ప్రభుత్వ స్కూల్ హాస్టల్​లో అగ్నిప్రమాదం.. 19 మంది విద్యార్థులు మృతి

author img

By

Published : May 23, 2023, 6:34 AM IST

Updated : May 23, 2023, 7:25 AM IST

guyana school dormitory fire

Guyana school dormitory fire : గయానాలోని ఓ పాఠశాల వసతి గృహంలో జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది విద్యార్థులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు.. థాయిలాండ్​లో పాఠశాల పైకప్పు కూలి ఆరుగురు మరణించగా.. మరో 18 మంది గాయపడ్డారు.

Guyana school dormitory fire : గయానాలో ఘోరం జరిగింది. ప్రభుత్వ పాఠశాల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 19 మంది విద్యార్థులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. గయానా రాజధాని జార్జ్‌టౌన్‌కు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహ్‌దియా పట్టణంలోని ఓ సెకండరీ స్కూల్‌లో ఈ దుర్ఘటన సంభవించింది. పాఠశాల వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయని స్థానిక ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. బాధితులంతా 12- 18 ఏళ్ల పిల్లలేనని, ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. ఘటనాస్థలిలోనే 14 మంది విద్యార్థులు మరణించారని.. స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు చనిపోయారని వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు వివరించింది.

పాఠశాల వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంపై గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదొక భారీ ప్రమాదమని.. బాధాకరమైనదని ఇర్ఫాన్ అలీ అన్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనేక మంది విద్యార్థులు స్థానికంగా చికిత్స పొందుతున్నారని, ఏడుగురిని రాజధానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలకుగానూ ప్రభుత్వం.. ప్రైవేటు, మిలిటరీ విమానాలను రంగంలోకి దించింది. బాలికల వసతి గృహంలో ఈ మంటలు చెలరేగినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలను నివారించేందుకుగానూ.. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

స్కూల్ పైకప్పు కూలి ఆరుగురు మృతి..
School Roof Collapse Thailand : థాయిలాండ్​లో స్కూల్ పైకప్పు కూలి ఆరుగురు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. భారీ వర్షం కారణంగా బలమైన గాలులు వీయడం వల్ల పాఠశాల పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సహా ఆరుగురు చనిపోయారు. ధాయిలాండ్ రాజధాని బ్యాంకాక్​కు 300 కి.మీ దూరంలో ఉన్న ఫిచిట్​ ప్రావిన్స్​లోని ఓ ప్రాథమిక పాఠశాలలో వర్షం నుంచి తప్పించుకునేందుకు పలువురు అక్కడే వేచి ఉన్నారు. ఆ సమయంలో పాఠశాల పైకప్పు కూలి నలుగురు పిల్లలు సహా పాఠశాల సిబ్బంది ఒకరు, మరో వ్యక్తి మరణించారు. సోమవారం జరిగిందీ దుర్ఘటన.

గోల్డ్​మైన్​లో భారీ అగ్ని ప్రమాదం..
Peru gold mine fire : ఈ ఏడాది మేలో పెరూలోని ఓ గోల్డ్​మైన్​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 27 మంది కార్మికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. కార్మికులు నైట్​ షిఫ్ట్​ పనుల్లో నిమగ్నమై ఉండగా గనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దక్షిణ పెరూలోని యానాకిహువా మైనింగ్​ కంపెనీకి చెందిన గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టి.. మొత్తం 175 మంది కార్మికులను ప్రమాదం నుంచి సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated :May 23, 2023, 7:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.