చంకలో చిన్నారిని కాటేసిన పాము..ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృత్యువాత

author img

By

Published : Sep 7, 2021, 10:21 AM IST

.ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృత్యువాత

పది నెలలు నిండని పాలబుగ్గల పసితనం.. బోసి నవ్వుల మోముతో కన్నతల్లిని మైమరపించే రూపం.. కేరింతలు కొడుతూ తనలో తానే ఆనందపడే ప్రాయం.. అలాంటి అభంశుభం తెలియని ఓ చిన్నారిని కనికరం లేని మృత్యువు.. కాలనాగు రూపంలో కాటేసి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని ముంపు గ్రామం లక్ష్మణాపురంలో చోటు చేసుకుంది.

లక్ష్మణాపురం గ్రామానికి చెందిన బాణావత్‌ గణేశ్‌-దివ్య దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం. ఆదివారం సాయంత్రం తమ పది నెలల కుమారుడు భవిత్‌ను తల్లి చంకలో ఎత్తుకొని ఇంట్లో ఆడిస్తూ.. చిన్నారికి కిటికీలో ఉన్న ఆటబొమ్మలను ఇద్దామని తల్లి కిటికీ వద్దకు వెళ్లింది. ఆ ఇంటి లోపల గోడలకు ప్లాస్టరింగ్‌ చేయకపోవడంతో అప్పటికే ఇటుకల మధ్యలో దూరి ఉన్న తాచుపాము చిన్నారి కాలుపై కాటు వేసింది. బాబు ఉలికిపాటును గమనించిన తల్లి అటువైపు తిరిగేలోపే మళ్లీ కాటేసింది.

ఈ హఠాత్పరిణామానికి భయపడిన తల్లి కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే భవిత్‌ ప్రాణాలు విడిచాడు. క్షణాల వ్యవధిలో తన కోడుకు కళ్లెదుటే కన్నుమూయడంతో ఆ తల్లి రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు.

చీకటి పడటంతో గ్రామస్థులు పాము బయటకు రాకుండా కాపలా కాశారు. సోమవారం చౌటుప్పల్‌ నుంచి పాములు పట్టే వ్యక్తిని రప్పించి తాచుపామును బంధించారు.

ఇదీ చదవండి:

Air India Ants: విమానంలో చీమల దండు- ఆలస్యంగా ప్రయాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.