ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. చిన్నారి వాంగ్మూలంతో వెలుగులోకి!

author img

By

Published : Sep 28, 2022, 11:01 AM IST

Updated : Sep 28, 2022, 11:13 AM IST

Secunderabad

Wife kills husband along with boyfriend: వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న వాడిని సైతం వదిలించుకోవడానికి సిద్ధపడుతున్నారు. అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా.. క్షణిక సుఖాల కోసం కుటుంబాలను వీధిపాలు చేసుకుంటున్నారు. ప్రియుడితో ఊహల్లో తేలుతున్న భార్య... తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని... భర్తనే కడతేర్చింది ఆ ఇల్లాలు. చున్నితో హత్య చేసి ఆ తర్వాత దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రికరించి చివరకు.. దొరికిపోయింది.

Wife kills husband along with boyfriend: ప్రియుడితో కలిసి భర్తను ఇంట్లో హత్య చేసింది ఓ ఇల్లాలు... రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పెద్ద పథకాన్నే రచించింది...చేతిలో మూడున్నరేళ్ల బాలిక...మధ్యలో భర్త మృతదేహం...ద్విచక్రవాహనం నడుపుతున్న ప్రియుడు... ఇలా శవంతో 50 కిలోమీటర్లు ప్రయాణించారు. వంతెన పైనుంచి ద్విచక్ర వాహనంతో సహా మృతదేహాన్ని కిందకు తోసేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మాటలు సరిగా రాని చిన్నారి.. గిరిజన(లంబాడ)భాషలో ఇచ్చిన వాంగ్మూలం ఈ హత్యోదంతాన్ని వెలుగులోకి తెచ్చింది.

భువనగిరి మండలం అనంతారం సమీపంలో ఈ నెల 18న జాతీయ రహదారి వంతెన పైనుంచి కింద పడి మృతిచెందిన లకావత్‌ కొమ్రెల్లి(32)ది హత్యగా పోలీసులు తేల్చారు. నిందితులైన కొమ్రెల్లి భార్య భారతి అలియాస్‌ సుజాత, ఆమె ప్రియుడు బానోత్‌ ప్రవీణ్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. తామే హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. భువనగిరిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన తెలిపిన వివరాల ప్రకారం..

జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మాంతపురం గ్రామ పరిధిలోని తీటుకుంటతండాకు చెందిన లకావత్‌ కొమ్రెల్లి, భారతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఆరేళ్ల క్రితం వీరు సికింద్రాబాద్‌ వచ్చి నామాలగుండులో జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు బిడ్డలను జనగామలోని ఎస్టీ వసతి గృహంలో చేర్పించారు. చిన్న కుమార్తెతో కలిసి నామాలగుండులో ఉంటున్నారు.

రెండేళ్ల క్రితం బంధువుల వివాహ వేడుకల్లో పరిచయమైన డీజే ఆపరేటర్‌ బానోత్‌ ప్రవీణ్‌(జనగామ జిల్లా అడవికేశవపురం)తో భారతి వివాహేతర సంబంధం పెట్టుకొంది. అనుమానం వచ్చిన భర్త నిలదీశారు. దీంతో అతడిని అంతమొందించాలని భారతి నిర్ణయించుకొంది. మరోపక్క భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాలనుకున్న కొమ్రెల్లి ఈ నెల 18న సొంతూరి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. భర్త లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి రప్పించింది భారతి. కొమ్రెల్లి అదే రోజు రాత్రి ఇంటికి వచ్చారు. తన భార్య ప్రియుడితో కలిసి ఉండటాన్ని చూసి గొడవపడుతుండగా భారతి, ఆమె ప్రియుడు ప్రవీణ్‌ కలిసి కొమ్రెల్లిని చున్నీతో ఉరేసి ఇంట్లోనే అంతమొందించారు.

అదే రాత్రి శవాన్ని తీసుకొని భువనగిరి మండలం అనంతారం సమీపంలోకి తీసుకెళ్లి ద్విచక్రవాహనంతో సహా కొమ్రెల్లి మృతదేహాన్ని వంతెన పైనుంచి కిందకు తోసేశారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడికి ఇది హత్య అనే అనుమానం రావడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు.హత్య సమయంలో భారతి వద్దే ఉన్న మూడున్నరేళ్ల చిన్నారిని విచారించారు. ఇంట్లో గొడవ జరిగిందంటూ.. అమ్మ, మరో వ్యక్తి కలిసి తన తండ్రిని చంపారంటూ ఆ పాప చెప్పిందని డీసీపీ తెలిపారు. నిందితులు బానోత్‌ ప్రవీణ్‌, లకావత్‌ భారతిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

భర్తను చున్నితో చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య

ఇవీ చదవండి:

Last Updated :Sep 28, 2022, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.