MURDER: భార్యను దూషించాడని... బండరాయితో కొట్టి చంపేశాడు!

author img

By

Published : Sep 11, 2021, 11:05 AM IST

MURDER

భార్యమీద ప్రేమ. పైగా ఆ రోజు ఆమె పుట్టిన రోజు. ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో వేడుక నిర్వహించాడు. అదే వేడుకలో ఓ వ్యక్తి... పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమెను తీవ్రంగా దూషించాడు. దీంతో అతని మీద పగ పెంచుకున్న భర్త.. అతనిని బండరాయితో కొట్టి చంపాడు.

పుట్టినరోజు వేడుకలో జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. భార్యను దూషించాడనే కోపంతో పగ పెంచుకొన్న భర్త... ఆ వ్యక్తిని హతమార్చేదాక నిద్రపోలేదు. మాయమాటలు చెప్పి మద్యం తాగించి.. ఘర్షణకు దిగి బండ రాయితో కొట్టి హత్యచేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గోపీనేనిపాలెంకు చెందిన రమేశ్​​... ఈనెల ఆరో తేదీన సూర్యాపేట జిల్లా కోదాడలో అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను చేపట్టి హత్య కేసును ఛేదించారు. కోదాడ పట్టణ సీఐ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం... వత్సవాయి మండలానికి చెందిన బొబ్బిలిపాటి రమేశ్​​​... అదే మండలానికి చెందిన గంటసాల వెంకటేశ్వర్ల భార్య పుట్టినరోజు వేడుకకు వెళ్లాడు. వేడుకలో రమేశ్​​​, వెంకటేశ్వర్లుకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమేశ్​​... వెంకటేశ్వర్ల భార్యను తీవ్రంగా దూషించాడు.

ప్రణాళిక ప్రకారం..

తన భార్యను దూషించాడని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశ్వర్లు... రమేశ్​​ను ఎలా అయినా అంతమొందించాలనుకున్నాడు. దీనికోసం ప్రణాళిక కూడా వేసుకున్నాడు. రమేశ్​​​కు మాయమాటలు చెప్పి... కోదాడకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగారు. తిరుగు ప్రయాణంలో రమేశ్​​తో వెంకటేశ్వర్లు ఘర్షణకు దిగాడు. కాలితో తన్ని... విచక్షణారహితంగా బండరాయితో కొట్టి చంపి పరారయ్యాడు.

ఉదయం పట్టణం సమీపంలోని ఓ వెంచర్లో రమేశ్​ మృతదేహం స్థానికుల కంటపడింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలానికి చేరుకుని గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రమేశ్​ అన్న బొబ్బిలపాటి శ్యాంబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును ఛేదించి... వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. భార్యను దూషించినందుకే హత్య చేసినట్లు వెంకటేశ్వర్లు ఒప్పుకున్నాడని... కోదాడ పట్టణ సీఐ నరసింహరావు వెల్లడించారు. నిందితుడిపై గతంలో కూడా హత్యాయత్నం, దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. నిందితుడు నుంచి ఓ ద్విచక్రవాహనం, చరవాణి హత్యకు వినియోగించిన బండ రాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని.. యువకునిపై అన్న దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.