రోడ్లు విస్తరించినా మహబూబ్​నగర్​కు తీరని ట్రాఫిక్ ఇక్కట్లు

author img

By

Published : Aug 24, 2022, 2:14 PM IST

Traffic problems not Solved in Mahaboobnagar

Mahaboobnagar Traffic మహబూబ్​నగర్‌లో ప్రధాన రహదారులను విస్తరించినా, ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. రద్దీ అధికంగా ఉండే కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థ, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్‌ పోలీసులు అందుబాటులో లేకపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పాలమూరు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలేంటో మీరూ చూసేయండి.

రోడ్లు విస్తరించినా మహబూబ్​నగర్​కు తీరని ట్రాఫిక్ ఇక్కట్లు

Mahaboobnagar Traffic: మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ఒకప్పుడు అధ్వాన్నంగా ఉండేవి. కిలోమీటరు ప్రయాణించేందుకు కూడా 5 నుంచి 10 నిమిషాలు పట్టేది. ఆ దుస్థితి నుంచి ప్రస్తుతం అన్ని ప్రధాన రహదారులు, కూడళ్లను విస్తరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అయినా ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడంలేదు. 8ఏళ్లలో వాహనాల సంఖ్య పెరిగి... రద్దీ అధికమైంది. కూడళ్ల సంఖ్య సైతం పెరిగింది. కానీ తగిన విధంగా ట్రాఫిక్ పోలీసు వ్యవస్థను విస్తరించలేదు. పాలమూరులో మెట్టుగడ్డ, ప్రభుత్వాసుపత్రి, న్యూటౌన్, బస్టాండ్, ఆశోక్ టాకీస్ చౌరస్తా, వన్ టౌన్, గడియారం కూడళ్లున్నాయి. ఈ ప్రాంతాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. కానీ బస్టాండ్, న్యూటౌన్, వన్ టౌన్, అశోక్ టాకీస్ చౌరస్తాల్లో మాత్రమే పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో పోలీసులు లేక జనం ఇష్టానుసారం వాహనాలు నడపడం వల్ల నిత్యం ట్రాఫిక్ ఆగిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

రహదారులు విస్తరించినా ప్రధాన కూడళ్లలో ఎక్కడా పార్కింగ్ ప్రదేశాలు లేవు. ఫలితంగా రోడ్లమీదే వాహనాలు నిలుపుతున్నారు. పోలీసు నియంత్రణ లేకపోవడంతో రాంగ్ రూట్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇష్టానుసారం యూటర్న్ తీసుకుంటున్నారు. 4 రహదారులు కలిసే కూడళ్లలో సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం వల్ల క్రమపద్ధతిలో కాకుండా గందరగోళంగా వాహనాలు తిప్పుతున్నారు. పద్మావతి కాలనీ కమాన్, విద్యుత్‌శాఖ కార్యాలయం, మెట్టుగడ్డ, జనరల్ ఆసుపత్రి, అబ్దుల్ ఖాదర్ దర్గా, వేపూరి గేరికి వెళ్లే కల్వర్టు, పాన్ చౌరస్తా, గడియారం కూడలి వద్ద ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారుతోంది.

మహబూబ్​నగర్ మున్సిపాలిటీలోట్రాఫిక్ పోలీసుల కొరత ఉంది. 90 మందికిపైగా పనిచేయాల్సిన చోట 30మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సమస్యల్ని అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌ను ఏ గ్రేడ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మహబూబ్ నగర్ డీఎస్పీ మహేష్ వెల్లడించారు. 18 పార్కింగ్ ప్రదేశాల్ని సైతం గుర్తించామన్నారు. సిగ్నల్ వ్యవస్థను సైతం అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు.

పెరిగిపోతున్న జనాభా, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, పర్యాటక కేంద్రాల వల్ల విచ్చీపోయేవారి సంఖ్య పెరుగుతోంది. మరో 20ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జనం కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.