doctor suicide: అమ్మ ఇక లేదని.. మాట్లాడలేదని ఆ పసివాడికి ఏం తెలుసు..!

author img

By

Published : Aug 12, 2021, 9:28 AM IST

Updated : Aug 12, 2021, 10:08 AM IST

doctor suicide: అమ్మ ఇక లేదని.. మాట్లాడలేదని ఆ పసివాడికి ఏం తెలుసు..!

అమ్మ ఫోన్‌ రింగయింది. అంతే! మూడేళ్ల చిన్నారి పరుగున ఇంట్లోకెళ్లి దాన్ని చేతికందుకున్నాడు. 'అమ్మా నీకు ఫోన్‌ వచ్చింది మాట్లాడు' అంటూ సెల్‌ఫోన్‌ను తల్లి మొహం వద్ద పెట్టాడు. అమ్మ ఇక లేదని.. ఆమె అప్పటికే చనిపోయిందని.. తెలియని ఆ చిన్నారి తల్లి స్పందించకపోవడంతో బిక్కమొహం వేశాడు. ఫోన్‌ను తల్లి నోటి వద్దే ఉంచి అలా నిస్తేజంగా ఉండిపోయాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల కేంద్రంలో యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అక్కడ కన్పించిన హృదయ విదారక దృశ్యమిది.

ఆ పసివాడికి ఏం తెలుసు..

అమ్మ ఇక లేదని.. ఎప్పటికీ రాదని!

రోజూ తనని నిద్రపుచ్చి కానీ నిద్రపోని అమ్మ

ఎందుకలా పడుకుందో తెలియడం లేదు.

నిద్రలేపాల్సిన నాన్న

అక్కడ ఎందుకులేడో అర్థం కావడం లేదు.

ఎప్పుడూ ఫోన్​ ఇస్తే మురిసిపోయే అమ్మ

ఇప్పుడెందుకిలా అలిగి

పడుకుందో అంతుపట్టడం లేదు.

ఆ పసివాడికి ఏం తెలుసు..

ఇక నుంచి బతిమిలాడి మరీ

గోరుముద్దలు పెట్టే అమ్మ ఇక లేదని!

తనకి జోలపాడి నిద్రపుచ్చే అమ్మ

ఇక ఎప్పటికీ రాదని... పాపం ఆ పసివాడికేం తెలుసు!

నాగర్​కర్నూల్​ జిల్లా లింగాలకు చెందిన కేతావత్‌ సోమశేఖర్‌కు, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలానికి చెందిన దివ్య (26)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. భార్యాభర్తలిద్దరూ ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. వివాహమైన ఏడాది తర్వాత సోమశేఖర్‌ ఉన్నత చదువుల కోసం భార్యతోపాటు దుబాయ్​ వెళ్లారు. రెండు నెలల కిందట దంపతులు స్వగ్రామానికి తిరిగి వచ్చారు. దివ్యను, మూడేళ్ల కుమారుడు జ్ఞాని విరాట్‌ను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి సోమశేఖర్‌ నెల క్రితం తిరిగి దుబాయ్ వెళ్లిపోయారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు సమాచారం.

తల్లి మృతదేహం వద్ద జ్ఞాని విరాట్​
తల్లి మృతదేహం వద్ద జ్ఞాని విరాట్​

బిడ్డను బయటకు పంపి..

బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అత్తామామలు వరండాలో కూర్చొని ఉండగా.. దివ్య కుమారుడిని బయటకు పంపించి లోపల తాళం వేసుకున్నారు. తర్వాత చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. బిడ్డ తలుపు తడుతూ ఏడుస్తుండటంతో తేరుకున్న అత్తామామలు, చుట్టు పక్కల వారి సాయంతో బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి మృతి చెందిన విషయం తెలియని మూడేళ్ల చిన్నారి రింగయిన ఫోన్‌ను అమ్మకు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం అక్కడున్న వారిని చలింపజేసింది.

ఇదీ చూడండి: మాయ మాటలతో లోబరుచుకుని.. పెళ్లికి పట్టుబట్టిందని హతమార్చి

Last Updated :Aug 12, 2021, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.