ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో భాజపా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది: కేటీఆర్‌

author img

By

Published : Sep 16, 2022, 3:45 PM IST

ktr

Ktr on Telangana National Unity Vajrotsavam: ఎనిమిదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో భాజపా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తమ తాతయ్య నిజాంపై పోరాటం చేశారని, స్వాతంత్య్ర సమరయోధుడని కేటీఆర్ పేర్కొన్నారు. భావితరాలకు గుర్తుండేలా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టుకున్నామని తెలిపారు. సిరిసిల్లలో చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Ktr on Telangana National Unity Vajrotsavam: ఎందరో త్యాగాలతో సిద్దించిన తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే మొదటి స్థానానికి చేరుకున్నామని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో.. భాజపా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గత ఎనిమిదేళ్లుగా కేంద్రానికి సెప్టెంబర్ 17 గుర్తుకు రాలేదని.. ఇప్పుడు ఒక్కొక్కరు కాదు.. ఇద్దరిద్దరు కేంద్రమంత్రులు వస్తున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. వాళ్లు వచ్చి చేసేదేమి ఉండదని.. కేవలం హిందూ ముస్లింలనే విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు యత్నిస్తారు.. తప్ప మరొకటి కాదని విమర్శించారు. గత ఎనిమిదేళ్లుగా సిరిసిల్లలో పవర్‌లూమ్​ ఏర్పాటు చేయాలని కాకిలా మొత్తుకుంటున్నా.. పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. రేపు రాష్ట్రానికి వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ఈసారైనా నిధుల గురించి మాట్లాడతారా.. లేక డబ్బల రాళ్లు వేసి ఊపినట్లు ఊపుతారో చూడాలని కేటీఆర్‌ అన్నారు.

'తెలంగాణకు పోరాటాలు కొత్తకాదు. సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. కులం, మతం పేరుతో తెలంగాణ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి. కొందరు మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. మత ఘర్షణలు రేగితే రాష్ట్రం దశాబ్దాల పాటు వెనక్కి పోతుంది. రాష్ట్రానికి డబ్బుల గురించి అమిత్‌ షా ఇప్పుడైనా చెప్తారా? హిందువులు, ముస్లిలంటూ రెచ్చగొట్టి వెళ్తారో చూడాలి. తెలంగాణ వచ్చాక రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. నేతన్న మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తున్నాం.'- కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

1956లో ఏపీ, తెలంగాణకు ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ తాతయ్య నిజాంపై పోరాటం చేశారని.. స్వాతంత్య్ర సమరయోధుడని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని 1969లో ఉద్యమంలో పాల్గొని ఉద్యమించారన్నారు. ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్ అని యువత ఉద్యమంలోకి దూకారని కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. సిరిసిల్లలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం.. పింఛను 200 నుంచి రూ.2,000కు పెంచుకున్నామని వెల్లడించారు. ఈ ర్యాలీలో మంత్రి కేటీఆర్‌ వెంట కలెక్టర్‌ అనురాగ్‌, ఎస్పీ రాహుల్ ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.