Old Couple Died in Nalgonda : బతికున్నప్పుడే కాదు.. నీ చితిలోనూ తోడై నేనొస్తానమ్మా..!

author img

By

Published : Jan 13, 2022, 10:25 AM IST

Old Couple Died in Nalgonda

Old Couple Died in Nalgonda : 70 ఏళ్ల వైవాహిక జీవితం.. ఎన్నో కష్టనష్టాలను కలిసి ఎదుర్కొన్నారు. మరెన్నో ఆటుపోట్లను అలవోకగా అధిగమించారు. ఇంకెన్నో మధురస్మృతులను తమ గుండెల్లో పదిలం చేసుకున్నారు. కాటికి కాలు చాపే వయసొచ్చినా.. పిల్లల వద్దకు వెళ్లకుండా.. ఒకరికొకరు అన్నట్లుగా బతికారు. చివరకు ఒకే రోజు కన్నుమూశారు. భార్య మరణం తట్టుకోలేని ఆ వృద్ధుడు పురుగుల మందు తాగి.. చితిలో ఆమెకు తోడుగా వెళ్లాడు.

Old Couple Died in Nalgonda : 'ఏడు దశాబ్దాలకు పైగా అన్యోన్యంగా సాగిన వైవాహిక బంధం వారిది. వృద్ధులైనా పిల్లల వద్దకు వెళ్లకుండా.. తమ ఊరిలోనే ఒకరికొకరు ఆసరాగా జీవనయానం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భార్య మృతి చెందగా.. ఆ వెంటనే భర్త సైతం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

Husband and Wife Died in Nalgonda : స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్ర అంతిరెడ్డి(90), లక్ష్మమ్మ(78) దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారంతా కుటుంబాలతో పట్టణాల్లో స్థిరపడ్డారు. ఈ వృద్ధ దంపతులు ఉన్న ఊరిని వీడలేక ఇంటిపట్టునే.. ఒకరికొకరు తోడుగా జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి లక్ష్మమ్మ బుధవారం తెల్లవారుజామున కన్నుమూసింది. ఈ విషయాన్ని గమనించిన అంతిరెడ్డి.. విషం తాగారు. తెల్లవారినా ఇద్దరూ బయటకు రాకపోవడంతో పక్కింటి వారు వచ్చి చూడగా అంతిరెడ్డి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. భార్య లక్ష్మమ్మ చనిపోయి ఉంది. అంతిరెడ్డిని చికిత్స నిమిత్తం దేవరకొండకు తరలిస్తుండగా దారిలోనే తుదిశ్వాస విడిచారు. భార్య లేని లోకంలో నిమిషమైనా ఉండలేక ఆ పండు వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది. అంతిరెడ్డి-లక్ష్మమ్మను ఒకే చితిపై కుటుంబసభ్యులు దహనం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.