రూ.52 కోట్ల అప్పు తీర్చేందుకు.. మాంసం అమ్ముకుంటున్న కోటీశ్వరుడు

author img

By

Published : Nov 24, 2022, 7:27 AM IST

Etv after-declaring-bankruptcy-a-billionaire-businessman-from-china-is-selling-grilled-sausages

చైనాకు చెందిన ఓ విజయవంతమైన వ్యాపారవేత్త ఇప్పుడు వీధి వ్యాపారిగా మారి ఫాస్ట్​పుడ్​ అమ్ముకుంటున్నాడు. తన ఆస్తులు అమ్మగా మిగిలిన రూ.52 కోట్ల అప్పు తీర్చడానికి మాంసం విక్రయిస్తున్నాడు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదే మరి. అసలేం జరిగిందంటే?

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవ్వడం అనే నానుడి వినే ఉంటారు. తన వ్యాపార సామ్రాజ్యం దివాలా తీయడంతో చైనాలోని ఓ వ్యక్తికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తన ఓడ.. బండి కావడంతో అతడేమీ దిగాలు పడిపోలేదు. తన ఆస్తులు అమ్మగా మిగిలిన రూ.52 కోట్ల అప్పు తీర్చడానికి మాంసం అమ్ముకుంటున్నాడు.

స్థానిక వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. చైనాకు చెందిన తాంగ్‌జియన్‌(52) విజయవంతమైన వ్యాపారవేత్త. రెస్టారంట్ల వ్యాపారంలో తన ఉనికి చాటుకున్నారు. 36 ఏళ్ల వయసుకే కోట్ల రూపాయల వ్యాపారాన్ని వృద్ధి చేశారు. ఈ క్రమంలో 2005లో ల్యాండ్‌స్కేప్‌ ఇంజనీరింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆయనకు కష్టకాలం మొదలైంది. ఆ వెంచర్‌లో పెట్టుబడి భారీ నష్టాలను మిగిల్చింది. దాంతో ఆయన తన రెస్టారంట్లు, ఇళ్లు, కార్లు అమ్ముకోవాల్సి వచ్చింది. ఉన్నదంతా ఊడ్చి అప్పులు కట్టేశారు. అయినా సరే ఇంకా రూ.52 కోట్లు అప్పు మిగిలిపోయింది. దాంతో మాంసంతో తయారు చేసిన ఆహారపదార్థాల విక్రయం మొదలుపెట్టారు. హాంగ్‌ఝౌలోని ఓ వీధిలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

'నేను అమ్మే మాంసాహారంలో ఎలాంటి పిండి ఉండదు. ఇది అచ్చంగా మాంసమే. పార్కులు, మార్కెట్లలో విక్రయించేదానితో పోలిస్తే.. ఇది ఎంతో సురక్షితమైనది' అని తన వ్యాపారం గురించి ప్రచారం చేస్తున్నారు. అలాగే కోటీశ్వరుడి స్థాయి నుంచి ఒక వీధి వ్యాపారిగా మారాల్సి వచ్చిన పరిస్థితిపై స్పందిస్తూ..'ప్రతి ఒక్కరు సవాళ్లతో కూడిన జీవితాన్ని గడుపుతుంటారు. ఎన్నో కష్టనష్టాలను చవిచూస్తుంటారు. అయితే ఓటమిని అంగీకరించకూడదనే స్ఫూర్తి కలిగిఉండాలి' అంటూ ఆశావాదంతో మాట్లాడారు. జీవితం పెట్టిన పరీక్షలను ఎదుర్కొంటోన్న ఆయన స్టోరీ చైనాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆయన ప్రస్తుత వ్యాపారం అక్కడ ట్రెండ్ అవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.