మునుగోడు ఉపఎన్నిక... అభ్యర్థిని ప్రకటించిన తెరాస

author img

By

Published : Oct 7, 2022, 11:59 AM IST

Updated : Oct 7, 2022, 12:29 PM IST

trs

11:55 October 07

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన తెరాస

సీఎం కేసీఆర్​తో  కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి
సీఎం కేసీఆర్​తో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి

మనుగోడులో జరగనున్న ఉపఎన్నికకు అధికార తెరాస అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని మునుగోడు అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు టికెట్‌ కోసం పార్టీలోని సీనియర్‌ నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ.. సుదీర్ఘ చర్చల అనంతరం పార్టీ అధిష్ఠానం కూసుకుంట్లవైపు మొగ్గు చూపింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది.

మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్​గా ప్రచారం జరుగుతున్న మునుగోడులో.. సత్తా చాటడం ద్వారా బలప్రదర్శన చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సీఎం కేసీఆర్ ఇమేజ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకొని బరిలోకి దిగనుంది. ఇప్పటికే తెరాస దాదాపు అన్ని గ్రామాల్లో ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. ఆత్మీయ సమ్మేళనాలు, దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. స్థానికంగా ఇప్పటి వరకు మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే దుబ్బాక, హుజురాబాద్‌లో ఎదురుదెబ్బలను విశ్లేషించుకున్న గులాబీ పార్టీ.. ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది.

మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు రంగంలోకి దిగనున్నారు. కేటీఆర్​కు గట్టుప్పల్, హరీశ్​ రావు మర్రిగూడ గ్రామాల బాధ్యతలు కేటాయించారు. భాజపా తరఫున ఈటల రాజేందర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నందున.. పోలింగ్ పూర్తయ్యే వరకు హరీశ్​ రావు కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్, హరీశ్​ రావు సహా 86 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళో, రేపో నియోజకవర్గంలో దిగనున్నారు. సుమారు 2 వేల ఓటర్లకు ఒక కీలక నేతకు బాధ్యత అప్పగించారు. తెరాస పేరు మార్పు, భారాస ప్రకటన అంశంపై ఇప్పటి వరకు నిమగ్నమైన కేసీఆర్.. ఇక పోలింగ్ ముగిసే వరకు మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. గతంలో మునుగోడులో సభ నిర్వహించిన కేసీఆర్.. ప్రచార గడువు ముగిసే ఒకటి, రెండు రోజుల ముందు చండూరులో భారీ సభ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు.

తెరాసతో పాటు.. ప్రత్యర్థుల బలాబలాలపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ నివేదిక తెప్పించుకొని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని సర్వేలు తెరాసకే అనుకూలంగా ఉన్నప్పటికీ... ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. వామపక్షల పొత్తు మునుగోడులో కచ్చితంగా లాభం చేకూరుస్తుందనే ఆశతో గులాబీ పార్టీ ఉంది. సీపీఐ , సీపీఎం ఓట్లన్నీ తెరాసకే బదిలీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెరాస, వామపక్షాల నేతలతో గ్రామస్థాయి నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వామపక్ష పార్టీల ముఖ్య నేతలందరూ ప్రచారంలోకి దిగేలా వ్యూహ రచన చేస్తున్నారు. రైతుబంధు, పెన్షన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో పాటు.. గట్టుప్పల్ మండలం ఏర్పాటు, గిరిజనుల రిజర్వేషన్ పెంపు, పోడు భూముల సమస్య పరిష్కారానికి కమిటీలు, కొత్త పించన్లు వంటివి కచ్చితంగా లాభిస్తాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు మునుగోడులో ఆయారాం గయారాంల జోరు కనిపిస్తున్నందున.. పార్టీ క్యాడర్ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఇతర నాయకులు, కార్యకర్తలకు గాలం వేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 7, 2022, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.