'మా ఇద్దరికి దిష్టి పెట్టేశారు.. భవిష్యత్తులో డైరెక్టర్​ అవుతానేమో!'

author img

By

Published : Sep 16, 2022, 6:50 AM IST

sudheer babu

సినిమాల్లో కొందరి కాంబినేషన్​ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతుంది. అలాంటిదే హీరో సుధీర్​బాబు-మోహనకృష్ణ ఇంద్రగంటి కలయిక. వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన 'సమ్మోహనం', 'వి' సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముచ్చటగా మూడోసారి వీరిద్దరు కలిసి చేసిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుధీర్​బాబు పంచుకున్న విశేషాలివి..

చిత్రసీమలో కొన్ని కలయికలు ప్రేక్షకుల్లో ఆసక్తిని.. అంచనాల్ని పెంచుతుంటాయి. సుధీర్‌బాబు-మోహనకృష్ణ ఇంద్రగంటి కలయిక అలాంటిదే. చిత్రసీమలో కొన్ని కలయికలు ప్రేక్షకుల్లో ఆసక్తిని.. అంచనాల్ని పెంచుతుంటాయి. సుధీర్‌బాబు-మోహనకృష్ణ ఇంద్రగంటి కలయిక అలాంటిదే. 'సమ్మోహనం', 'వి' తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ.. తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు ముచ్చటించారు. ఆ విషయాలివీ..

ఇంతకీ ఆ అమ్మాయి గురించి ఏం చెబుతున్నారు?
ఏం చెబుతున్నాం అనేది ట్రైలర్‌లోనే కొంతవరకు చూపించాం. కంటి వైద్యురాలైన ఓ అమ్మాయిని చూసి తన సినిమా కోసం ఎంపిక చేయాలనుకుంటాడు ఓ దర్శకుడు. దానికి వాళ్ల ఇంట్లో అస్సలు అంగీకరించరు. మరి ఆ దర్శకుడు ఎలా ఒప్పించాడు? ఆ అమ్మాయి ఒప్పుకున్నాక ఎలాంటి సమస్యలు వచ్చాయనేది తెరపైనే చూడాలి. నేను ఇందులో ఓ సినిమా దర్శకుడిగా కనిపిస్తా.

ఇంద్రగంటి దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. మీకూ, ఆయనకీ మధ్యనున్న అనుబంధమే అందుకు కారణమా?
'మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం కానీ, సినిమానే మనల్ని తీస్తుంది' అని ఈ సినిమా వేడుకలో నేను చెప్పా. ఇంద్రగంటి రాసుకున్న కథలే మమ్మల్ని ఎంచుకుంటున్నాయనేది నా అభిప్రాయం. నన్ను నటుడిగా ఆయన నమ్మారు, ఆయన కథల్ని నేను నమ్ముతాను. అదే మా కలయికలో సినిమాలు రావడానికి కారణం. ఆయన ఎప్పుడూ ఒక కలయికని దృష్టిలో పెట్టుకుని సినిమా చేయరు. ఒకసారి అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్‌లో దర్శకుడు సుకుమార్‌ కలిసినప్పుడు కూడా ఇదే మాటే చెప్పారు. హిట్‌ ఇచ్చిన వెంటనే దర్శకులు పెద్ద స్టార్లని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తుంటారు. ఇంద్రగంటి మాత్రం తను రాసుకున్న కథలకి తగ్గట్టుగానే నటుల్ని ఎంచుకుని సినిమాలు చేస్తారు. మార్కెట్‌, ఇతరత్రా లెక్కలేవీ ఆయన పట్టించుకోరు. ఆయన కథలకి తగ్గ కథానాయకుడిని నేను కావడం అదృష్టంగా భావిస్తానంతే.

మొదట ఈ కథని ఎప్పుడు విన్నారు?
'వి' చిత్రీకరణ మధ్యలోనే ఒకసారి చెప్పారు. అయితే అది నాకోసమని కాకుండా, తన మనసులో ఉన్న కథల్ని పంచుకుంటుంటారు. అయితే ఈ కథ నా దగ్గరికి వస్తుందని అనుకోలేదు. 'సమ్మోహనం' తరహాలో ఇది కూడా సినిమా నేపథ్యంలో సాగే కథే కానీ, దానికీ దీనికీ మధ్య ఏమాత్రం పొంతన ఉండదు. 'సమ్మోహనం' అబ్బాయి, అమ్మాయి మధ్యలో సంఘర్షణ నేపథ్యంలో సాగుతుంది. ఇది మాత్రం ప్రేమ, కుటుంబం, డ్రామా అంశాలతో సాగుతుంది. ఇంద్రగంటి తీసిన సినిమాల్లో భావోద్వేగాల పరంగా బలమైన చిత్రమిదే. కృతిశెట్టి చాలా బాగా నటించింది. ఆమె 'ఉప్పెన' కంటే ముందే ఒప్పుకున్న సినిమా ఇది.

