యూకేలో మన అమ్మాయికి అరుదైన పురస్కారం.. బ్రిటన్ రాణి చేతుల మీదుగా..

author img

By

Published : Nov 19, 2022, 6:44 AM IST

Queens Commonwealth essay competition

భారత్​కు చెందిన 13 ఏళ్ల బాలిక తన రచనా కౌశలంతో ఆకట్టుకుంది. ప్రపంచ ప్రఖ్యాత 'క్వీన్స్‌ కామన్వెల్త్‌ ఎస్సే కాంపిటిషన్‌'లో జూనియర్ విభాగంలో రన్నరప్​గా నిలిచింది. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో గురువారం వైభవంగా జరిగిన కార్యక్రమంలో బ్రిటన్‌ రాణి కెమిల్లా నుంచి మౌలిక పురస్కారాన్ని అందుకొంది.

ప్రపంచ ప్రఖ్యాత 'క్వీన్స్‌ కామన్వెల్త్‌ ఎస్సే కాంపిటిషన్‌'లో భారత్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక సత్తా చాటింది. ఉత్తరాఖండ్‌కు చెందిన మౌలికా పాండే... ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన పద్మశ్రీ జాదవ్‌ మొలాయి పాయెంగ్‌ యథార్థ జీవితగాథను తన రచనా కౌశలంతో కళ్లకు కట్టింది. ఈ ఏడాది నిర్వహించిన పోటీకి 'ది మొలాయి ఫారెస్ట్‌' శీర్షికతో కథ రాసి.. జూనియర్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో గురువారం వైభవంగా జరిగిన కార్యక్రమంలో బ్రిటన్‌ రాణి కెమిల్లా నుంచి మౌలిక పురస్కారాన్ని అందుకొంది.

జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో విజేతలుగా నిలిచినవారిలో భారత్‌తో పాటు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన 13-17 ఏళ్ల వయసు యువతీ యువకులు ఉన్నారు. పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా... విజేతల వ్యాసాల్లోని పలు భాగాలను రాయల్‌ కామన్వెల్త్‌ సొసైటీ (ఆర్‌సీఎస్‌) రాయబారులు చదివి వినిపించారు. ఇందులో భారత సంతతికి చెందిన నటి ఆయేషా ధార్కర్‌ కూడా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యువతలో అక్షరాస్యత, వ్యక్తీకరణ, సృజనాత్మకతను పెంచేందుకు ఆర్‌సీఎస్‌ 1883లో 'క్వీన్స్‌ కామన్వెల్త్‌ ఎస్సే కాంపిటిషన్‌' పేరున అంతర్జాతీయ పాఠశాల వ్యాస రచన పోటీని ప్రారంభించింది. ఈ ఏడాది నిర్వహించిన పోటీకి మొత్తం 26,322 ఎంట్రీలు వచ్చినట్టు ఆర్‌సీఎస్‌ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.