తల్లి, దత్తత కుమారుడి హత్య కేసులో మరో ట్విస్ట్​.. నిందితులు వాళ్లే.!

author img

By

Published : May 13, 2022, 6:13 PM IST

Updated : May 13, 2022, 8:00 PM IST

Sai Teja Murder Case

Sai Teja Murder Case: 'మీ అమ్మను చంపి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకొని వద్దాం. ఆ తర్వాత నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీకు పెళ్లి చేస్తాం.' అంటూ మాయమాటలు చెప్పి.. సాయితేజ ఎదురుగానే అర్ధరాత్రి అతని తల్లిని దారుణంగా హత్య చేశారు ఆ ఇంటి కారు డ్రైవర్​, స్నేహితులు. వారి మాటలు నమ్మి పథకంలో పాలుపంచుకున్నందుకు.. పెంచిన తల్లిని పోగొట్టుకోవడమే కాక.. అతనూ ప్రాణాలు కోల్పోయాడు. ఆరు రోజుల క్రితం హైదరాబాద్​ న్యూ గడ్డి అన్నారంలో మహిళ హత్య కేసులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు ఇవి.

Sai Teja Murder Case: హైదరాబాద్​ సరూర్‌నగర్‌ పీఎస్​ పరిధిలోని న్యూ గడ్డి అన్నారానికి చెందిన భూదేవి, దత్తపుత్రుడు సాయితేజ హత్యల కేసులో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వచ్చాయి. సాయితేజ హత్యతో అసలు నిందితులెవరో తెలిసిపోయింది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తామని ఆశపెట్టి.. డబ్బు, బంగారం కోసం అతని తల్లిని దారుణంగా హత్య చేశారు ఆ ఇంటి డ్రైవర్​, స్నేహితులు. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భూదేవిని వారి కారు డ్రైవర్ నరసింహ గౌడ్ స్నేహితుల సహకారంతో హత్య చేసి సొత్తు అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకొన్న నరసింహ గౌడ్, అతని స్నేహితులు.. సాయి తేజని చంపింది శివ కుమార్ అని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.

డ్రైవర్ నరసింహ సహా ఐదుగురు నిందితుల(శివ, చింటు, అంజి, సాయిగౌడ్‌)ను అరెస్టు చేసిన సరూర్​ నగర్ పోలీసులు రిమాండ్​కు తరలించారు. భూదేవి హత్య తర్వాత సాయితేజను శ్రీశైలం తీసుకెళ్లి తిరుగుప్రయాణంలో మల్లెలతీర్ధం వద్ద అంతమొందించినట్లు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకొన్నారు. తల్లి హత్య విషయం సాయితేజ చెబుతాడనే కారణంతోనే అతన్ని చంపినట్లు చెప్పారు. శివ వద్ద రూ. లక్షా 40 వేలతో పాటు బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. శివను వెంటబెట్టుకుని మల్లెలతీర్ధం చేరుకుని నీటి కుంటలో సాయితేజ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ జరిగింది..: భూదేవి ఇంట్లో డ్రైవర్​గా పనిచేస్తున్న నరసింహ గౌడ్​.. వారి ఆస్తిపై కన్నేశాడు. ఇంట్లో రూ. 50 లక్షల నుంచి 60 లక్షల వరకూ ఉండొచ్చని భావించిన నరసింహ వాటిని కాజేయాలని చూశాడు. అందుకోసం సాయితేజ ప్రేమను అడ్డు పెట్టుకున్నాడు. ప్రియురాలితో సాయితేజ పెళ్లి జరగాలంటే బంగారం, డబ్బు ఉండాలని నచ్చజెప్పి.. భూదేవి హత్యకు పథకం వేశాడు నరసింహ. సాయితేజ స్నేహితులతో కలిసి ఈ నెల తెల్లవారుజామున రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించి.. భూదేవి తలపై దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆనవాళ్లేవి తెలియకుండా దిండును కాల్చేశారు. హత్య చేసిన తర్వాత.. డబ్బు, బంగారంతో ఉడాయించారు. సీసీ కెమెరాల్లో చిక్కకుండా అంతకుముందే ఇంట్లోని సీసీ ఫుటేజీ వైర్లు కట్​ చేశారు.

తల్లి, దత్తత కుమారుడి హత్య కేసు

"నా కొడుకు సాయితేజ అమాయకుడు. నా భార్యను హత్య చేసింది మా డ్రైవర్​ నరసింహ గౌడ్​ అని తెలిసింది. అతను మా ఇంట్లో డబ్బుందనే ఆశతో ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తామని నా కొడుకుని నమ్మించి చివరికి సాయితేజను కూడా చంపేశారు. పోలీసుల ఎదుటే నిందితులు ఎలా హత్య చేశారో చెప్పారు." -జంగయ్య, సాయితేజ తండ్రి

అనంతరం శ్రీశైలం వెళ్తే అక్కడే సాయితేజ తన ప్రియురాలిని కూడా కలిసి డబ్బు, బంగారం ఇవ్వవచ్చని స్నేహితులు, నరసింహ అతన్ని మాటలతో నమ్మించారు. వారి మాటలు నమ్మిన సాయితేజ అందరితో కలిసి ఈ నెల 7 న శ్రీశైలం చేరుకున్నాడు. అక్కడ ఒక రోజు సత్రంలో బస చేశారు. అనంతరం మరుసటి రోజు ఆలయంలో దర్శనం చేసుకున్నారు. ఈ నెల 10 న వారంతా తిరుగు ప్రయాణంలో మల్లెలతీర్ధం ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సాయితేజను అంతం చేయాలని శివ భావించాడు. అక్కడ నిర్మానుష్య ప్రాంతానికి అతడిని తీసుకువెళ్లిన శివ రాయితో దాడి చేశాడు. దాడిలో సాయితేజ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అతను మృతి చెందినట్టు నిర్ధరించుకుని మృతదేహానికి లుంగీతో బండరాయి కట్టి సమీపంలోని కుంటలో పడేశాడు.

ఇవీ చదవండి: పెళ్లి చేసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. వధూవరులిద్దరూ..!

మరో ప్రముఖ సినీ జంట విడాకులు.. 24 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు

Last Updated :May 13, 2022, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.