కుల్సుంపురా మర్డర్​ కేసులో ముగ్గురు అరెస్ట్​.. స్నేహితులే నిందితులు

author img

By

Published : Jan 23, 2023, 4:21 PM IST

Updated : Jan 23, 2023, 5:28 PM IST

Kulsumpura murder case

Kulsumpura murder case updates: రాష్ట్ర రాజధాని ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన కుల్సుంపురాలో నడిరోడ్డుపై యువకుడిని హత్య చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న హత్య అనంతరం స్థానికులను గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఈ కేసును ఛాలెంజ్​గా తీసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 24 గంటలు గడవక ముందే కేసులో ప్రధాన నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు.. నిందితులు స్నేహితులని.. మద్యం మత్తులో వచ్చిన ఘర్షణే హత్యకు దారి తీసిందని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

Kulsumpura murder case updates: హైదరాబాద్‌ కుల్సుంపురాలో నిన్న ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని కిరాతకంగా హత్య చేసిన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆకాశ్, టిల్లు, సోనులను వెస్ట్​ జోన్​ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకొని విచారించారు. మృతుడు, నిందితులు స్నేహితులని.. మద్యం మత్తులో జరిగిన ఘర్షణే హత్యకు దారి తీసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది: ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగానే హైదరాబాద్‌లోని పురానాపూల్‌ సమీపంలో జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఈ దారుణ ఘటన జరిగింది. జియాగూడ బైపాస్‌ రోడ్డుపై ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అతడిని మరో ముగ్గురు తరుముకుంటూ వచ్చారు. ఒక్కసారిగా చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న కుల్సుంపురా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు అంబర్‌పేట బతుకమ్మకుంట వాసి అయిన కార్పెంటర్​ సాయినాథ్​గా గుర్తించారు.

సాయినాథ్ ఆదివారం సాయంత్రం ఒంటరిగా ద్విచక్ర వాహనంపై పురానాపూల్‌ వైపు నుంచి జియాగూడ మేకలమండీ మార్గంలో వెళ్తున్నారు. పీలిమండవ్‌ శివాలయం సమీపంలో ముగ్గురు నిందితులు అడ్డుగా వచ్చారు. ఇనుపరాడ్‌తో ఒకరు సాయినాథ్‌ తల వెనక బలంగా కొట్టడంతో కిందపడిపోయాడు. అనంతరం కొడవలి, కత్తి, ఇనుపరాడ్‌తో అతనిపై దాడి చేశారు. బాధితుడు సాయం కోసం కేకలు వేశాడు. పరుగెత్తాడు. అయినా వదలకుండా వెంటపడి వేటాడారు. కత్తితో ముఖం, చేతులు, కాళ్లు, పొట్ట భాగంలో నరికారు.

ట్రాఫిక్​ కానిస్టేబుల్​ గమనించి: అదే సమయంలో పురానాపూల్‌ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న గోషామహల్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ జనార్దన్‌.. ఈ దారుణాన్ని గమనించాడు. అరుచుకుంటూ ఘటనాస్థలానికి వస్తుండగానే.. నిందితులు మూసీ నదిలోకి వెళ్లే మెట్లమార్గం నుంచి దూకి పారిపోయారు. రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని కాపాడేందుకు కానిస్టేబుల్‌ ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందజేశాడు. గోషామహల్‌ ఏసీపీ ఆర్‌.సతీశ్‌కుమార్‌, కుల్సుంపుర ఇన్‌స్పెక్టర్‌ టి.అశోక్‌కుమార్‌, క్లూస్‌ టీం ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. నడిరోడ్డుపై వెంటపడి.. వేటాడి కత్తులతో దాడి చేస్తున్నా.. అడ్డుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పక్క నుంచే కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో వెళ్తున్నవారు అనేకమంది సెల్‌ఫోన్లలో అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 23, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.