Cyber Crime: సరికొత్తగా.. ఓటీపీ చెప్పకుండానే రూ.19లక్షలు మాయం

author img

By

Published : Nov 3, 2021, 9:15 AM IST

Cyber Crime

ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించిన సైబరాబాద్‌ పోలీసులకు కొత్త సవాలు ఎదురయ్యింది. ఓటీపీ చెప్పకుండానే ఇద్దరి ఖాతాల నుంచి కేటుగాళ్లు రూ.19 లక్షలు లాగేశారు. ఒకరి ఖాతా నుంచి మరొకరికి డబ్బులు మళ్లించారు. డెబిట్‌ కార్డులు బాధితుల దగ్గరుండగానే ఎక్కడో ఏటీఎంల్లో విత్‌డ్రా చేసుకున్నారు. మా సర్వర్‌ను కూడా హ్యాక్‌ చేశారేమోనంటూ బ్యాంకు అధికారులు చేతులెత్తేయడంతో ఇంకా గుట్టు వీడలేదు. ‘లింక్‌’ ద్వారా వైరస్‌ను పంపించి ఫోన్లను హ్యాక్‌ చేశారా.. మరో కొత్త తరహాలో మోసానికి పాల్పడ్డారా..! అనేది దర్యాప్తు చేస్తున్నారు.

దిల్లీకి చెందిన బాధితురాలు(28) ప్రస్తుతం కొండాపూర్‌లో ఉంటున్నారు. ఇళ్లు కొనుగోలు చేసేందుకు రూ.17 లక్షలు బ్యాంక్‌ ఖాతాలో ఆమె ఉంచారు. 20 రోజుల కిందట అమెజాన్‌లో బుక్‌ చేసిన ఆర్డర్‌ డెలివరీ కాలేదు. వినియోగదారుల సహాయ కేంద్రాన్ని సంప్రదిస్తే డీటీడీసీ కొరియర్‌ ద్వారా ఎప్పుడో పంపించామన్నారు. గూగుల్‌లో కనిపించిన డీటీడీసీ కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి ఆమె విషయం చెప్పారు. పది నిమిషాల్లో మరో వ్యక్తి కాల్‌ చేశాడు. 20 రోజులుగా పార్సిల్‌ నా దగ్గరే ఉంది.. వర్షాల కారణంగా డెలివరీ చేయలేకపోయానని తెలిపాడు. రూ.10 చెల్లిస్తే డెలివరీ చేస్తానన్నాడు. చిన్న మొత్తమే కదా అని ఆమె అంగీకరించారు. తన చరవాణి సిగ్నల్‌ సరిగా లేకపోవడంతో డెలివరీ బాయ్‌ పంపిన లింక్‌ ఓపెన్‌ కాలేదు. కిచెన్‌లో వంట చేస్తున్న స్నేహితురాలి(26) ఫోన్‌ నంబరు అతనికి చెప్పారు. ఆ ఫోన్‌కొచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేసి తన ఐడీ వివరాలు పంపించారు. పిన్‌ నంబర్‌ తప్పుగా ఇచ్చారంటూ అవతలి వైపు వ్యక్తి అరవడంతో అనుమానమొచ్చి ఆమె ఫోన్‌ కట్‌ చేశారు.


ఎక్కడో ఏటీఎంల్లో విత్‌డ్రా చేసినట్లు...

మూడు, నాలుగు రోజులు తర్వాత ఆ స్నేహితురాలికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ గూగుల్‌ పే, ఫోన్‌ పే, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా డబ్బు కట్టేందుకు ప్రయత్నించగా ఓపెన్‌ కాలేదు. మళ్లీ రిజిస్టర్‌ చేసుకోమని సూచించడంతో ఖంగుతిని బ్యాంకులో సంప్రందించారు. అప్పటికే రూ.2 లక్షలు డెబిట్‌ అయినట్లు తెలిసింది. ఆ ఖాతా నుంచి బాధితురాలికి కూడా రూ.50వేలు డబ్బులు బదిలీ అయినట్లు ఉండటంతో అవాక్కయ్యారు. ఇద్దరికీ ఒకే బ్యాంకులో ఖాతా ఉంది. వెంటనే బాధితురాలి ఖాతాలో బ్యాలెన్స్‌ చూడగా రూ.17.6 లక్షలు డెబిట్‌ అయినట్లు తేలింది. ఆమె మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ కూడా ఓపెన్‌ కావడం లేదు. స్టేట్‌మెంట్‌ను పరిశీలించగా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంల్లో డబ్బులు విత్‌డ్రా చేసినట్లు ఉంది. సర్వర్‌ను హ్యాక్‌ చేసి ఉంటారేమోనని సదరు బ్యాంకు ప్రతినిధులు చెప్పడంతో బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఖాతాను స్తంభింపజేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: Cyber Crimes in Telangana : అప్పు ఇస్తామంటూ.. నిండా ముంచేస్తున్నారు

'ఉద్యోగం కోసం ఛార్జీలు చెల్లించారా? అయితే.. చింతించకండి.. తిరిగి ఇచ్చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.