ఉగ్రకుట్ర కేసులో న్యాయమూర్తి ఎదుట నిందితుల హాజరు.. జ్యుడీషియల్ రిమాండ్ విధింపు

author img

By

Published : Oct 3, 2022, 3:34 PM IST

Updated : Oct 3, 2022, 7:15 PM IST

Terrorist conspiracy foiled

Terrorist conspiracy foiled Case Update: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్రకుట్ర కేసు నిందితులను పోలీసులు సిట్​ అధికారుల విచారణ అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ముగ్గురు నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు వారిని చంచల్​గూడ జైలుకు తరలించారు. దసరా సమయంలో పేలుళ్లలు కుట్ర పన్నిన ఈ ముగ్గురిని ఆదివారం అరెస్టు చేశారు.

Terrorist conspiracy foiled Case Update: మహానగరంలో ఉగ్రకుట్ర కేసు నిందితులను పోలీసులు కోర్టుకు సెలవు కావడంతో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ముగ్గురు నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం వారిని పోలీసులు చంచల్​గూడ జైలుకు తరలించారు. అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. బేగంపేట టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో నిందితులను సిట్‌ అధికారులు విచారించారు.

హైదరాబాద్‌లో వరుస పేలుళ్లతో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, లష్కరే తోయిబాల ఆదేశాలతో వరుస దాడులతో బీభత్సం సృష్టించేందుకు మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌ అలియాస్‌ మోటు (39) ప్రయత్నిస్తున్నాడనే సమాచారంతో నగర సిట్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయమే మూసారంబాగ్‌, చంపాపేట, మలక్‌పేట ప్రాంతాల్లోని పలు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. అబ్దుల్‌ జాహెద్‌, అక్బర్‌బాగ్‌కు చెందిన మహ్మద్‌ సమీయుద్దీన్‌ అలియాస్‌ అబ్దుల్‌ సమి (39), మాజ్‌ హసన్‌ ఫరూక్‌ అలియాస్‌ మాజ్‌(29)లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో ఉగ్రకోణం వెలుగు చూసింది. జాహెద్‌ నుంచి 2 హ్యాండ్‌ గ్రనేడ్‌లు, రూ.3,91,800 నగదు, 2 సెల్‌ఫోన్లు, సమీయుద్దీన్‌ నుంచి ఒక హ్యాండ్‌ గ్రనేడ్‌, రూ.1.50 లక్షల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనం, మాజ్‌ హసన్‌ నుంచి ఒక గ్రనేడ్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రనేడ్‌లు పాకిస్థాన్‌ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు.

ఇటీవల నగరంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలను అవకాశంగా చేసుకుని మతఘర్షణలు రెచ్చగొట్టేందుకు మూసారాంబాగ్‌కు చెందిన జాహెద్‌కు పాకిస్థాన్‌ నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను కూడా ఇందుకోసం ఇతను వాడుకుంటున్నట్టు భావిస్తున్నారు. హిందూ పండుగలు, భాజపా, ఆర్​ఎస్​ఎస్​ బహిరంగ సభలు లక్ష్యంగా బాంబు పేలుళ్లతో విధ్వంసం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాన్ని అమలు చేసేందుకు దసరా పండుగను అవకాశంగా మలచుకోవాలనుకున్నారు.

నీలిరంగు గ్రనేడ్లతో దాడులతో దాడికి యత్నం: భారీ ఎత్తున పేలుళ్ల కోసం బాంబు తయారీకి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేవారు. అవతలి వైపు నుంచి ఇంటర్‌నెట్‌, ఫోన్‌ ద్వారా తయారీపై సూచనలు చేసేవారు. పోలీసు నిఘా పెరగడం, తయారీలో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో దాడులకు గ్రనేడ్లను వినియోగించాలనుకున్నారు. ఇటీవల కశ్మీర్‌లో సీఆర్​పీఎఫ్​ బలగాలపై ఉగ్రవాదులు నీలిరంగు గ్రనేడ్లతో దాడులు చేశారు. ఆ గ్రనేడ్లు చైనాలో తయారైనట్టు బయటపడింది. రెండు నెలల క్రితం అవే గ్రనేడ్లు పాకిస్థాన్‌ నుంచి కశ్మీర్‌ చేరాయి.

నెల రోజుల క్రితం అక్కడి నుంచి వ్యాన్‌లో గ్రనేడ్లు నిల్వ చేసిన పెట్టెను నగర శివార్లలో జాహెద్‌కు అందినట్టు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా గ్రనేడ్లను భద్రపరిచారు. నిందితుల నుంచి నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న గ్రనేడ్లు నీలి రంగులో ఉన్నాయి. చైనాలో తయారయిన ఈ గ్రనేడ్లు పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడులకు ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 2006లో ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓడియన్‌ థియేటర్‌లో జరిగిన దాడి మొదటి సారి గ్రనేడ్‌తో జరిగింది.

పాక్‌ ఆదేశాల కోసం వెయిటింగ్: గ్రనేడ్లు ఎక్కడ విసరాలి, ఎవరిని రంగంలోకి దించాలి. ప్రాణనష్టం కలిగించేందుకు ఉన్న అవకాశాలపై ఉగ్రమూకలు చర్చించుకున్నాయి. పోలీసు నిఘా నుంచి తప్పించుకుని తమ ప్రణాళిక అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పాక్‌ నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. వరుస ఘటనలు, పండుగలతో కేంద్ర నిఘా వర్గాలు నగర పోలీసులను అప్రమత్తం చేశాయి. పాత నేరస్తులు, అనుమానితుల పై నిఘా ఉంచిన సిట్‌, సీసీఎస్​, స్పెషల్ బ్రాంచ్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు... దాడుల గురించి తెలవడంతో అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో రహస్యంగా ఆపరేషన్‌ చేసి జాహెద్‌, సమీయుద్దీన్‌, హసన్‌ ఫారూక్‌లను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 3, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.