CM KCR: 'నా చివరి రక్తపుబొట్టు దాకా శ్రమిస్తా'

author img

By

Published : Aug 28, 2021, 4:32 AM IST

CM KCR

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

హుజూరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్న దళితబంధు కార్యక్రమం మహోద్యమంగా మారాలని.. మిగతా సమాజమంతా ఇందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. రాష్ట్రంలో 18శాతం మంది దళితులున్నారని, ఇందుకు తగినట్లుగానే రాబోయే కాలంలో వారి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దామని సీఎం చెప్పారు. శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో దళితబంధు పథకం అమలు తీరుపై సుమారు రెండున్నర గంటల పాటు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘‘నాటి తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లైతే కొట్లాడినమో.. అచ్చంగా అదే సంకల్పంతో దళితుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు ముందుకు సాగుదాం. అధికారగణం కూడా ప్రభుత్వ ఆశయాన్ని క్షేత్రస్థాయిలో వెల్లడిస్తూ దళితబంధును సంపూర్ణంగా విజయవంతం చేయాలి. దేశవ్యాప్తంగా దళితుల పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తర భారతదేశంలో మరీ దయనీయం.

ప్రాణత్యాగాలకు సిద్ధపడి మనం సాధించుకున్న తెలంగాణలో దళితుల సమగ్రాభివృద్ధికి పాటుపడదాం. నా చివరి రక్తపు బొట్టు దాకా ఇందుకు శ్రమిస్తా. సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 17 లక్షల దళిత కుటుంబాలున్నట్లు తేలింది. 75 లక్షల మంది జనాభా ఉంది. అంటే రాష్ట్ర జనాభాలో 18 శాతం వీరే. ఇందుకు తగినట్లుగానే రాబోయే కాలంలో వారి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం.!

దళితబంధు ముమ్మాటికీ ఓట్ల కోసం పెట్టింది కాదు.అలాగని ఆదరాబాదరా అవసరం లేదు. ప్రతి దళిత కుటుంబాన్ని అభివృద్ధిపరిచే దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దళితబస్తీలో దరిద్రాన్ని బద్దలు కొట్టాలంటే ఉద్యోగుల కుటుంబాలకు కూడా దళితబంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ వర్గాల్లోని అన్ని ఉపకులాలకూ ఇది వర్తిస్తుంది. ఆర్థికంగా అండదండలు అందితేనే వారు గుణాత్మక మార్పుతో కూడిన జీవనాన్ని కొనసాగిస్తారు. అందుకనే దార్శనికతతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం.

ఏటా రూ.20-30వేల కోట్లు వెచ్చిస్తూ..

సాగునీరు, వ్యవసాయ రంగానికి గత బడ్జెట్‌లలో ఎలాగైతే రూ.కోట్లు ఖర్చు చేసి పునరుజ్జీవం సాధించామో అదే పద్ధతిలో దళతబంధుకు అవసరమైన రూ.1.75 లక్షల కోట్లను ఖర్చు చేసి యావత్‌ తెలంగాణ దళిత కుటుంబాలను దశల వారీగా అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఏటా రూ.20- 30 వేల కోట్లను బడ్జెట్‌లో పెడుతూ మూడు లక్షల దళిత కుటుంబాలకు మేలు చేద్దాం. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతి దళిత మేధావి తన వంతు బాధ్యతగా సహకారాన్ని అందించాలి. గ్రామాలకు తరలి వెళ్లి పథక ప్రాధాన్యం వివరించాలి. యువత కూడా బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములవ్వాలి. ప్రభుత్వ పరంగా అందించే లైసెన్స్‌లు, ఎరువుల, ఔషëÅ ]దుకాణాలు, వైన్స్‌ మొదలైన వాటిలో వారికి తప్పకుండా రిజర్వేషన్‌ కల్పిస్తాం.

దేశంలో మొదటి నిధి ఇలా..

గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో దళితబంధు కమిటీలను ఏర్పాటు చేయనున్నాం. ఒక్కసారిగా అభివృద్ధి చెందిన కుటుంబాలు కిందపడిపోకుండా ఉండేందుకు రక్షణనిధితో సపోర్టింగ్‌ స్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసుకుందాం. ఇలాంటి విధానం ప్రపంచంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే ఉంది. మన దేశంలో మాత్రం ఇది మొదటిది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నిధి పర్యవేక్షణ ఉంటుంది. ఆపదొచ్చిన వారిని ఆదుకుంటుంది. ఎస్సీ సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌, బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగర్‌ జిల్లా వారవడం, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పక్కనే ఉన్న సిద్దిపేట జిల్లా వాసి కావడంతో హుజూరాబాద్‌ పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతానికి మార్గం సుగమమైంది. ఉత్పత్తిరంగంలో కరీంనగర్‌ డెయిరీ విజయగాథ బాగుంది. ఇదే తరహాలో డెయిరీ ఫాంల ఏర్పాటు కోసం లబ్ధిదారులకు సలహాలు ఇవ్వాలి’ సమీక్షలో పలువురు దళిత మేధావులు, సంఘాల నేతలు ఇచ్చిన సలహాల్ని నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకెరవిశంకర్‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌. సీఎంవో కార్యదర్శులు స్మితాసభర్వాల్‌, రాహుల్‌బొజ్జా, కరీంనగర్‌ కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, నియోజకవర్గంలో ఆయా మండలాలకు బాధ్యులుగా ఉన్న ప్రత్యేకాధికారులు, బ్యాంకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిన్నారికి కేటీఆర్‌ పేరు..!

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: తమ బిడ్డకు పేరు పెట్టమని రామడుగు ఎంపీపీ కవిత, లక్ష్మణ్‌ దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. సమీక్షను ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో హెలీప్యాడ్‌కు సమీపంలో వారు సీఎంని కలిశారు. తమ బాబుకు కేటీఆర్‌ అని పేరు పెట్టుకుంటామని దంపతులు అనడంతో సరేనంటూ సీఎం బిడ్డను ఎత్తుకుని ఆశీర్వదించి వెళ్లిపోయారు. తెరాస తరఫున పోటీచేసి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచిన కవిత.. మండల పరిషత్తు అధ్యక్షురాలు అయ్యారు. ఇంటిపేరు కలిగేటి కావడం వల్ల తమ చిన్నారికి కలిగేటి తారక రామారావు (కేటీఆర్‌) పేరుని పెట్టుకున్నట్లు తెలిపారు.

మల్లన్నసాగర్‌ను వీక్షించిన కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరీంనగర్‌ పర్యటనను పూర్తి చేసుకొని హెలికాప్టర్‌లో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ బయల్దేరిన సీఎం కేసీఆర్‌ మల్లన్నసాగర్‌ జలాశయాన్ని వీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయమైన మల్లన్నసాగర్‌ 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైంది. ఈ ఏడాది కాళేశ్వరం జలాలతో దీన్ని నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఆదివారం నుంచి ప్రయోగాత్మకంగా నీటిని వదులుతున్నారు. మల్లన్నసాగర్‌ చిత్రాన్ని సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్‌ ట్విటర్‌లో ఫోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: Dalitha Bandhu: హుజూరాబాద్‌లో ప్రారంభమైన దళిత బంధు సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.