Rain Effect: వర్షాలతో నిజామాబాద్​ జిల్లా అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్తం

author img

By

Published : Sep 8, 2021, 7:57 PM IST

heavy-flow-of-floods-in-nizamabad-and-huge-loose-of-crops

కుండపోత వర్షాలు ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాను అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చటం వల్ల వరద నీటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల వంతెనల పై నుంచి వరద ప్రవహించటం వల్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ నీళ్లలోనే ఉన్న కొన్ని కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాలతో నిజామాబాద్​ జిల్లా అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్తం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3 లక్షల 50 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు నుంచి 33 గేట్లు ఎత్తి 4 లక్షల 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1089.1 అడుగుల నీటి మట్టం ఉంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలెవరూ నదీ తీరం వైపు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.

చెరువుల అలుగులు.. చేపలకు వలలు..

నిజామాబాద్ నగర శివారులోని గుండారం చెరువు అలుగు పారుతూ జలపాతాన్ని తలపిస్తోంది. చెరువులోని చేపలు కొట్టుకుపోకుండా.. మత్స్యకారులు వలలు అడ్డు పెట్టారు. అలుగును చూసేందుకు స్థానికులు అధికంగా తరలి వస్తున్నారు. అలుగు నీరు రోడ్డుపైకి వస్తుండటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొండూర్ సమీపంలో పులాంగ్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలో దాదాపు 900కు పైగా చెరువులు పూర్తిగా నిండి జలకళను సంతరించుకున్నాయి.

ఉద్ధృతంగా మంజీర నది...

బోధన్ సరిహద్దు గ్రామం సాలుర వద్ద ఉన్న మంజీర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది పరవళ్లు వీక్షించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల జనం పోటెత్తుతున్నారు. ఉదయం నుంచి సందర్శకుల తకిడి మొదలైంది. కౌలాస్​నాలా, నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రవాహం అధికమైంది. మంజీర నదిపై ఉన్న లోలేవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్త వంతెన మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో అటువైపుగా వెళ్లటానికి ఎవరూ సాహసించొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గోదావరి ఉగ్రరూపం.. జలదృశ్యం త్రివేణి సంగమం..

రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. తెలంగాణ, మహారాష్ట్రను కలిపే వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల ఇరు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నవీపెట్ మండలం నాలేశ్వర్, నందిపేట్ మండలం తల్వేద గ్రామాల మధ్య ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి కాలువపై ఉన్న వంతెన దెబ్బతింది. భారీ వాహనాలు వెళ్లడానికి వీలులేకుండా మారింది. ద్విచక్ర వాహనాలు వెళ్లేంత దారి మాత్రమే మిగిలి ఉండటంతో.. రాకపోకలను నిలిపివేశారు. అక్కడి పరిస్థితిని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. పంటలు నీట మునిగిన రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గోదావరి ఉగ్రరూపం దాల్చటం వల్ల.. నది ఒడ్డున ఉన్న సీతారాం ఆశ్రమంలో ముగ్గురు స్వామీజీలు, 6 గోవులుతో సహా చిక్కుకున్నారు. వరద ప్రవహం పెరిగి సీతారాం ఆశ్రమం నీట మునిగింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు బిల్డింగ్​ పైకి ఎక్కి తలదాచుకున్నారు. వీళ్లను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

చెరువులైన పంటలు.. రైతులకు కన్నీళ్లు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుండపోత వర్షానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాలకు వాగులు ఉప్పొంగి.. వరద నీరు పంట పొలాలను ముంచేసింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిపోయిందని రైతులు వాపోతున్నారు. పొట్ట దశ నుంచి ఈనుతున్న స్థితిలో వరి పొలం ఉందని.. నీళ్లలో మునిగిపోవడం వల్ల గింజ నల్లగా మారి తాలు అవుతుందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని నిజామాబాద్ రూరల్, నవీపేట, నందిపేట, ఆర్మూర్, బోధన్, రెంజల్ తదితర ప్రాంతాల్లో పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది.

పండించే ప్రాజెక్టులే ముంచేశాయి...

బోధన్ మండలం హాంగర్గ ప్రాంత పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్, మంజీర నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నీటిలో మునిగాయి. శ్రీరాంసాగర్ బాక్​వాటర్ తగ్గితేనే నీటి ఉద్ధృతి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. బోధన్ మండలం కోప్పర్గ, హాంగర్గ, బికనెల్లి శివారులోని సుమారు రెండు వేల ఎకరాల పంట నీటిలో మునిగిపోయింది. హంగర్గ గ్రామంలో సుమారు నాలుగు వందల సోయా పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు ముంచెత్తటం వల్ల పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు వాపోయారు. తమకు తగిన న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అక్కడి పరిస్థితిని ఆర్డీఓ, తహసీల్దార్ పరిశీలించారు.

సురక్షితంగా ఇంటికి..

కోటగిరి మండలం పోతంగల్ గ్రామ శివారులోని మంజీర నదిలో చిక్కుకున్న కాపరులు, గొర్రెలను రెవెన్యూ, పోలీసు అధికారులు బయటకు తీసుకువచ్చారు. సుమారు 600 గొర్రెలను, 13 మందిని సురక్షితంగా అధికారులు బయటకు తీసుకువచ్చారు.

ముంపు కష్టాలు తీరేదెప్పుడో...

నిజామాబాద్​లో ముంపు కష్టాలు కొనసాగుతున్నాయి. నగరంలోని గూపన్​పల్లి, ఒడ్డెర కాలనీలో వరద ముంపు నుంచి బాధితులు కోలుకోలేదు. పులాంగ్ వాగు ఇంకా పారుతుండటంతో గూపన్ పల్లి, గంగస్థాన్ ఫేస్-2 వద్ద ఇళ్లు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. పక్కనే ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులు ఉంటున్నారు. నీట మునిగిన ఇళ్లలోని సామగ్రి అవతలి పక్కన తేలుతున్నాయి. టీవీలు, మంచాలు, ఇతర వస్తువులు చెట్లను తాకి ఆగిపోయాయి. పైకి తేలిన ఇళ్లలోని సామన్లు, ముఖ్యమైన కాగితాలు, దుస్తులను బాధితులు ఆరబెట్టుకుంటున్నారు. బాధితులకు అవసరైన నీళ్లు, ఆహారం నగర పాలక సంస్థ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు అందిస్తున్నారు.

ఇదీ చూడండి:

floods to projects: వరుణ ప్రభావంతో కొనసాగుతున్న వరద.. నిండుకుండలా జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.