ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు.. ఐరోపాకు బైడెన్​

author img

By

Published : Mar 23, 2022, 8:47 PM IST

Updated : Mar 23, 2022, 10:31 PM IST

Russia Ukraine war

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై సైనికచర్య కొనసాగిస్తున్న రష్యా మరియుపోల్‌పై రెండు సూపర్‌ పవర్‌ఫుల్‌ బాంబులు వేసింది. ఈ దాడిలో భారీ విధ్వంసం జరిగినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. రష్యాతో ఇప్పటివరకు అనేక విడతల చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని ఉక్రెయిన్ పేర్కొనగా అమెరికా అడ్డుపడుతోందని రష్యా ఆరోపించింది. శాంతి పునరుద్ధరణకు రష్యాపై వాణిజ్యం నిషేధం విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ జపాన్‌ పార్లమెంటును కోరారు. ఈ ఉద్రిక్తతల వేళ ఐరోపా పర్యటనకు వెళ్లారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.

Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య 28వ రోజుకు చేరింది. కీలక నగరాల స్వాధీనమే లక్ష్యంగా మాస్కో బలగాలు శక్తివంతమైన బాంబులతో విరుచుకుపడుతున్నాయి. వైమానిక, ఫిరంగి దాడులను తీవ్రతరం చేస్తున్నాయి. మరియుపోల్‌లో 2 సూపర్‌ పవర్‌ఫుల్‌ బాంబులతో జరిపిన దాడిలో భారీ విధ్వంసం జరిగినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరియుపోల్‌కు మానవతా సాయం తెస్తున్న కాన్వాయ్​లోని 15మంది సహాయ సిబ్బంది, డ్రైవర్లను రష్యా బందీలుగా పట్టుకున్నట్లు ఆరోపించింది. కీవ్‌, ఖర్కివ్‌, సుమీ నగరాలు క్షిపణి దాడులతో దద్దరిల్లగా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు తెలుస్తోంది. లుహాన్స్క్‌లో ఓ అపార్ట్‌మెంట్​పై పుతిన్ సేనలు జరిపిన ఫిరంగి దాడి కారణంగా పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 121 చిన్నారులు, 167 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది.

ఎదురుదాడులు: ఇప్పటివరకు ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్‌.. రష్యా సేనలపై ఎదురుదాడులు చేస్తోంది. కీవ్‌ శివారులోని మకరివ్‌ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటం సహా కీలకమైన హైవేపై పట్టు సాధించినట్లు తెలిపింది. మకరివ్‌లోని పోలీసు స్టేషన్‌ సహా పలు కార్యాలయాల వద్ద తమ దేశ పతాకాలతో ఉన్న వీడియోను ఉక్రెయిన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. మరియుపోల్‌లో రష్యా గస్తీబోటు, ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ పేర్కొంది. ఖేర్సన్‌ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా జెలెన్‌స్కీ బలగాలు కదులుతున్నాయని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.

9 మానవతా కారిడార్లు: కాల్పులు జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలు ఇతర ప్రాంతాలకు సురక్షితంగా వెళ్లేందుకు 9 మానవతా కారిడార్లను తెరిచేందుకు ఉక్రెయిన్‌- రష్యాలు అంగీకరించాయి. డునెట్‌స్క్‌, జపోరిషియా, కీవ్‌, లుహాన్స్క్‌ ప్రాంతాల్లో కారిడార్లు తెరవనున్నట్లు ఉక్రెయిన్ ఉప ప్రధాని తెలిపారు. మరియుపోల్‌లో మానవతా కారిడార్ల ప్రస్తావన లేకునప్పటికీ.. అక్కడి నుంచి బెర్డియాన్స్క్‌ మీదుగా ఇతరప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మరియుపోల్‌లో లక్ష మంది వరకు ఆహారం, నీరు, మందులు లేక ఇబ్బంది పడుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. పోరాటం జరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రజలు ఇతర ప్రదేశాలకు వెళ్లేందుకు కాల్పుల విరమణకు స్థానికంగా అంగీకారం కుదిరినట్లు లుహాన్స్క్‌ గవర్నర్‌ తెలిపారు.

