ఆస్ట్రేలియాలో అమ్మాయిని చంపి పరార్.. నాలుగేళ్లకు దిల్లీలో అరెస్ట్

author img

By

Published : Nov 25, 2022, 2:56 PM IST

Updated : Nov 25, 2022, 4:10 PM IST

delhi-police-arrests-man-accused-of-murdering-australian-woman-in-queensland

24 ఏళ్ల ఆస్ట్రేలియా యువతి కార్డింగ్లీ హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌విందర్‌ సింగ్‌ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కార్డింగ్లీ హత్య తర్వాత రాజ్‌విందర్‌ సింగ్‌ తన కుటుంబాన్ని ఆస్ట్రేలియాలోనే విడిచిపెట్టి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ఇటీవలే ఆస్ట్రేలియా పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించారు.

ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఫార్మసీ ఉద్యోగి తోయా కార్డింగ్లీ(24) హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌విందర్‌ సింగ్‌(38)ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేసిన రాజ్‌విందర్‌ సింగ్‌ 2018 అక్టోబర్‌ 21వ తేదీన క్వీన్స్‌ల్యాండ్‌లోని వంగెట్టి బీచ్‌లో తన పెంపుడు శునకంతో నడుస్తున్న కార్డింగ్లీని హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ హత్య జరిగిన రెండు రోజుల తర్వాత తన ఉద్యోగంతో పాటు భార్య, ముగ్గురు పిల్లలను ఆస్ట్రేలియాలోనే వదిలి రాజ్‌విందర్‌ సింగ్‌ భారత్‌కు వచ్చేశాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా పోలీసులు రాజ్‌విందర్‌ కోసం గాలిస్తున్నారు.

మూడు వారాల క్రితమే రాజ్‌విందర్‌ సింగ్‌ ఆచూకీ తెలిపిన వారికి మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల రివార్డును క్వీన్స్‌ల్యాండ్‌ పోలీసులు ప్రకటించారు. నిందితులను పట్టుకోవడానికి ఇప్పటివరకు క్వీన్స్‌ల్యాండ్‌ పోలీసులు ప్రకటించిన అత్యంత భారీ బహుమతి ఇదే. 2021 మార్చిలో రాజ్‌విందర్‌ సింగ్‌ను తమకు అప్పగించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఈ నెలలో ఆ విజ్ఞప్తిని భారత సర్కారు అంగీకరించింది. రాజ్‌విందర్‌ సింగ్‌ స్వస్థలం పంజాబ్‌లోని బటర్‌ కలాన్‌. ఫార్మసీ ఉద్యోగి కార్డింగ్లీ హత్య జరిగిన తర్వాత రాజ్‌విందర్‌ సిడ్నీ నుంచి భారత్‌కు చేరుకున్నాడు. ఎట్టకేలకు దిల్లీ పోలీసులు రాజ్‌విందర్‌ను అరెస్టు చేశారు, అతన్ని ఆస్ట్రేలియాకు అప్పగించనున్నారు.

Last Updated :Nov 25, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.