Crime: తక్కువ ధరకే కిలో బంగారమన్నాడు.. 32 లక్షలతో ఉడాయించాడు

author img

By

Published : Aug 5, 2021, 10:35 PM IST

Updated : Aug 5, 2021, 11:38 PM IST

Crime

తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి 32 లక్షలు కాజేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ ఎయిర్​పోర్టులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేసి 25 లక్షల నగదు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్ అధికారులుగా నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేసిన ఇద్దరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 25 లక్షల నగదు, 4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని కడపకు చెందిన సుధాకర్ వృత్తిరీత్యా చేనేత పని చేసేవాడు. డబ్బులు సరిపోకపోవటంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అమాయకులను మోసం చేయడం మొదలుపెట్టాడు.

5 నెలల క్రితం రమణ అనే వ్యక్తి ద్వారా ఏపీలోని విజయవాడుకు చెందిన రాంప్రసాద్​ను పరిచయం చేసుకున్నాడు. తను ఎయిర్​ ఇండియాలో పని చేస్తున్నట్లు ఫేక్​ ఐడీ కార్డు చూపించి రాంప్రసాద్​ను నమ్మించాడు. తనకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తెలుసంటూ చెప్పాడు. నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని కస్టమ్స్ అధికారిగా రాంప్రసాద్​కు పరిచయం చేశాడు. ఎయిర్​పోర్టులో వివిధ దేశాల నుంచి బంగారం స్మగ్లింగ్​ చేసే బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారని చెప్పాడు. ఆ స్వర్ణాన్ని తక్కువ ధరకు ఇప్పిస్తానని రాంప్రసాద్​ను నమ్మించారు.

32 లక్షలు కేజీ బంగారం

32 లక్షలకు కేజీ బంగారం ఇప్పిస్తానని రాంప్రసాద్​ను నమ్మించాడు. గత నెల 19వ తేదీన రాంప్రసాద్​ 32 లక్షలు తీసుకొని సుధాకర్​తో కలిసి విమానాశ్రయానికి వెళ్లాడు. రాంప్రసాద్​ను పార్కింగ్ వద్ద నిలబెట్టి... 32లక్షల నగదు తీసుకొని సుధాకర్ విమానాశ్రయం లోపలికి వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసుకొని సుధాకర్ వేరే దారిలో కడప వెళ్లిపోయాడు. కస్టమ్స్ అధికారిగా నటించిన నాగార్జునకు లక్ష రూపాయలు ఇచ్చిన సుధాకర్... మిగతా డబ్బులు తీసుకెళ్లాడు. భార్యకు 2 లక్షలతో 4 తులాల బంగారం ఇప్పించాడు.

ఆ తర్వాత వారణాసి వెళ్లి అక్కడ హుండీలో 2 లక్షల రూపాయలు వేశాడు. ఐదు రోజుల అక్కడే లాడ్జీలో ఉన్న సుధాకర్ కొంత డబ్బును ఖర్చు చేశాడు. ఈ నెల 5వ తేదీ హైదరాబాద్​కు చేరుకొని కడపకు వెళ్లేందుకు ఎంజీబీఎస్​లో ఉండగా... సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్​ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎస్​వోటీ అడిషనల్​ డీసీపీ సందీప్​, సీఐ వెంకట్​ రెడ్డి, ఎయిర్​ పోర్టు సీఐ విజయ్​ కుమార్​ సంయుక్త కృషితో నిందితుడిని అరెస్ట్​ చేశారు. ఎయిర్​ పోర్టులో పట్టుబడే ఏ వస్తువులు బయట అమ్మరని చెప్పారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచించారు.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్ ముఠా అరెస్ట్​... రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్‌

Last Updated :Aug 5, 2021, 11:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.