చేరిన కళాశాల నుంచే మరో వర్సిటీలో చదువుకోవచ్చు

author img

By

Published : May 29, 2022, 5:52 AM IST

Board of Higher Education

ఎవరైనా విద్యార్థి యూనివర్సిటీలో చేరితే కోర్సు పూర్తయ్యే వరకు అక్కడే చదవాలి. ఆ ఇబ్బందిని దూరం చేస్తూ విద్యార్థి తాను చేరిన కోర్సులో ఏదైనా ఒక పేపర్​/సబ్జెక్టును ఇతర వర్సిటీల నుంచి ఆన్​లైన్ విధానంలో చదువుకొనే అవకాశం లభించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది.

సాధారణంగా ఎవరైనా విద్యార్థి ఒక యూనివర్సిటీలో చేరితే.. సౌకర్యాలు సరిగా లేకున్నా, కోర్సు పూర్తయ్యే వరకు అక్కడే చదువు కొనసాగించాలి. ఆ ఇబ్బందిని దూరం చేస్తూ విద్యార్థి తాను చేరిన కోర్సులో ఏదైనా ఒక పేపర్‌/సబ్జెక్టును ఇతర వర్సిటీల నుంచి దూరవిద్య/ఆన్‌లైన్‌ విధానంలో చదువుకొనే అవకాశం లభించనుంది. వచ్చే(2022-23) విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించింది.

ఈ విధానం కింద దేశంలో యూజీసీ అనుమతి ఉన్న ఏ విశ్వవిద్యాలయం నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. మూక్‌(మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌), స్వయం వేదికలను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ఓయూలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, పర్యావరణ శాస్త్రం కోర్సులో ఒక విద్యార్థి చేరితే.. ఇక్కడ పర్యావరణ శాస్త్రం కోర్సు మెటీరియల్‌, ఆచార్యులు లేకపోతే.. ఆ కోర్సును దిల్లీ వర్సిటీ నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. రాష్ట్రంలోనే తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఏ(హానర్స్‌) హిస్టరీ కోర్సు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ సిటీ కళాశాలలో 60 సీట్లతో ఈ కోర్సు ప్రారంభం కానుంది.

అడ్డుగోడలు తొలగిస్తున్నాం...

చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు అడ్డుగోడలు తొలగించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఒక విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థి మరో వర్సిటీ నుంచి ఏదైనా ఒక సబ్జెక్టు చదువుకునే వీలు కల్పిస్తున్నాం. 40 శాతం క్రెడిట్స్‌ ఇతర వర్సిటీల నుంచైనా చేసుకోవచ్చని యూజీసీ సైతం చెప్పింది. - ప్రొ.ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌

ఇవీ చదవండి:హైదరాబాద్‌లో అత్యధికం... ములుగులో అత్యల్పం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.