ఉప్పొంగిన వాగులు.. వరదలో చిక్కిన కార్మికులు

author img

By

Published : Jul 23, 2021, 8:50 AM IST

Updated : Jul 23, 2021, 10:10 AM IST

వరదలో చిక్కుకున్న కార్మికులు

08:48 July 23

వరదలో చిక్కుకున్న లారీలు

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు, వాగులు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడం వల్ల అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద నీరంతా వాగుల్లోకి చేరి సమీప ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మల్కాపూర్​లో.. 40 మంది కార్మికులు, కుమురంభీం జిల్లా పెంచికలపేట మండలం ఎల్కపల్లి వద్ద తొమ్మిది మంది వరద నీటిలో చిక్కుకున్నారు. సమయానికి స్పందించిన స్థానికులు, అధికారులు తాళ్ల సాయంతో వారిని బయటకు తీశారు.

వరదలో 40 మంది కార్మికులు..

పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల గోదావరిఖని మల్కాపూర్​కు భారీ వరద నీరు చేరింది. ఈ ప్రాంతంలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసే 40 మంది వరదలో చిక్కుకున్నారు. చుట్టూ భారీగా వరదనీరు చేరటం వల్ల వారంతా పక్కనే ఉన్న భవనంపైకి ఎక్కి తలదాచుకున్నారు. స్నేహితులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. అధికారులు, సిబ్బంది.. తాళ్ల సాయంతో వారందరిని బయటకు తీసుకువచ్చారు. 

నీట మునిగిన లారీ యార్డు..

వరద ప్రవాహం వల్ల గోదావరిఖని గంగానగర్​లో లారీ యార్డు నీటమునిగింది. డీజిల్ బంక్, ఆఫీసు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడిపల్లి ఓసీపీ రహదారిపై వరద నీరు చేరడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

ఉప్పొంగిన పెద్దవాగు..

మరోవైపు.. కుమురం భీం జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ఉప్పొంగింది. పెంచికలపేట మండలం ఎల్కపల్లి వద్ద పెద్దవాగు ఉగ్రరూపం దాల్చడం వల్ల..  నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ వద్ద 9 మంది కార్మికులు వరదనీటిలో చిక్కుకున్నారు. వంతెన నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు శిబిరం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు.వరదలో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 

క్షేమంగా ఒడ్డుకు

నిజామాబాద్​ మెండోరా మండలం సావెల్ సాంబయ్య ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురిని ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది కాపాడారు. బోట్ల సాయంతో క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బందిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అభినందించారు. జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Last Updated :Jul 23, 2021, 10:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.