ఉన్​.

North Korea Corona cases: కొవిడ్​-19 మహమ్మారి ఉత్తర కొరియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 1,74,440 మంది జ్వరపీడితులుగా మారారు. 21 మంది మరణించారు. ఏప్రిల్​ చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 5,24,440 మంది అనారోగ్యం పాలయ్యారు. మృతుల సంఖ్య 27కు చేరింది. ఇప్పటివరకు 2,43,630 మంది కోలుకున్నారని, 2,80,810 మందిని క్వారంటైన్​కు తరలించినట్లు ఉత్తర కొరియా తెలిపింది. అయితే.. మృతుల్లో కరోనా కారణంగా ఎంత మంది చనిపోయారనే విషయంపై స్పష్టత లేదు.

కరోనా కట్టడి వ్యూహాలపై శుక్రవారం నిర్వహించిన పార్టీ పొలిట్​ బ్యూరో సమావేశానికి హాజరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్​ ఉన్​.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్​ మహమ్మారి వ్యాప్తిని దేశ చరిత్రలోనే అతిపెద్ద సవాలుగా అభివర్ణించారు. ప్రజలు, ప్రభుత్వం ఏకమై కరోనా వైరస్​ను వీలైనంత త్వరగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

" కరోనా కట్టడి చర్యల అమలుపై దృష్టి సారించాలి. వైరస్​ వ్యాప్తిని నిరోధించేలా ప్రోత్సహించాలి. దేశ రక్షణ వ్యవస్థలో భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేసేందుకు ఉపరితల, వాయు, సముద్ర సరిహద్దుల్లో నిఘా పెంచాలి. ప్రభుత్వం, ప్రజలు ఏకాభిప్రాయంతో వైరస్​ను త్వరితగతిన కట్టడి చేయాలి. కరోనాతో చరిత్రలోనే అతిపెద్ద సవాలును దేశం ఎదుర్కొంటోంది."

- కిమ్​ జోంగ్​ ఉన్​, ఉత్తర కొరియా అధినేత

కరోనా వైరస్​ను కట్టడి చేయలేకపోతే ఉత్తర కొరియా తీవ్రమైన పర్యవసనాలను ఎదుర్కోవలసి వస్తుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. బలహీన ఆరోగ్య వ్యవస్థ, కొవిడ్​ వ్యాక్సిన్​ అందని వారు 2.6 కోట్ల మందికిపైగా ఉండటం కిమ్​ ప్రభుత్వానికి పెద్ద సవాలేనని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. గత ఆదివారం నుంచి పలు ఆసుపత్రుల్లోని జ్వరపీడితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా.. ఒమిక్రాన్​ వేరియంట్​ నిర్ధరణ అయినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్​తో ఒక మరణం సంభవించినట్లు అధికారికంగా ధ్రువీకరించింది ప్రభుత్వం.

న్యూజిలాండ్​ ప్రధానికి కరోనా
న్యూజిలాండ్​ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్​కు కరోనా మహమ్మారి సోకింది. తనకు కొవిడ్​-19 నిర్ధరణ అయినట్లు ప్రధాని శనివారం ప్రకటించారు. 'తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. నా కుటుంబ సభ్యులతో కలిసిపోయాను. దురదృష్టవశాత్తు కొవిడ్​-19 పాటిజివ్​గా తేలింది.' అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. జెసిండాకు కాబోయే భర్త క్లర్క్​ గేఫోర్డ్​కు గత ఆదివారం కరోనా పాజిటివ్​గా తేలింది. అప్పటి నుంచి ఆమె ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంటున్నారు. గత బుధవారం ఆమె కుమార్తెకు నిర్ధరణ అయింది.

ఇదీ చూడండి: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు.. కఠిన చర్యలకు కిమ్​ ఆదేశం

ఉత్తర కొరియాను కుదిపేస్తున్న కరోనా.. 3.5 లక్షల మంది క్వారంటైన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.