నిద్రలో భర్త కలవరింత.. వేడి వేడి నీళ్లు "అక్కడ" కుమ్మరించిన భార్య..!

author img

By

Published : Sep 21, 2022, 4:19 PM IST

wife

హలో.. హలో.. మైక్ టెస్టింగ్.. ఎమర్జెన్సీ అలర్ట్.. ఎమర్జెన్సీ అలర్ట్.. ఇందుమూలంగా ఈ భూమ్మీదున్న భర్తలందరికీ తెలియజేయునది ఏమనగా.. నిద్రలో ఇష్టారీతిన కలలు కనకూడదని, ఒకవేళ పొరపాటున కలగన్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ కలవరింతలు మాత్రం చేయకూడదని హెచ్చరిక. దీన్ని అందరూ స్ట్రిక్ట్ గా ఫాలో కావాల్సిందే. కాదూ కూడదు.. అని రూల్ బ్రేక్ చేశారంటే.. పాకిస్తాన్ బార్డర్ కన్నా ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోవడం ఖాయం..! ఏ వేడినీళ్ల బకెట్ ఏ వైపు నుంచి వచ్చి.. ఒంటిపై ఎక్కడ పడిపోతుందో తెలియదు. తస్మాత్ జాగ్రత్త!!

బొలీవియా... సౌత్ అమెరికాలోని దేశం ఇది. ఈ కంట్రీలోని లాపాజ్ నగరంలో ఓ ఇల్లు.. ఆ ఇంట్లో ఓ ఘోరమైన పగలు.. నిద్రలో కూడా "పగటి కలలు" కనడం నేరమని ఆ భర్తకు తెలిసి ఉండదు. "తెలిసినా ఏం చేస్తాడు.. నిద్రలో వచ్చే కల అతనికెలా తెలుస్తుంది పాపం.." అంటారా? ఇదే ప్రశ్న అతని భార్యను అడిగితే.. "ఎందుకు తెలియదు? మెలకువగా ఉన్నప్పుడు గాఢంగా దేన్నైతే కోరుకుంటారో.. అదే కలలో వస్తుంది. నాకు తెలియదా ఏంటీ? హమ్మా.." అంటుంది. ఇంతకీ ఆ విషాద పగటిపూట ఏం జరిగిందో తెలుసుకుందాం..

భర్త బెడ్ మీద నిద్రిస్తున్నాడు.. అతని వయసు 45 ఏళ్లు.. గాఢ నిద్రలో ఉన్న అతను మెల్లగా శబ్దం చేయడం మొదలు పెట్టాడు. భార్య దగ్గరికి వచ్చి చూసింది.. "ఏదో కలవరిస్తున్నాడు". చెవులు రెక్కించి మరింత దగ్గరగా వెళ్లి విన్నది. అంతే.. ఒళ్లు మండింది.. పళ్లు కొరికింది.. కళ్లు పెద్దవి చేసింది.. పట్టలేనంత ఆవేశంతో.. ఆగ్రహంతో.. ఉద్రేకంతో.. వంటింట్లోకి పరిగెత్తింది. తనలోని ఫైర్ ను కూడా యాడ్ చేసి.. సెగలు కక్కేంతగా గిన్నెడు నీళ్లు మరిగించింది. ఉడికిపోతున్న ఆ నీటిని పట్టుకొచ్చి.. ఒక్క ఉదుటన నిద్రిస్తున్న భర్త జననాంగంపై కుమ్మరించింది.

అతగాడు పెట్టిన కేకలు అపార్ట్ మెంట్ దాటి.. వీధి చివరి వరకూ వ్యాపించాయి. క్షణాల్లో బజారు మొత్తం వాళ్లింట్లో వాలింది.. భర్త తీవ్ర గాయాలతో అల్లాడిపోతున్నాడు. ఆసుపత్రిలో బర్నాల్ రాసిన డాక్టర్.. బర్నింగ్.. "సెకండ్ స్టేజ్" కూడా దాటిందని చెప్పారు. అంటే.. నీళ్లు ఎంతగా వేడెక్కాయో అర్థం చేసుకోవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితురాలైన భార్యను, బాధితుడైన భర్తను విచారించారు. కేసు ఫైల్ చేసి.. భార్యను జీప్ ఎక్కించారు.

ఆ తర్వాత ఈ కేసు వివరాలను.. లా పాజ్‌ స్పెషల్ క్రైమ్ ఫైటింగ్ ఫోర్స్ డిప్యూటీ డైరెక్టర్ జువాన్ జోస్ డోనైర్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. "ఈ 45 ఏళ్ల భర్త.. తన భార్య నుండి హింస, వేధింపులు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు" అని చెప్పారు. గతంలో ఇతని భార్య పలుమార్లు ఇలా.. తీవ్రవాద చర్యలకు దిగిందన్నారు. ఓ సారి ఆవేశంలో భర్తపై మద్యం పోసి.. నిప్పంటించే ప్రయత్నం కూడా చేసిందట!

కానీ.. వీరిద్దరి మధ్య ఇంతగా గొడవలు జరగడానికి కారణం ఏంటో తెలియలేదు అని చెప్పారు జువాన్. తొలిసారి వీరిమధ్య ఎక్కడ చెడిందో అర్థం కాలేదని అన్నారు. కానీ.. ఆమె చర్యలు మాత్రం ఊహాతీతంగా ఉంటున్నాయన్నారు. ఇదంతా సరేగానీ.. ఇంతకీ ఆ అమాయకపు భర్త నిద్రలో ఏమని కలవరించారో చెప్పండి అంటారా..? కలలో ఎవరితోనో.. "ఐ లవ్యూ" అన్నాడట!

వీటిపైనా ఓ క్లిక్కేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.