రష్యాపై ఒత్తిడి పెంచండి: వాణిజ్య నిషేధం విధించటం ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. జపాన్‌కు విజ్ఞప్తి చేశారు. జపాన్ పార్లమెంటును ఉద్దేశించి వర్చువల్ ప్రసంగం చేసిన ఆయన ఉక్రెయిన్‌లో శాంతిపునరుద్ధరించేందుకు రష్యాపై ఒత్తిడి పెంచిన తొలి ఆసియా దేశం జపాన్‌ అని కొనియాడారు. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో రష్యాతో జరుపుతున్న ఆన్‌లైన్ చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఉక్రెయిన్ తెలిపింది. అనేక విడతల చర్చలు జరిగినా కాల్పుల విరమణ లేదా శాశ్వత శాంతి ఒప్పందానికి రాలేకపోయినట్లు తెలిపింది. అయితే కీలకాంశాలపై చర్చలకు అమెరికా అడ్డుపడుతోందని రష్యా ఆరోపించింది. రష్యా సైనిక చర్య నేపథ్యంలో మానవతా సాయం అందించేందుకు ఏర్పడుతున్న సమస్యలపై చర్చించేందుకు రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ అధ్యక్షుడు పీటర్ మాస్కోలో పర్యటిస్తున్నారు.

ఐరోపా పర్యటనకు బైడెన్​: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న వేళ నాలుగు రోజుల పర్యటనకు ఐరోపా వెళ్లారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. రష్యా దురాక్రమణపై తమ భాగస్వామ్య దేశాల అధినేతలతో చర్చించనున్నారు. ఉక్రెయిన్​పై రష్యా రసాయనిక ఆయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని, అదే నిజమైన ముప్పు అని పేర్కొన్నారు. కీలక అంశాలపై చర్చలు చేపట్టనున్నామన్నారు. ముందుగా బ్రస్సెల్స్​ వెళ్లనున్న బైడెన్​.. అత్యవసరంగా ఏర్పాటు చేస్తున్న నాటో సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ఐరోపా సమాఖ్య, జీ7 దేశాల సదస్సులో పాల్గొననున్నారు.

ఉక్రెయిన్‌ మహిళలపై రష్యా సైనికుల వంకరబుద్ధి: ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా సేనలు అక్కడి మహిళల పట్ల వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నాయి. కొందరు రష్యా దురాక్రమణదారులు లైంగిక దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎమైన్‌ డిజెప్పర్‌ ఆరోపించారు. ఓ గ్రామంలో ఇంట్లోకి చొరబడిన రష్యా సైనికులు.. నిరాయుధుడైన ఆ ఇంటి యజమానిని చంపి అతడి భార్యపై అత్యాచారం చేసినట్టు ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు. అక్కడే ఉన్న చిన్నారిని బెదిరింపులకు గురిచేసినట్టు తెలిపారు.

45మంది రష్యన్‌ దౌత్యవేత్తల్ని బహిష్కరించిన పోలండ్‌: బ్రెస్ట్‌ నగరంలోని ఉక్రెయిన్‌ కాన్సులేట్‌ను బెలారస్‌ మూసివేసింది. తమ దేశం వదిలి వెళ్లిపోవాలంటూ పలువురు ఉక్రెయిన్‌ దౌత్యవేత్తలకు సూచించింది. బెలారస్‌లోని ఉక్రెయిన్‌ దౌత్య మిషన్‌లో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. మరోవైపు, గూఢచర్యం ఆరోపణలపై 45 మంది రష్యాన్‌ దౌత్యవేత్తలను బహిష్కరించాలని పోలండ్‌ నిర్ణయించింది.

