క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ల పేరిట భారీ మోసం.. మందు డబ్బాలతో బాధితుల ఆందోళన

author img

By

Published : Sep 21, 2022, 4:26 PM IST

Updated : Sep 21, 2022, 5:56 PM IST

Crypto Currency Fraud

Crypto Currency Fraud: క్రిప్టో కరెన్సీ మోసాలు ఇప్పుడు నగరాలు, పట్టణాల నుంచి పల్లెలకు చేరాయి. గ్రామాల్లో ప్రజలయితే తొందరగా నమ్ముతారని.. వారిని టార్గెట్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. వారం, వారం డబ్బులు వస్తాయని.. మీ పెట్టుబడికి 6నెలల్లోనే రెండింతల లాభం వస్తుందని ఆశచూపాడు. ఇంకేముంది నేనంటే నేనంటూ అప్పులు చేసి మరి ఆ మోసగాడికి సమర్పించారు. ఇప్పుడు మోసపోయామని తెలిసి.. పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో ఆ వ్యక్తి ఇంటిముందు నిరసన చేపట్టారు.

Crypto Currency Fraud: ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్తలింగాలలో క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ల పేరిట జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. కామేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి ... పది గ్రూపుల ద్వారా ఏడాదిన్నర నుంచి క్రిప్టో కరెన్సీ పేరిట పలువురి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. మొదట ఆ వ్యక్తి గ్రూపులు ఏర్పాటు చేశాడు.

బాధితుల వద్ద డబ్బులు వసూలు చేసిన వ్యక్తి
బాధితుల వద్ద డబ్బులు వసూలు చేసిన వ్యక్తి

లక్ష డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి పెడితే.. మరుసటి రోజు ముప్పై వేల రూపాయల విలువ గల బిట్ కాయిన్స్ నగదు జమ అవుతాయని వారికి చెప్పేవాడు. అలా పెట్టుబడి పెట్టిన వారికి చెప్పిన విధంగా బిట్ కాయిన్స్​ పంపేవాడు. తరువాత 24 వారాల పాటు రూ.పన్నెండు వేల చొప్పున జమ చేయడం జరుగుతుందని ఆశచూపాడు. 20,000, 60,000, 1,20,000 రూపాయల చొప్పున ప్యాకేజీలు ప్రకటించాడు.

ఇంకేముంది ఈ మోసగాడి మాటలకు ఆకర్షితులై ఖమ్మం, కామేపల్లి, కూసుమంచి, వైరా, ఏన్కూర్, మధిర ప్రాంతాల ప్రజలు పెట్టుబడి పెట్టారు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు ఆందోళనకు దిగారు. మోసపోయిన వారంతా ఇవాళ పురుగు మందు డబ్బాలు, పెట్రోల్ సీసాలతో మోసం చేసిన వ్యక్తి ఇంటిముందు ఆందోళనకు దిగారు. తమ డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిట్ కాయిన్ల పేరిట వీరందరి దగ్గరి నుంచి సుమారు దాదాపు రూ.70 లక్షల వరకు మోసం చేసినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 21, 2022, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.