ప్రేమించలేదని.. యువతిని చంపి పూడ్చివేసిన ఉన్మాది

author img

By

Published : Sep 9, 2022, 9:04 AM IST

A maniac who killed a young woman for not loving her in wanaparthy district

ప్రేమించలేదని ఓ యువతిని కిరాతకంగా హతమార్చాడో ఉన్మాది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేటలో గురువారం సంచలనం సృష్టించింది.

ప్రేమించాలని కోరాడు.. పెళ్లి చేసుకుందామని అడిగాడు. యువతి నిరాకరించడంతో ఉన్మాదిగా మారి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా మరొకరి సాయంతో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేటలో గురువారం సంచలనం సృష్టించింది. ఎస్సై వెంకట్వేర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మానాజీపేటకు చెందిన బత్తిని శ్రీశైలంకు 2017లో హైదరాబాద్‌లో డిగ్రీ చదువుకునే రోజుల్లో కాటేదాన్‌ ఏరియా ఎన్జీవోస్‌కాలనీకి చెందిన సాయిప్రియ (19)తో పరిచయం ఏర్పడింది.

అప్పటినుంచి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నా ఆమె నిరాకరిస్తూ వస్తోంది. విషయాన్ని ఆమె ఇంట్లో చెప్పడంతో కుటుంబసభ్యులు ఆ యువకుడిని హెచ్చరించి వదిలేశారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఈనెల 5న సాయిప్రియకు ఫోన్‌చేసి ఒకసారి మాట్లాడాలని..మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌కు రావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన సాయిప్రియ అక్కడికి వెళ్లగా బైక్‌పై ఎక్కించుకుని మానాజీపేట శివారులోని మబ్బుగుట్టల్లోకి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి కోరినా ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన శ్రీశైలం ఆమె మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. అనంతరం బంధువు శివ సహకారంతో కేఎల్‌ఐ కాల్వ పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు. అప్పటికే హైదరాబాద్‌లోని కాటేదాన్‌ ఠాణాలో సాయిప్రియ కనిపించడం లేదని, శ్రీశైలంపై అనుమానం వ్యక్తం చేస్తూ యువతి తల్లిదండ్రులు వెంకటేశ్‌, లక్ష్మి ఫిర్యాదు చేశారు. కాటేదాన్‌ పోలీసులు ఆరోతేదీన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో రెండు రోజుల తర్వాత నేరం అంగీకరించాడు. వనపర్తి జిల్లా కొత్తకోట సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసును కాటేదాన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్‌గౌడ్‌ చెప్పారు.

....

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.