Teen Crashes into White House with Truck in US : వైట్​హౌస్​పై తెలుగు యువకుడి దాడి.. బైడెనే టార్గెట్​..!

author img

By

Published : May 24, 2023, 8:25 AM IST

White House

Teen Crashes into White House with Truck in US : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకువచ్చిన ఓ 19 ఏళ్ల యువకుడు బీభత్సం సృష్టించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు తెలుగు సంతతికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

Teen Crashes into White House with Truck in US : అమెరికాలోని వైట్ హౌస్ పరిసరాల్లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. తెలుగు సంతతికి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ఆ దేశ అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలోని లాఫెట్ స్క్వేర్ వద్ద భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన అక్కడి పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Teen Crashes into White House with Truck in America : భారీ ట్రక్కులో వచ్చిన ఆ యువకుడిని సెయింట్ లూయిస్ శివారులోని చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్​గా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి నిందితుడు రెండుసార్లు ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టి ముందుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. ప్రమాదం జరిగిన తర్వాత సీక్రెట్ సర్వీస్, మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ట్రక్కును శోధించారు. ఆ సమయంలో ట్రక్కుకు నాజీ జెండా కట్టి ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. యువకుడిని ప్రశ్నించగా తాను అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

అతనిపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం అధ్యక్షుడు బైడెన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. అమెరికాలోని ఛెస్ట్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్‌ 2022లో మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్‌ అయినట్లుగా గుర్తించారు. సామాజిక మాధ్యమాల్లోని ఖాతాల ద్వారా అతని వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైట్ హౌస్​ను వీక్షించేందుకు లాఫెట్ స్క్వేర్ పార్క్ చాలా కాలంగా ఆ దేశంలోని ప్రదర్శనల కోసం అత్యంత ప్రముఖ వేదికగా ఉంది. మిన్నియాపాలిస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత పోలీసింగ్‌పై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఫెడరల్ అధికారులు ఆ ప్రాంతాన్ని కంచె వేసి దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ పార్క్ మూసివేశారు. అయితే మే 2021లో తిరిగి పార్క్​ను అధికారులు తెరిచారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.