వేరు వేరు ప్రమాదాల్లో నలుగురు యువకులు దుర్మరణం

author img

By

Published : Dec 25, 2022, 12:04 PM IST

Bike accident

రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రో‌డ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు దుర్మరణం చెందారు. జీడిమెట్ల పరిధి గండిమైసమ్మ వద్ద అతివేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం.. రోడ్డు పక్కనే ఉన్న ఓ దుకాణం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో సాగర్‌, శివ అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్​ నగర శివార్లలోని జీడిమెట్ల పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని గండి మైసమ్మ నుంచి షాపూర్​నగర్​ వైపు తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇద్దరు యువకులు బైక్​పై వెళ్తున్నారు. ఇంతలో వారి వాహనం అదుపుతప్పి ఓ గోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో బైక్​​ నడుపుతున్న క్రాంతి కుమార్​(19) అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక కూర్చున్న సందీప్​(20) తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతి వేగమే ప్రమాదానికి కారణమని వెల్లడించారు.

మరోవైపు.. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తొర్రూరు మండలం సోమవారం గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్​ను బైక్​ వెనక నుంచి ఢీకొన్న ఘటనలో మేకల సాగర్, శివబోయిన శివ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరిలో మేకల సాగర్ పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్నాడు. ఉద్యోగం రావాలని అన్నారం షరీఫ్ దర్గాను దర్శించుకునేందుకు తోటి మిత్రుడు శివతో కలిసి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.