Mystery Suicide: వెళ్లిపోయారనుకున్నవాళ్లు ఉరికి వేలాడుతూ కనిపించారు..

author img

By

Published : Sep 2, 2021, 4:47 PM IST

Mystery Suicides in lankapally village

వారం రోజుల క్రితం ఇద్దరు వివాహితులు.. వివాహేతర సంబంధంతో ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఇది తట్టుకోలేక ఆ వివాహిత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా చూస్తే... అదే కాలనీలోని ఓ ఇంట్లో వెళ్లిపోయిన ఇద్దరు అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. వివాహిత భర్తే.. వాళ్లిద్దరిని చంపేసి.. ఉరికి వేలాడదీసి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక.. అతడి మృతితో భయపడి.. వీళ్లిద్దరు సూసైడ్​ చేసుకున్నారా..? అసలు జరిగిందేంటీ..?

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన పచ్చి నీళ్ల ధర్మయ్య(30), ఇంజమల్ల కృష్ణవేణి(27) వివాహితులు. ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధంతో... వారం రోజుల క్రితం ధర్మయ్య, కృష్ణవేణి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి కృష్ణవేణి భర్త బాలయ్య తీవ్ర మనస్తాపంతో మూడు రోజుల కిందట.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అదే కాలనీలో.. మరో ఇంట్లో..

ఇదిలా ఉండగా... అదే కాలనీలోని ఖాళీగా ఉంటున్న మరో ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని చుట్టుపక్కల వారు గమనించారు. ఇంటిని పరిశీలించగా.. ధర్మయ్య, కృష్ణవేణి ఉరికి వేలాడుతూండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి.. స్థానికులను విచారించారు.

చంపేసి చనిపోయాడా.. చనిపోయారా..?

వివాహేతర సంబంధం తెలిసీ బాలయ్యే.. ఇద్దరిని చంపి ఉరికి వేలాడదీశాడని.. ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బాలయ్య చనిపోవటం వల్ల భయంతో... ధర్మయ్య, కృష్ణవేణి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీరు చనిపోయి సుమారు నాలుగు రోజులు అయ్యుండొచ్చని అనుమానిస్తున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వేలిముద్రల నిపుణులను రప్పించి ఆధారాలు సేకరించారు. శవపరీక్ష నివేదిక ఆధారంగా హత్యా..? ఆత్మహత్యా..? అనేది తేలుతుందని సీఐ కరుణాకర్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.