20 ఏళ్లకు కలిగిన సంతానం, పెళ్లైన తొమ్మిది రోజులకే విషాదం

author img

By

Published : Aug 30, 2022, 10:32 AM IST

20 ఏళ్లకు కలిగిన సంతానం, పెళ్లైన తొమ్మిది రోజులకే విషాదం

ఒక్కగానొక్క కొడుకు. పెళ్లైన 20 ఏళ్లకు కలిగిన సంతానం. ఇటీవల కుమారుడికి పెళ్లి చేసి తమ బాధ్యతను తీర్చుకున్నారు ఆ వృద్ధ తల్లిదండ్రులు. తమకు కొడుకు, కోడలు ఆసరాగా ఉంటారని భావించారు. కానీ ఆ కలలు ఎంతో కాలం నిలువలేదు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు ప్రాణాలను విడిచాడు. కోడలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెళ్లైన తొమ్మిది రోజులకే కుమారుడు ప్రాణాలు కోల్పోయి వృద్ధాప్యంలోని ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద సోమవారం చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండల కేంద్రానికి చెందిన ములకలపల్లి రాములు-మైసమ్మ దంపతులు చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉండేవారు. అక్కడే వాచ్‌మెన్‌గా పని చేసేవారు. కుమారుడు వీరభద్రం(25)ను ఎంతో కష్టపడి చదివించారు. వృద్ధాప్యం రావడంతో ఏడాది క్రితమే స్వగ్రామం ఆత్మకూరు(ఎస్‌)కు వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలో దగ్గరి బంధువు, మేనమామ అయిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం అనాజిపురానికి చెందిన పేర్ల సైదులు-విజయ దంపతుల పెద్ద కుమార్తె ప్రణీత(20)తో వీరభద్రంకు వివాహం నిశ్చయమైంది. ఈ నెల 21న ఆత్మకూరు(ఎస్‌) మండలం నెమ్మికల్‌ సమీపంలోని దండుమైసమ్మ దేవాలయం వద్ద వైభవంగా పెళ్లి జరిపించారు. ఇంకా పదహారు రోజుల పండుగ కూడా పూర్తి కాలేదు. అంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రణీత తల్లిదండ్రులు కూడా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లోనే నివాసం ఉంటూ వాచ్‌మెన్‌గా పని చేస్తారు.

వీరభద్రం, ప్రణీత


హైదరాబాద్‌కు వెళ్తూ.. వీరభద్రం హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌లో ఉన్న రిలయన్స్‌ జియో డిజిటల్‌ స్టోర్‌లో పని చేస్తాడు. వీరభద్రం పెళ్లికి వారం రోజుల ముందే సెలవు పెట్టాడు. పెళ్లి జరిగి వారం రోజులు అవుతుందని విధుల్లో చేరేందుకు హైదరాబాద్‌కు భార్య ప్రణీతతో కలిసి ఆత్మకూరు(ఎస్‌) నుంచి సోమవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే జాతీయ రహదారి పైనుంచి అదుపు తప్పి ద్విచక్రవాహనం టోల్‌గేట్‌ బోర్డును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరభద్రం మెడ పైభాగంతో పాటు ఇతర చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయి. భార్య ప్రణీతకు చేయి విరిగింది. ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా వీరభద్రం అప్పటికే మృతి చెందాడు. భార్య ప్రణీత ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు. వీరభద్రం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
అనారోగ్యంతో తల్లి.. మృతుడు వీరభద్రం తల్లి మైసమ్మ కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తండ్రి రాములు కూడా వృద్ధాప్యం రావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. వీరభద్రం తమ బాగోగులు చూసుకుంటాడని భావించిన తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిలింది.

ఇవీ చూడండి..

పురుగుల మందుతో ప్రజావాణికి భార్యాభర్తలు, కలెక్టర్​ ఏం చేశాడంటే

AP POLICE ఛీ, పాడు పనికి పోలీస్ స్టేషన్​నే వాడుకున్నాడా ఏఎస్సై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.