GIRL SUICIDE: ప్రేమ పేరుతో ఉపాధ్యాయుడి మోసం.. తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

author img

By

Published : Aug 26, 2021, 10:09 AM IST

Updated : Aug 26, 2021, 11:28 AM IST

love-cheated-girl-commits-suicide-in-mahabubabad-district

కన్నవాళ్లు కాదని పారేస్తే కనికరించి చేరదీశారు. ఆడపిల్లైనా అపురూపంగా పెంచుకున్నారు. కానీ ప్రేమ పేరిట ఓ ఉపాధ్యాయుడి చెప్పిన మాటలు నమ్మి అతనితో పాటు వెళ్లింది. కూతురు పారిపోవడంతో.. తల్లిదండ్రులు గుండెపగిలేలా ఏడ్చారు. కానీ ఉపాధ్యాయుడు మోసం చేసినట్లు గ్రహించి మళ్లీ తల్లిదండ్రుల చెంతకు చేరింది ఆ బాలిక. కూతురు తప్పు చేసి వెళ్లిందనే కోపం కంటే.. మళ్లీ తమ దగ్గరకొచ్చిందనే సంతోషమే ఎక్కువైంది వారికి. కానీ మానసిక క్షోభ భరించలేక ఆత్మహత్య చేసుకొని ఆ అమ్మానాన్నలను మరోసారి అనాథలను చేసి వెళ్లిపోయింది.

పుట్టింది అమ్మాయని రైల్వేస్టేషన్​లో వదిలి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. సంతానం లేకపోవడంతో మహబూబ్​ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన దంపతులు.. రైల్వే స్టేషన్​లో దొరికిన పాపను తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచారు. కన్నబిడ్డ కాకపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. పాపకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుని ఆమెను చదివించేందుకు ఎంతగానో కష్టపడ్డారు. కరోనా సమయంలో ఆన్​లైన్ తరగతులు కారణంగా... బాలికకు ఓ ఫోన్​ను కూడా కొనిచ్చారు. అదే ఆమె పాలిట శాపమైంది.

మహారాణిలా చూస్కుంటా.. పారిపోదాం..

ఆమె చదువుకునే ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు బాలికపై కన్నేశాడు. ఆన్​లైన్ తరగతుల నెపంతో... ఆమెతో రోజూ మాట్లాడేవాడు. చాటింగ్ కూడా చేసేవాడు. అలా ఆ మైనర్ బాలికను ప్రేమలోకి దించాడు. అప్పుడప్పుడూ బయట కలుద్దాం రమ్మంటూ... శారీరకంగానూ వాడుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకొని.. మహారాణిలా చూసుకుంటానని చెప్పి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చాడు. అతని మోజు తీరేవరకు బాలికతో గడిపి... చెప్పకుండా పారిపోయాడు.

కూతురిపై ప్రేమతో చేరదీసిన తల్లిదండ్రులు

అతను ఎంతకీ రాకపోయేసరికి మోసపోయినట్లు గ్రహించిన బాలిక.. చేసేదేం లేక ఇంటికి చేరుకుంది. పెంచిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పి క్షమించమంది. బాలిక మీద ప్రేమతో ఆమెను చేరదీశారు. ఆమెను మోసం చేసిన ప్రైవేటు ఉపాధ్యాయుడు మహేష్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్​కు తరలించారు. ఇక సమస్య తీరిందనుకొని బాలిక తల్లిదండ్రులతో హాయిగా గడిపింది.

ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య..

అంతలోనే... న్యాయస్థానంలో విధులు నిర్వహించే ఓ పోలీస్ హోంగార్డు వాళ్ల ఇంటికొచ్చాడు. కేసు విషయంలో గురువారం బాలిక న్యాయస్థానానికి రావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లి అందరి ముందు తాను మోసపోయినట్లు చెప్తే... తన పరువు పోతుందని బాలిక భయపడిపోయింది. రోజంతా ఏం తినకుండా, ఏడుస్తూనే ఉంది. ఏం కాదంటూ తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. కాసేపు పడుకోమని తల్లి చెప్పగా... గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఓ సూసైడ్ నోట్ రాసిపెట్టి ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ బాలిక ఇంట్లోంచి రాకపోవడంతో... అనుమానమొచ్చిన తల్లి తలుపులు తెరిచి చూసి నిర్ఘాంతపోయింది. ఇన్నాళ్లు ప్రాణంగా పెంచుకున్న కూతురు ఫ్యాన్​కు వేలాడుతూ ఉండటం చూసి గుండలవిసేలా రోదించింది.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. "నేను ఒక బ్యాడ్ గర్ల్. నాకు నా స్నేహితులు, అమ్మానాన్నలంటే చాలా ఇష్టం" అంటూ బాలిక రాసిన సూసైడ్ నోట్​ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: LOVERS IN HC: ప్రాణ హాని ఉందని హైకోర్టును ఆశ్రయించిన ప్రేమజంట

Last Updated :Aug 26, 2021, 11:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.