చాలా మంది దర్శకులతో కలిసి ప్రయాణం చేశారు. తెరపై దర్శకుడిగా నటించడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
ప్రతి కమర్షియల్‌ దర్శకుడికీ ఓ అభిరుచి ఉంటుంది. నా పాత్ర కూడా అంతే. కొంచెం తిక్క కూడా ఉంటుంది. ఎలాంటి సినిమాలు తీసినా ఒక బలమైన కారణం ఉంటుంది, కమర్షియల్‌ దర్శకులు తీసేది కూడా మంచి సినిమానే అనే విషయాన్ని స్పృశించిన తీరు ఆకట్టుకుంటుంది. అతను తీసేదే సినిమా అని భావించే దర్శకుడిగా కనిపిస్తా. కొంచెం స్టైలిష్‌గా, మన దర్శకులు కనిపించే తీరుకి భిన్నంగానే కనిపిస్తా. ఇదివరకు సినిమాలు చేసేటప్పుడు కథలో ఎక్కడో ఒక చోట ఇంద్రగంటి కనిపించేవారు. కానీ ఈ పాత్రలో ఆయన అస్సలు కనిపించలేదు. సినిమా నేపథ్యంలో కథే అయినా సినిమాటిక్‌ లిబర్టీస్‌ లేకుండా చాలా సహజంగా సాగుతుందీ చిత్రం.

'సమ్మోహనం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.. ఇవే కాకుండా సినిమా నేపథ్యంలో మరో కథ కూడా తీస్తానని చెప్పారు. మీకు చెప్పారా?
ఆ మూడో కథని కూడా నాకు చూచాయగా చెప్పారు. అదొక నాయికా ప్రధానమైన కథ అని ఓ చిన్న ఆధారం కూడా ఇచ్చారు. అయితే ఇప్పట్లో ఆయన తీయరు. ఇంకా వేరే జోనర్స్‌లో రాసిన మంచి కథలు ఆయన దగ్గర ఉన్నాయి. మా కలయికకి ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టారు (నవ్వుతూ). మరి ఆ సినిమాని నాతో చేస్తారో లేదో తెలియదు.

ఈ సినిమా వేడుకలో నటుడిగా మీలో పరిణతి గురించి నాగచైతన్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానిపై మీ అభిప్రాయమేమిటి?
నా కెరీర్‌లో తొలి హీరో నాగచైతన్య. తనతో ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్‌గా ఉంటుంది. నటనపరంగా నా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనే ఆలోచన కంటే కూడా, మంచి పాత్రల్ని ఎంపిక చేసుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా. దర్శకులు అలాంటి మంచి పాత్రల్ని రాశారు. అవి ప్రేక్షకులకు నచ్చడం తృప్తిగా ఉంది.

హిందీలోనూ నటించారు. అక్కడి నుంచి కొత్తగా అవకాశాలేమైనా వస్తున్నాయా?
వస్తూనే ఉన్నాయి. ఈమధ్య విడుదలైన 'బ్రహ్మాస్త్ర'లో నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ అప్పట్లో 'సమ్మోహనం'తోపాటు, పుల్లెల గోపీచంద్‌ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నా. అందుకే 'బ్రహ్మాస్త్రం' చేయలేకపోయా. ఇక్కడే ఇప్పుడు మంచి కథలు వస్తున్నాయి. ఇదివరకు మంచి కథ కోసం ఏడాదికిపైగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓ సినిమా చేస్తుండగానే, రెండు మూడు నెలలకి కొత్తగా మరో సినిమా మొదలైపోతుంటుంది. అంత మంచి కథలొస్తున్నాయి. ఈమధ్యే నా మనసుకు బాగా నచ్చిన కథలతో నాలుగు సినిమాలు చేస్తున్నా. 'హంట్‌', 'మామా మశ్చీంద్ర'తోపాటు, 'సెహరి' దర్శకుడు జ్ఞానసాగర్‌తో ఓ సినిమా, యు.వి.క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఈ ఏడాది చివరిలోపు రెండు సినిమాలు పూర్తి చేస్తాను.

తెరపైన దర్శకుడిగా కనిపించారు. మరి నిజ జీవితంలో దర్శకుడయ్యే ఆలోచనలేమైనా ఉన్నాయా?
మొదట్లో ఉండేది కాదు కానీ, ఇప్పుడైతే ఆ కల ఉంది. నేను పనిచేసింది దాదాపుగా కొత్తవాళ్లతోనే. ఒకొక్కసారి కథలో లీనమై కొన్ని సన్నివేశాలు నేనే రాసేవాణ్ని. అవి నచ్చి దర్శకులు తీసుకోవడం, కొన్నిసార్లు నా ఖర్చుతో షూట్‌ చేసి నచ్చితే తీసుకోండని చెప్పడం.. ఇలా తెలియకుండానే ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతానికైతే నటనపైనే దృష్టిపెట్టా. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానేమో తెలియదు. కథలు రాసుకోవడం అంటూ లేదు కానీ, కొన్ని పాయింట్స్‌గా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నటుడిగా అంటే 65 రోజులు సినిమాకి అంకితం చేస్తే సరిపోతుంది. కానీ దర్శకత్వం బోలెడంత శ్రమిస్తే తప్ప కథ సిద్ధం చేసుకోలేం.

ఇవీ చదవండి: రూ.200కోట్ల కేసు.. బాలీవుడ్​ స్టార్​ నటిపై 6 గంటలు ప్రశ్నల వర్షం

రూ.200కోట్ల కేసు.. బాలీవుడ్​ స్టార్​ నటిపై 6 గంటలు ప్రశ్నల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.