'రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి'

author img

By

Published : Sep 20, 2022, 4:39 PM IST

YS Sharmila

YS Sharmila Unemployment Strike: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు తమ పార్టీ అధినేత షర్మిలపై మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ మహిళా నేతలు రాష్ట్ర మహిళా కమిషన్​ను ఆశ్రయించారు.

YS Sharmila Unemployment Strike: ప్రజలకిచ్చిన ఏఒక్క హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గంలోని కొందుర్గులో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ వెంటనే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు.

రాష్ట్ర మహిళా కమిషన్​లో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డిపై వైతెపా మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరంజన్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బుద్దభవన్‌లోని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను కల్పనా గాయత్రి నేతృత్వంలోని ఆ పార్టీ మహిళా నేతల బృందం కలిసి వినతిపత్రం సమర్పించారు.

అంతకుముందు ఉమ్మడి మహబూబ్​నగర్​లో వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. కొన్ని రోజుల క్రితం మహబూబ్ నగర్ తితిదే కళ్యాణ మండపం వద్ద 'పాలమూరు-నీళ్లపోరు' పేరిట 24 గంటల నిరాహార దీక్షను ఆమె ప్రారంభించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేని కేసీఆర్ నిర్లక్ష్యానికి నిరసనగా దీక్ష చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సాకులు చెప్పకుండా వెంటనే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెయ్యికోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పెండింగ్ ప్రాజెక్టుల్ని ఎందుకు పూర్తిచేయలేకపోయారని ఎదురుదాడికి దిగారు.

నిరంజన్​రెడ్డికి సవాల్: వైఎస్ హయాంలో జూరాల నుంచి ప్రారంభించాలని భావించిన ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో 35వేల కోట్ల నుంచి 55వేల కోట్లకు అంచనాలు పెంచారని, అయినా 8ఏళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరుపై లేదన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే, మూడేళ్లలోనే మునిగి పోయిందన్నారు. పాలమూరుకు అనుమతులు లేవని ఇప్పడు చెబుతున్నారని, ఇప్పటి వరకూ ఖర్చు చేసిన 17వేల కోట్లు నీళ్లలోపోసినట్లేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని సగానికి పైగా సాగునీటి ప్రాజెక్టులు మేఘా కృష్ణారెడ్డికే అప్పగిస్తున్నారని, దీనిపై కాంగ్రెస్, భాజపాలు సైతం పెదవి విప్పడం లేదన్నారు. అందరూ అమ్ముడు పోవడం వల్లే ఎవరూ ప్రశ్నించడం లేదని ఆరోపించారు. పాలమూరుపై నిజమైన ప్రేమ ఉంటే నీళ్ల నిరంజన్ రెడ్డి తనతో పాటు దీక్షలో కూర్చోవాలని సవాలు విసిరారు. జనం కన్నీళ్లు తుడవలేని మంత్రి కన్నీళ్ల నిరంజన్ రెడ్డి అని అభివర్ణించారు.

సమస్యలపై ప్రశ్నిస్తే ఫిర్యాదులా: తానేదో మాట్లాడుతున్నట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు స్పీకర్​కు ఫిర్యాదు చేశారని, ప్రజల సమస్యలను బహిరంగంగా ప్రశ్నిస్తే తప్పా అని ఎదురుదాడికి దిగారు. మహిళల పట్ల, తమ పట్ల పిచ్చికూతలు కూస్తే గట్టిగానే సమాధానం చెప్తామని హెచ్చరించారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అసమర్థ పాలనపై తాను మాట్లాడుతుంటే.. కాంగ్రెస్, భాజపాలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.