Black Magic: చేతబడి చేస్తుందన్న అనుమానంతో భార్యనే నరికి చంపాడు

author img

By

Published : Jul 1, 2021, 4:39 PM IST

husband-killed-his-wife-for-suspicion-of-practicing-black-magic

తన అనారోగ్యానికి భార్యే కారణమనుకున్నాడు. ఆమె మంత్రాలు చేయటం వల్లే.. తన ఆరోగ్యం దెబ్బతింటోందని అనుమానం పెంచుకున్నాడు. తనను హతమార్చాల్సిందేనని నిశ్చయించుకుని.. అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఈ అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం నర్సింగాపూర్​లో జరిగింది.

ఆధునికత ఎంత పెరుగుతున్నా... కొన్ని ప్రాంతాల్లో మాత్రం మూఢనమ్మకాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. చేతబడులు చేస్తున్నారన్న అనుమానాలతో సొంత మనుషులనే కిరాతకంగా హతమారుస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి పలు ఘటనలు వెలుగు చూడగా.. ఇది కాస్తా భిన్నం. తన భార్యనే మంత్రాలు చేస్తుందని అనుమానించిన భర్త... ఏకంగా నరికి చంపటం అందరిని ఉలిక్కిపడేలా చేస్తోంది.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్సింగాపూర్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై మంత్రాలు చేస్తుందని అనుమానంతో భార్యను భర్తే కిరాతకంగా చంపడం గ్రామంలో కలకలం రేపింది. సింగరేణి రిటైర్డ్​ ఎంప్లాయి లింగయ్య, లక్ష్మి దంపతులు.. గ్రామంలో నివాసముంటున్నారు. లింగయ్య పదవీ విరమణ పొందినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో లింగయ్య తరచూ.. అనారోగ్యం బారిన పడుతున్నాడు.

భార్య మంత్రాలు చేయడం వల్లనే తను అనారోగ్యం పాలవుతున్నానని లింగయ్య అనుమానం పెంచుకున్నాడు. అనుమానమే పెనుభూతమై.. లింగయ్యలో భార్యను చంపేయాలన్నంత కోపాన్ని పెంచింది. ఎలాగైనా తన భార్యను హతమార్చాలని నిశ్చయించుకున్న లింగయ్య పథకం రచించాడు. ఈరోజు(గురువారం) తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంట్లో ఉన్న గొడ్డలితో అత్యంత పాశవికంగా నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు.

ఘటనా స్థలాన్ని జైపూర్ ఏసీపీ నరేందర్, సీఐ సంజీవ్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. లింగయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.