cyber crime: మాయమాటలు చెప్పి... రూ.3 లక్షలు కాజేశారు

author img

By

Published : Sep 18, 2021, 4:33 PM IST

cyber criminal

మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.3 లక్షలు కాజేసిన ఘటన నల్గొండ జిల్లా చండూర్​ మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు ఫోన్​ చేసి తాము ఎనీ డెస్క్‌ యాప్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ మాటలు కలిపి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని రూ.3 లక్షలు కాజేసిన ఘటన నల్గొండ జిల్లా చండూరు మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు పుల్లెంల గ్రామానికి చెందిన కొలుకులపల్లి లింగస్వామి తన భార్యతో కలిసి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థలం అమ్మిన డబ్బులు ఉండటంతో ఆయన చండూరులోని యూనియన్‌ బ్యాంకు ఖాతా (Union‌ bank account)లో దాచుకున్నారు. డిగ్రీ చదువుతున్న కూతురుకు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండటంతో ఆమె తండ్రి ఫోన్​ తన వద్ద ఉంచుకోగా... సైబరు నేరగాడు కాల్‌ చేసి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే డబ్బులు వస్తాయని మాయ మాటలు చెప్పి నమ్మించాడు.

తండ్రి బ్యాంకు ఖాతా వివరాలు అడగటంతో ఆమె చెప్పేసింది. అంతే ఖాతా నుంచి ఆగంతుకుడు డబ్బులు మాయం చేయటం మొదలు పెట్టాడు. ఈ విషయం తెలియని తండ్రి శుక్రవారం డబ్బు డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా విషయం బయటపడింది. బ్యాంకు వారు పరిశీలించగా ఒడిశాలోని ఓ బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినట్లు గుర్తించారు. బాధితుడు స్థానిక పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేశామని, డబ్బులు నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లకుండా ప్రయత్నం చేస్తామని ఎస్సై సైదులు తెలిపారు.

ఇదీ చదవండి: Murder: వివాహితను వేధించాడని.. కొట్టి చంపి కాల్చేశారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.