Farmer died of Heart attack Yellareddy : కల్లాల్లోనే కుప్పకూలుతున్న కర్షకులు

author img

By

Published : Nov 26, 2021, 7:51 AM IST

Farmer died of Heart attack Yellareddy, గుండెపోటుతో ఎల్లారెడ్డి రైతు మృతి, ఎల్లారెడ్డిలో రైతు మృతి

ఆరుగాలం శ్రమించి పండించారు. వాటిని విక్రయించి కాస్త డబ్బు పోగేసుకుందామనుకున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి వరి ధాన్యాన్ని ఆరబోశారు. అధికారులు రేపూ..మాపూ అంటూ జాప్యం చేయడంతో రోజూ ఆ ధాన్యాన్ని ఆరబోస్తూ.. కాస్త మబ్బు పడితే మళ్లీ కుప్ప పోస్తూ ఎలాగైనా ధాన్యాన్ని కాపాడుకోవాలని శ్రమిస్తున్నారు. ఎప్పుడు వానొస్తుందో.. తమ కష్టమంతా నీటి పాలవుతుందోనని క్షణక్షణం భయపడుతున్నారు. ఆ భయం గుప్పిట్లోనే గుండెనొప్పితో కొందరు కల్లాల్లోనే కుప్పకూలుతుండగా.. వరణుడి బీభత్సానికి ఆరుగాల కష్టమంతా నేలపాలైందని.. తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థంగాక మరికొంత మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా వారు అనారోగ్యానికి గురై మరణిస్తుండటం కలిచివేస్తోంది. ఇటీవల లింగంపేట కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్‌కు చెందిన రైతు బీరయ్య ధాన్యం కుప్పపైనే కుప్పకూలి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే బాన్సువాడ మండలం హన్మాజీపేటకు చెందిన రైతు శంకర్‌ అప్పుల బాధతో పంట పొలంలో ధాన్యం రాసి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ఎల్లారెడ్డి కొనుగోలు కేంద్రంలో రైతు కుమ్మరి రాజయ్య గురువారం సాయంత్రం ధాన్యం కుప్ప పోసేందుకు వచ్చి గుండెపోటుతో మరణించారు.

కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో గురువారం ఈ విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి రాజయ్య (50) మూడెకరాల్లో వరిని పండించారు. 15 రోజుల కిందట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించారు. అప్పటి నుంచి ధాన్యం ఆరబెడుతున్నారు. గురువారం సాయంత్రం వరి కుప్పలు చేయడానికి ఇంటి నుంచి వెళ్లిన రాజయ్య అక్కడే పడిపోయారు. గమనించిన స్థానికులు కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రైతు మృతిపై సొసైటీ సీఈవో భైరయ్యను సంప్రదించగా.. ఈ నెల 15న ధాన్యం వచ్చిందని, తేమ శాతం రాకపోవడంతో కొనుగోలు చేయలేదని తెలిపారు.

కేంద్రాల వద్దే పడిగాపులు

అకాల వర్షాలతో పంట తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతూ రాత్రింబవళ్లూ కుప్పల వద్ద కాపలా ఉంటున్నారు. కొనుగోలు చేసేందుకు మిల్లర్లు కొర్రీలు పెడుతుండటం, రవాణా ప్రక్రియ మందగించడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. రైతులు తెచ్చిన ధాన్యంలో కనీసం 17 శాతం తేమ ఉండాలి. అంతకంటే పెరిగితే కొనుగోలు చేయమని చెబుతున్నారు. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉండటంతో మిల్లర్లు నిర్దేశించిన తేమ శాతం రావడం లేదు. దీంతో అది వచ్చే వరకు కేంద్రాల్లోనే నిల్వ చేయాల్సి వస్తుంది. ఇందుకోసం రైతులు వారం నుంచి పది రోజులు అక్కడే కాపలా ఉంటున్నారు.

కొత్త విధానంతో పెరిగిన కష్టాలు

ఈసారి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సరికొత్త విధానం ప్రవేశపెట్టింది. రైతుల ఆధార్‌కార్డుకు చరవాణి నంబరు అనుసంధానమై ఉంటేనే ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పట్టా పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు తీసుకెళ్లాలి. ఆధార్‌ తో రైతు వివరాలు నమోదు చేయడంతో చరవాణికి ఓటీపీ వస్తుంది. అది చెబితేనే ధాన్యం సేకరిస్తారు. చాలా మంది రైతులు అనుసంధానం చేసుకోలేదు. అలాంటి వారికి ఇబ్బందవుతోంది. వారు కేంద్రాలకు పంట తీసుకురాకముందే ఈ ప్రక్రియ గురించి అవగాహన కల్పించాల్సిన అధికారులు కాంటాలు వేసిన తర్వాత పురమాయిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా ఈ సీజన్‌ ఆరంభం నుంచి రైతులను సమస్యలు వేధిస్తున్నాయి.

కానరాని వేగం

రైతులు కుప్పకూలుతున్నా ధాన్యం సేకరణ మందకొడిగానే సాగుతోంది. కాంటాల సంఖ్య పెంచడంతో పాటు రవాణా సమస్యను పరిష్కరించి సేకరణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తేనే ఇబ్బందులు తొలగుతాయి.

సేకరణ వివరాలు

లక్ష్యం 5.50 లక్షల మె.ట

సేకరించింది 2.82 లక్షల మె.ట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.