లష్కరే తోయిబా ఉగ్రవాదికి అండగా చైనా.. భారత్​, అమెరికా ప్రయత్నాలకు అడ్డుపుల్ల

author img

By

Published : Sep 17, 2022, 3:03 PM IST

China Blocks Proposal At UN

ఉగ్రవాద నిర్మూలనకు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌, అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చైనా మరోసారి అడ్డుపడింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది, 2008 ముంబయి పేలుళ్ల సూత్రధారి సాజిద్‌ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చేందుకు భారత్‌, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది. తద్వారా ఉగ్రవాదంపై తన ద్వంద్వ వైఖరిని మరోసారి డ్రాగన్‌ ప్రదర్శించింది.

2008 నవంబర్‌ 26 నాటి ముంబయి దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది.. సాజిద్‌ మీర్‌ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం సహా అతడి ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని భద్రతామండలిలో అమెరికా, భారత్‌ ప్రతిపాదించాయి. దీనికి భద్రతా మండలిలోని ఇతర దేశాలు ఆమోదం తెలపగా ఒక్క చైనా మాత్రం హోల్డ్‌లో పెట్టి అడ్డుకుంది. ఫలితంగా సాజిద్‌ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.

China Blocks Proposal At UN
లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్‌ మీర్‌

పాకిస్థాన్‌ ఉగ్రవాదులపై నిషేధం విధించేలా అమెరికా, భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డుపడడం గత నాలుగు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఏడాది జూన్‌లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనకు.. చైనా చివర్లో అడ్డుపడింది. ఆగస్టులో జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు అబ్దుల్ రౌఫ్‌ అజార్‌పై ఆంక్షలు విధిస్తూ భారత్‌, అమెరికా తీసుకొచ్చిన తీర్మానాన్ని కూడా చైనా హోల్డ్‌లో పెట్టింది.

పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో.. సాజిద్‌ మీర్‌ 2001 నుంచి కీలక సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2011 వరకూ ఈ ఉగ్ర ముఠా విదేశాల్లో జరిపిన దాడులకు మీర్‌ ఇంఛార్జ్‌గా వ్యవహరించాడు. 2008 నవంబర్‌ 26న ముంబయిలో చోటుచేసుకున్న దాడుల్లో ఇతడే కీలక సూత్రధారి. అతడిపై అమెరికా 5 మిలియన్‌ డాలర్లు రివార్డు కూడా ప్రకటించింది. గతంలో సాజిద్‌ మీర్‌ చనిపోయినట్లు పాకిస్థాన్‌ ప్రచారం చేసినప్పటికీ పశ్చిమ దేశాలు నమ్మలేదు. అతడి మృతిపై ఆధారాలు చూపాలంటూ పాకిస్థాన్‌ను డిమాండ్‌ చేశాయి. ఈ పరిణామంతో వెనక్కి తగ్గిన పాక్‌ ఈ ఏడాది జూన్‌లో అతడికి 15ఏళ్లు జైలుశిక్ష విధించింది. పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక సంస్థ అయిన ఎఫ్​ఐటీఎఫ్ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే పాక్‌ ఈ చర్యలు చేపట్టింది.

ఇవీ చదవండి: 'రాజరికం మాకొద్దు'.. సోషల్ మీడియాలో 'నాట్ మై కింగ్' ​ట్రెండ్

రాణిపై ప్రేమ.. 14 గంటల పాటు రోడ్లపైనే ప్రజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.