రష్యాపై ఆంక్షల డోసు పెంచండి: జెలెన్‌స్కీ విజ్ఞప్తి: తమ దేశంపై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాపై ఆంక్షల్ని తీవ్రతరం చేసి ఒత్తిడి పెంచాలని ఉక్రెయిన్‌ అ ధ్యక్షుడు జెలెన్‌స్కీ జపాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. రష్యా వస్తువులపై వాణిజ్య నిషేధం ప్రకటించాలన్నారు. ఉక్రెయిన్‌లో శాంతిపునరుద్ధరణకు ఆసియాలో తొలిసారి రష్యాపై ఒత్తిడి పెంచిన దేశం జపానేనన్నారు. ఈ మేరకు జపాన్‌ పార్లమెంట్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ ప్రసంగించారు.

ఉక్రెయిన్‌ చేతిలో 15,600 మందికి పైగా రష్యా సైనికులు హతం: కీవ్‌: నాలుగు వారాలుగా తమ దేశంలో రష్యా కొనసాగగిస్తున్న దండయాత్రను ఉక్రెయిన్‌ బలగాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటివరకు 15,600 మంది రష్యా సైనికుల్ని అంతం చేసినట్టు ఉక్రెయిన్‌ సైన్యం వెల్లడించింది. అలాగే, 101 విమానాలు, 124 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ ట్యాంకులు, సాయుధ శకటాలు, వాహనాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది.

రష్యాకు మద్దతుగా రంగంలోకి బెలారస్​: ఉక్రెయిన్​పై దాడిలో రష్యాకు మద్దతుగా బెలారస్​ కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశం ఉందని నాటో, అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి తగినట్లే బెలారస్​ కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొంది. ఈ సమయంలో పుతిన్​కు మద్దతు చాలా అవసరం. ఏ రూపంలో అయినా అది రష్యాకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. త్వరలో బెలారస్​ దళాలు ఉక్రెయిన్​లోని వెళ్లేందుకు ఇప్పటికే అంతా సిద్ధం చేసుకొన్నారని పేర్కొన్నారు. బెలారస్​ యుద్ధంలో చేరితే.. అది సైనిక పరంగా కంటే భౌగోళిక రాజకీయ పరంగా ఎక్కువ ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చెర్నోబిల్​ ల్యాబ్​ ధ్వంసం: రేడియాక్టివ్​ వ్యర్థాల నిర్వహణ కోసం చెర్నోబిల్​ అణు విద్యుత్తు కేంద్రంలో ఏర్పాటు చేసిన కొత్త ల్యాబొరేటరీని రష్యా బలగాలు ధ్వంసం చేశాయి. ఈ ప్లాంట్​ను గతంలోనే తమ అధీనంలోకి తీసుకున్నాయి రష్యా దళాలు. 2015లో ఈ ల్యాబ్​ను ఐరోపా సమాఖ్య సాయంతో 6 మిలియన్​ యూరోల ఖర్చుతో నిర్మించారు. ల్యాబ్​లో యాక్టివ్​ సాంపుల్స్​, రేడియో న్యూక్లైడ్స్​ ఉన్నాయని, అవి ప్రస్తుతం రష్యా చేతిలో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్​ అధికారులు.

ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తాం: నాటో చీఫ్‌

ఉక్రెయిన్‌పై అణు, రసాయన ఆయుధాల్ని ప్రయోగిస్తామంటూ రష్యా బెదిరిస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నాటో అండగా నిలిచింది. అణు, రసాయన దాడులనుంచి రక్షణపొందేలా సామాగ్రిని సరఫరా చేయనున్నట్టు నాటో సెక్రటరీ జనరల్‌ జాన్‌ స్టొల్టెన్‌బర్గ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌కు రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ బెదిరింపుల నుంచి రక్షణకు సామగ్రిని పంపిణీ చేసేందుకు నాటో కూటమి దేశాలు అంగీకరించాయన్నారు.

ఇదీ చూడండి: ఉరికి వేలాడిన తండ్రి.. విగతజీవిగా కుమార్తె.. ఏం జరిగింది?

Last Updated :Mar 23, 2022, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.