SARANGAPUR PUMP HOUSE: సర్జ్‌పూల్‌ నుంచి లీకేజీలే కారణమా? వరదొచ్చిన ప్రతిసారీ మునక తప్పదా!

author img

By

Published : Sep 13, 2021, 4:57 AM IST

SARANGAPUR PUMP HOUSE

వర్షాలతో పంటలే కాదు.. పంపులు కూడా నీట మునిగాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏడో లింకులోని 20వ ప్యాకేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు నిజామాబాద్‌ శివారులోని సారంగపూర్‌ వద్ద పంపుహౌస్‌ నిర్మించారు. ఇందులో రెండు మోటార్ల బిగింపు పూర్తవగా.. మూడోది బిగించే పనులు కొనసాగుతున్నాయి. ఒక పంపు ద్వారా మరో నెల రోజుల్లో నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో 6 రోజుల కింద కురిసిన వర్షాలకు.. ఎస్సారెస్పీ ప్రాజెక్టు వెనుక జలాల వరద పంపుహౌస్‌లోకి చేరింది. దీంతో ఇక్కడ జరిగే పనులకు ఆటంకం ఏర్పడింది.

కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగమైన సారంగపూర్‌ పంపుహౌస్‌ నీట మునిగింది. నిజామాబాద్‌ శివారులో ఉన్న ఈ పంపుహౌస్‌ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితమే రెండు పంపుల ఏర్పాటు పూర్తయింది. ఈనెలలో ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధమవుతున్నారు. మూడో పంపునకు మోటారు బిగించే పనులు సాగుతున్నాయి. ఇటీవలి వరదలకు శ్రీరాంసాగర్‌ వెనుక జలాలు పంపుహౌస్‌లోకి ప్రవేశించాయి. ఒక్కోటీ 30 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు మోటార్లు నీటిలో మునిగాయి. కాళేశ్వరం లింక్‌-7లో మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. సారంగపూర్‌ నుంచి గోదావరి జలాలను మూడుదశల్లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

నీరు ఎలా లీకై ఉండొచ్చు

సారంగపూర్‌ పంపుహౌస్‌ నుంచి 91 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేందుకు మూడు పంపులను బిగిస్తున్నారు. వాటి ఎత్తిపోత సామర్థ్యం 2,472 క్యూసెక్కులు. మోటార్లను పంపునకు అమర్చి హౌస్‌ అడుగు భాగంలో బిగిస్తున్నారు. ఎస్సారెస్పీ నుంచి నీళ్లు సర్జ్‌పూల్లో అందుబాటులో ఉంటాయి. ఆ నీళ్లు డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ ద్వారా పంపులకు అందుతాయి. పంపు తిరిగినప్పుడు ఆ నీరు ప్రెజర్‌ మెయిన్‌ ద్వారా భూ ఉపరితలం పైభాగానికి చేరుకుని సిస్టర్న్‌ ద్వారా కాల్వలో దుంకుతాయి. ఇంత పకడ్బందీగా నిర్మాణం ఉండాల్సిన చోట సర్జ్‌పూల్‌ నుంచి లీకై పంపులు మునిగిపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలోనే ఈ సంఘటన చోటుచేసుకుని ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. సర్జ్‌పూల్‌కు, పంపుహౌస్‌కు మధ్య ఉండే గేట్ల వద్ద లీకేజీ, ఇతర నిర్మాణాల వద్ద లోపాలతో నీళ్లు చేరి ఉండొచ్చని ఇంజినీర్లు అనుమానిస్తున్నారు.

ఇటీవలి భారీ వర్షాలకు శ్రీరాంసాగర్‌కు భారీ వరద వచ్చింది. వెనుక జలాలు భారీగా విస్తరించి ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్థాయి ఒకటిన్నర మీటర్లకు పైగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగానే కాళేశ్వరం లింక్‌-7 హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లపై నుంచి సారంగపూర్‌ పంపుహౌస్‌కు వరద భారీగా వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ నీటి ఒత్తిడితోనే సర్జ్‌పూల్‌ నుంచి లీకై పంపుహౌస్‌లోకి వరద వచ్చినట్లు తెలుస్తోంది.

