తల్లిని చంపిన కుమారుడి కేసులో మరో మలుపు.. స్నేహితుడి చేతిలోనే..

author img

By

Published : May 12, 2022, 5:30 PM IST

Updated : May 12, 2022, 10:55 PM IST

తల్లిని చంపిన కుమారుడి కేసులో మరో మలుపు.. స్నేహితుడి చేతిలోనే..

17:28 May 12

తల్లిని చంపిన కుమారుడి కేసులో మరో మలుపు

కడుపున పుట్టకున్నా కన్న పేగును మించిన ప్రేమతో చూసుకున్న తల్లి పాలిట కాలయముడిగా మారాడు. ఎంతో సంబరంతో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్న ఆ మాతృమూర్తిని కనికరం లేకుండా అంతమొందించాడు.. ఓ దత్తత పుత్రుడు. కానీ, తల్లిని చంపిన పాపం ఎక్కువ కాలం నిల్వలేదు. అమ్మను హతమార్చి పారిపోయిన ఆ కసాయిని మృత్యువు ఎంత దూరం వదల్లేదు. చేసిన దారుణమో వెంటేసుకెళ్లిన పాపమో.. ఆ కర్కోటకుడు కిరాతకంగా హత్యకు గురయ్యాడు.

డబ్బుల కోసం తల్లినే హత్య చేసిన యువకుడు.. ఆ డబ్బు కారణంగానే మరొకరి చేతిలో హత్యకు గురయ్యాడు. సరూర్​నగర్ పీఎస్ పరిధిలో ఈ నెల 7వ తేదీ తెల్లవారుజామున భూదేవి అనే మహిళ హత్యకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా.. ఆమె కుమారుడు సాయితేజనే హత్య చేసినట్లు తేల్చారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు సాయితేజ ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో చేతిలో సంచితో వెళ్తున్నట్లు గుర్తించారు. ఇంట్లో బీరువా తెరిచి చూడగా అందులో ఉన్న 10లక్షల నగదు, 35తులాల బంగారు మాయమైనట్లు గుర్తించారు. ఇంటికి సమీపంలో ఉండే శివ అనే యువకుడితో స్నేహం పెరిగిన తర్వాతనే సాయితేజ దురలవాట్లకు బానిసైనట్లు మృతురాలి భర్త జంగయ్య యాదవ్ పోలీసులకు తెలిపారు.

జంగయ్య, భూదేవి దంపతులకు సంతానం లేకపోవడంతో 1995లో సాయితేజను దత్తత తీసుకున్నారు. సమీప బంధువుల కుమారుడైన సాయితేజకు మూడు రోజుల వయసున్నప్పుడు దత్తత తీసుకున్న భూదేవి.. కుమారుడిని కంటికి రెప్పలా చూసుకుంది. సాయితేజకు వివాహం చేసేందుకు తండ్రి జంగయ్య సంబంధాలు చూస్తున్నాడు. దీనికోసం ఇటీవలే 10లక్షల నగదు, 35 తులాల బంగారు ఇంట్లో తీసిపెట్టాడు. వ్యసనాలకు బానిసైన సాయితేజ... తన స్నేహితుడు శివ చెప్పిన మాటలు విని పక్కదారి పట్టాడు. కన్న కొడుకు కానందున భూదేవి, జంగయ్య నీపై వివక్ష చూపిస్తున్నారని సాయితేజకు నూరిపోశాడు. ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొస్తే.. సరదాగా గడపొచ్చని శివ చెప్పిన మాటలు విన్న సాయితేజ.. పథకం ప్రకారం తల్లి భూదేవి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత బీరువాలో ఉన్న నగదు, బంగారంతో ఉడాయించాడు. మరోవైపు తల్లిని చంపేందుకు వారం క్రితమే సాయితేజ పథకం రచించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియురాలికి డబ్బులు ఇచ్చేందుకు తల్లిని చంపినట్లు తెలిపారు. ఇంట్లో పనిచేసి మానేసిన డ్రైవర్‌ సాయంతో హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు.

శివతో పాటు సాయితేజ ఈ నెల7వ తేదీన శ్రీశైలం వెళ్లారు. అక్కడ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో మల్లెల తీర్థం చూసేందుకు ఈ నెల 10వ తేదీన వెళ్లారు. అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మల్లెల తీర్థం ఉంది. ఇక్కడికి మద్యం బాటిళ్లను తీసుకెళ్లి ఇద్దరూ కలిసి పీకలదాకా తాగారు. ఆ తర్వాత సాయితో గొడవ పడిన శివ అతని తలపై రాయితో మోదాడు. సాయితేజ మృతి చెందడంతో అతని మృతదేహాన్ని నీళ్లగుంతలోకి తోసేశాడు. హత్య గురించి పోలీసులకు తెలిసిపోతుందనే భయంతో.. శివ గురువారం ఉదయం సరూర్ నగర్ పీఎస్​లో లొంగిపోయాడు. శివను అదుపులోకి తీసుకొని పోలీసులు పూర్తి వివరాలు సేకరించారు. ఆ తర్వాత అమ్రాబాద్ మండలం మల్లెలతీర్థానికి శివను తీసుకెళ్లి సాయితేజ మృతదేహాన్ని గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో సాయితేజ మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం పూర్తి చేయించారు.

భూదేవి హత్యలో ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సాయితేజకు ఈ ముగ్గురు కూడా స్నేహితులని పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యలో వీళ్ల పాత్ర ఎంతవరకు ఉందనే విషయాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. శివను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 10లక్షల నగదుతో పాటు... 35 తులాల బంగారాన్ని ఏం చేశారనే కోణంలో ఆరా తీస్తున్నారు. సాయితేజ మానసిక సమస్యలతో బాధపడేవాడని తండ్రి జంగయ్య పోలీసులకు తెలిపాడు. చికిత్స పొందుతున్న సాయితేజకు స్నేహితులు లేనిపోని మాటలు చెప్పి హత్యకు ప్రోత్సహించి ఉండొచ్చని జంగయ్య యాదవ్ అనుమానం వ్యక్తం చేశాడు. సాయితేజను హత్య చేసి అతని వద్ద ఉన్న డబ్బు, బంగారం తీసుకోవాలనే ఉద్దేశంతోనే శివ, శ్రీశైలంతో పాటు నల్లమల అటవీ ప్రాంతంవైపు తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 12, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.