బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత.. 13 మంది పరిస్థితి విషమం

author img

By

Published : Sep 6, 2022, 8:03 AM IST

food poison in wardhannapet girls hostel

food poison in wardhannapet girls hostel: బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్ధతకు గురైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో బల్లి పడిన అన్నం తిని 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. 34 మంది విద్యార్థినుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందుతోందని.. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి సత్యవతి రాఠోడ్ భరోసా ఇచ్చారు.

బల్లి పడిన ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత.. విషమంగా 13 మంది పరిస్థితి

food poison in wardhannapet girls hostel: వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థులను అస్వస్థతకు గురిచేయగా.. కన్నవారు తల్లిడిల్లిపోయారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల వసతి గృహంలో గత రాత్రి భోజనం చేస్తుండగా.. ఒకరి పళ్లెంలో బల్లిపడిన విషయాన్ని గమనించి గగ్గోలు పెట్టారు. అప్పటికే చాలా మంది భోజనం చేశారు. కొద్ది సేపటికే వాంతులు మొదలై విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని వర్ధన్నపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం 34 మంది విషాహారం తిన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​.. విద్యార్థుల ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులతో ఆరా తీశారు. హాస్టల్ వద్దకు చేరుకుని.. విద్యార్థులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు.

కడుపు నొప్పి, వాంతులతో పరిస్ధితి అందోళనకరంగా ఉన్న 13 మంది విద్యార్థులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వారిలో ఒకరి ఆరోగ్యం విషమంగా ఉంది. అప్రమత్తమైన వైద్యాధికారులు విద్యార్థులందరికీ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. జిల్లా కలెక్టర్ గోపి ఆసుపత్రికి వచ్చి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వైద్యులు చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

విషయం తెలిసిన తల్లిదండ్రులు పరుగు పరుగున వరంగల్ ఎంజీఎంకు తరలివచ్చారు. హాస్టల్ సిబ్బంది విద్యార్థుల బాగోగులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని.. వారందరిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులను మంత్రి సత్యవతి రాఠోడ్ ఆదేశించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలు విద్యార్థి సంఘాల నేతలు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.