పనుల వేగంపై ముంపు ప్రభావం

ఇప్పటికే పంపుహౌస్‌ నిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంది. 2018నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టినా ఇంకా కాలేదు. ఈ పనులు జరుగుతున్న 20వ ప్యాకేజీ అంచనా వ్యయం రూ. 892.6 కోట్లు. ముంపు నేపథ్యంలో మరింత జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంపు హౌస్‌లోకి చేరిన నీటి తోడివేత, మునిగిన పంపుల నుంచి మోటార్లను వేరు చేసి ఆరబెట్టి బిగించడానికి కనీసం రెండు నెలలు పట్టే అవకాశాలు ఉన్నాయి. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనూ ఇలా రెండుసార్లు పంపుహౌస్‌ మునిగింది.

నీటి మట్టం తగ్గాక తోడేస్తాం

ఎస్సారెస్పీకి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల సర్జ్‌పూల్‌లో మట్టం పెరిగింది. దీంతోపాటు పంపుహౌస్‌ ఎయిర్‌వెంట్‌ నుంచి కూడా వరద చేరింది. రెండు మోటార్లు మునిగాయి. ఎస్సారెస్పీ మట్టం తగ్గాక నీటిని తోడేస్తాం. సర్జ్‌పూల్‌ నుంచి కూడా లీకై ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. నీటిని తోడితేనే ఏం జరిగిందో తెలుస్తుంది.

- ఆర్‌.మధుసూదన్‌రావు, సీఈ, నిజామాబాద్‌ సర్కిల్‌.

ఎస్సారెస్పీకి వరదొచ్చిన ప్రతిసారీ మునక తప్పదా!

ఎస్సారెస్పీకి వరదల వల్ల వెనుక జలాల మట్టం పెరిగి సారంగపూర్‌ పంపుహౌస్‌ మునగడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. హెడ్‌రెగ్యులేటర్‌, పంపుహౌస్‌, సర్జ్‌పూల్‌ డిజైన్లు భవిష్యత్తు అంచనాలకు అనుగుణంగానే రూపొందించారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎస్సారెస్పీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 332.45 మీటర్లు. దీనిని అనుసరిస్తూనే కాళేశ్వరం లింక్‌-7 హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద అదే ఎఫ్‌ఆర్‌ఎల్‌తో 2 గేట్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పూర్తిగా నిండితే అలల ప్రభావంతో నీళ్లు రాకుండా 334.15 మీటర్ల టీబీఎల్‌గా (టాప్‌ బండ్‌ లెవల్‌) అంచనా వేసి రెగ్యులేటర్‌ నిర్మించారు. ఇటీవల వరదలకు ఏమేరకు నీటి మట్టం పెరిగిందో తేలాల్సి ఉంది. మహారాష్ట్రలో భారీగా వరదల వల్ల మంజీర ఉప్పొంగడంతో ఎస్సారెస్పీ పోటెత్తింది. ఇంత వరద చాలా అరుదు. నిజానికి ఎత్తిపోతల పథకాల డిజైన్‌లో గతంలోని నీటి ప్రవాహాలు, భవిష్యత్‌ అంచనాలను అధ్యయనం చేస్తారు. లింక్‌-7 రెగ్యులేటర్‌పై నుంచి నీళ్లు వెళ్లినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. జలాశయంలో నీటి మట్టం (హై ఫ్లడ్‌) పెరిగితే దాన్ని నిలువరించేలా హెడ్‌రెగ్యులేటర్‌ నిర్మాణం లేదు. నీటి ఒత్తిడి అమాంతం పెరిగితే సర్జ్‌పూల్‌, పంపుహౌస్‌కు మధ్య ఉండే గేట్లు దాన్ని తట్టుకునేలా కూడా లేవు. డిజైన్‌లను అన్ని పరిస్థితులకు అనుగుణంగా సిద్ధం చేయాల్సి ఉండగా ఎక్కడ లోపం తలెత్తిందనేది తేలాల్సి ఉంది. డిజైన్లలో మార్పులు, లోపాల పైనా దృష్టి పెట్టకపోతే ఇలాంటి నష్టం పదేపదే తప్పదేమోనని నిపుణులు అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి: Ganesh immersion in sagar: గంగమ్మ ఒడిలోకి గణపయ్య.. 'సాగర్​' వద్ద కోలాహలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.