కుమార్తెలను విక్రయించిన తండ్రి, సవతి తల్లి.. పెళ్లి చేసుకొని చిత్రహింసలు పెట్టిన భర్తలు

author img

By

Published : Jan 25, 2023, 9:57 AM IST

Updated : Jan 25, 2023, 10:16 AM IST

Telangana latest news

వారిద్దరూ ఆడ కవలలు. చిన్నతనంలోనే తల్లి మరణించడంతో అనేక కష్టాలను అనుభవిస్తూ పెరిగారు. దీనికి తోడూ వారి తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో వారికి ఇంకా బాధలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆ కసాయి తండ్రి వారిని పోషించడం కష్టమని భావించాడు. ఇందుకు రెండో భార్య కూడా సరేనంది. ఇందులో భాగంగానే నగదు కోసం.. కుమార్తెలను వీరిరువురు అమ్మేశారు. ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా చోటుచేసుకుంది.

చిన్ననాడే తల్లిని కోల్పోయిన ఆడ కవలలు వారు. కష్టాలు.. కన్నీళ్లే తోడుగా పెరిగారు. వారికి పద్నాలుగేళ్ల వయసు రాగానే కన్న తండ్రి, సవతి తల్లి వారిద్దరినీ వేర్వేరుగా అమ్మేశారు. కొనుగోలు చేసిన వారు ఆ బాలికలను పెళ్లి చేసుకుని.. నరకం చూపించడం మొదలుపెట్టారు. భర్త చెర నుంచి తప్పించుకున్న ఓ అమ్మాయి అధికారులను ఆశ్రయించింది. తన సోదరిని కూడా ఇలాగే అమ్మేశారని చెప్పింది. దీంతో వారిని పెళ్లి చేసుకున్నవారితో సహా ఏడుగురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు.

ఈ అమానవీయ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ మారుమూల గ్రామంలో చోటుచేసుకుంది. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండలానికి చెందిన ఆడ కవల పిల్లలు రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. తండ్రి రెండో పెళ్లి చేసుకోగా వారికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. నలుగురు పిల్లలను పోషించడం కష్టమని భావించిన తండ్రి బాలికల(14)ను విక్రయించాలనుకున్నాడు.

ఈ విషయాన్ని తనకు తెలిసిన బంధువుకు చెప్పగా అతడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేశాడు. ఆయన మరో వ్యక్తితో కలిసి మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని దండుపల్లికి చెందిన శర్మన్‌ను తీసుకొచ్చారు. కవలల్లో చిన్న అమ్మాయిని రూ.80 వేలకు కొనుక్కున్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లిన శర్మన్‌ అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అనంతరం స్వగ్రామం దండుపల్లికి తీసుకెళ్లి బాలికను శారీరకంగా అనుభవిస్తూ నరకం చూపించసాగాడు.

తన మాదిరే సోదరిని కూడా: అతడికి అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండడంతో పాటు అనేక మందితో వివాహేతర సంబంధాలున్నాయి. బాలిక అక్కడి నుంచి పారిపోయి కామారెడ్డికి చేరుకొని బాలల సంరక్షణాధికారిణి(డీసీపీవో) స్రవంతిని కలిసింది. తన మాదిరే సోదరిని కూడా సికింద్రాబాద్‌లోని బోయినపల్లికి చెందిన కృష్ణకుమార్‌కు గత ఏడాది డిసెంబరులో రూ.50 వేలకు అమ్మేశారని.. అక్కను పెళ్లిచేసుకొని ఇబ్బందిపెడుతున్నాడని వాపోయింది.

డీసీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు బాలికల తండ్రి, సవతి తల్లి, పిల్లలను వివాహం చేసుకున్న శర్మన్‌, కృష్ణకుమార్‌తో పాటు అమ్మకానికి మధ్యవర్తులుగా వ్యవహరించిన కాల రాంబాటి, రమేశ్‌, మహేందర్‌తో కలిపి మొత్తం ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

పోలీసుల అదుపులో నిందితులు
పోలీసుల అదుపులో నిందితులు

ఇవీ చదవండి: పవన్ పర్యటనలో అపశ్రుతి.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

ఆన్​లైన్​ బెట్టింగులకు బానిసై అప్పులపాలయ్యాడు.. కట్​ చేస్తే చివరకు..

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి.. చిక్కుకున్న 20 మంది!

Last Updated :Jan 25, 2023, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.