ఉప్పెన చిత్రం మీకు గుర్తుందా... అందులో హీరో హిరోయిన్లు.. సముద్రం మధ్యలో పడవలో సరదాగా ప్రయాణిస్తూ ఉంటారు.. అలా ప్రయాణిస్తే ఎలా ఉంటుందో అనుకున్నారేమో వీళ్లు. మద్యం తాగేందుకు చెరువులోకి నాటు పడవను తీసుకుని వెళ్లారు. కానీ ఆ ప్రయాణం... వారిని మృత్యువు వైపు తీసుకెళ్లింది. ప్రమాదవశాత్తు ఇద్దరు అందులో పడి మునిగిపోయారు.
అసలు ఇదీ జరిగింది...
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని చెరువులోకి ఐదుగురు స్నేహితులు నాటు పడవ తీసుకుని వెళ్లారు. అయితే అందులో పవన్, నర్సింగ్ అనే ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయారు. దీనితో మిగతా ముగ్గురు వచ్చి.. స్థానికులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన స్థానికులు.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. పవన్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా.. నర్సింగ్ ఆచూకీ లభ్యం కాలేదు. గత ఈతగాళ్ల చేత నర్సింగ్ కోసం గాలిస్తున్నారు. అయితే రాత్రి సమయంలో చెరువులోకి మద్యం తాగేందుకు వెళ్లినట్లుగా సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.