బాధిత కుటుంబాల పరామర్శకు సమయం లేదు.. కానీ బిహార్ వెళ్లే సమయం ఉందా?

author img

By

Published : Aug 31, 2022, 8:09 PM IST

Komatireddy

Komatireddy Letter to CM Kcr: ఇబ్రహీంపట్నం ఘటనపై సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే నలుగురు మహిళలు మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల పరామర్శకు సమయం లేదు.. కానీ రాజకీయాల కోసం బిహార్​కి వెళ్లే సమయం ఉందా అని లేఖలో ప్రశ్నించారు. పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా అని కేసీఆర్​ను నిలదీశారు.

Komatireddy Letter to CM Kcr: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించడంపై సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కు.ని ఆపరేషన్లు విఫలమై నలుగురు మహిళలు మరణిస్తే వారి కుటుంబాలను పరామర్శించే తీరిక లేదు కానీ.. ప్రత్యేక విమానంలో బిహార్‌ రాజధాని పట్నాకు వెళ్లి రాజకీయాలు మాట్లాడే సమయం ఉందా అని ప్రశ్నించారు. పేదల ప్రాణాల కంటే మీకు రాజకీయాలే ముఖ్యమా అని నిలదీశారు. ప్రగతి భవన్‌ నుంచి 30నిమిషాల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం వెళ్లకుండా రాజకీయాల కోసం పట్నాకు వెళ్లడాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారని ధ్వజమెత్తారు.

మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల నష్టం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందామని చూస్తే అలాంటివి కుదరదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 25లక్షల నష్టపరిహారం ఇవ్వడంతోపాటు వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 30మంది బాధిత మహిళల ఆరోగ్యానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని.. వారికి పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.

పేదలు, గిరిజనులు ఎక్కువగా ఉండే ఇబ్రహీంపట్నంలో 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్​ను కోమటిరెడ్డి లేఖలో కోరారు. 'బస్తీ దవాఖానా' పేరుతో అనవసర ప్రచారం ఆపి ఎక్కువ మంది సివిల్‌ సర్జన్లను నియమించి ఉంటే.. ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదు కదా అని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కూడా రాకపోవడం శోచనీయమన్నారు. అనుకూలం మీడియాలో వైద్య, ఆరోగ్య శాఖ గురించి అనవసర ప్రచారం చేయిస్తూ... రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. నలుగురి ప్రాణాలను బలిగొన్న వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయడమే కాక.. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.