అనిశా వలలో మరో అవినితి తిమింగలం.. రోజుకు లక్ష లక్ష్యంతో లంచాల మేత..!

author img

By

Published : Oct 22, 2021, 4:47 AM IST

rajendra nagar sub register arrested for taking bribe

ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. జీపీఏ రద్దు, భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లక్షల రూపాయలు డిమాండ్ చేసి లంచం స్వీకరిస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీని పట్టుకున్నారు. ఈ వ్యవహరంలో అతడికి సహరించిన డాక్యుమెంట్ రైటర్ వాసును కూడా అదుపులోకి తీసుకున్నారు. సబ్​రిజిస్ట్రార్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. దాడుల సమయంలో అతడు ఏసీబీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు.

జీపీఏ రద్దు, భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఐదున్నర లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి.. స్వీకరిస్తున్న రాజేంద్రనగర్ సబ్​రిజిస్ట్రార్ హర్షద్ అలీ అనిశా అధికారులకు అడ్డంగా చిక్కాడు. లంచం స్వీకరించే విషయంలో అతడికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్ వాసును కూడా అధికారులు పట్టుకున్నారు. అయితే... ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్​ను పట్టుకున్న సమయంలో హర్షద్ అలీ తన వద్ద ఉన్న ఫోన్​ను కన్పించకుండా చేశాడు. అధికారులు ఎంత అడిగినా.. ఫోన్ తన దగ్గర లేదంటూ... సమాధానమిచ్చాడు. ఫోన్​లో కీలక సమాచారం ఏదైనా ఉండవచ్చని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.

హర్షద్ అలీ ప్రత్యేకంగా లంచాలు వసూలు చేసేందుకు ఐదుగురు వ్యక్తులను నియమించుకున్నట్లు అనిశా గుర్తించింది. అతడు నియమించుకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చేవారి దగ్గర నుంచి లంచాలు డిమాండ్ చేసి.. హర్షద్ అలీకి సమర్పిస్తున్నట్లు అనిశా అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ నెలలోనే ఇప్పటి వరకు హర్షద్ అలీ లంచాల రూపంలో రూ. 50 లక్షలకు పైగా దండుకున్నట్లు ఏసీబీ భావిస్తుంది. ప్రతిరోజూ రెండు లక్షల రూపాయలు వసూలు చేయాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ, డాక్యుమెంట్ రైటర్ వాసును అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని రేపు కోర్టులో హాజరుపర్చనున్నారు. సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీ అవినీతి లీలలు బయటపెట్టేందుకు అనిశా అధికారులు ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. అతడి నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.