Traffic Restrictions : హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఏఏ రోడ్లు క్లోస్ చేశారు? ఏఏ దారులు మళ్లించారు?

author img

By

Published : Sep 19, 2021, 7:20 AM IST

Updated : Sep 19, 2021, 8:50 AM IST

భాగ్యనగరంలో గణేశ్ శోభాయాత్ర

గణేశుడి మహా శోభాయాత్రకు మహానగరం సిద్ధమైంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పోలీసు, హెచ్‌ఎండీఏ, విద్యుత్తు సంస్థ, జలమండలి ఇలా అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించి ఏర్పాట్లు పూర్తి చేశాయి. మహాగణపతి శోభాయాత్రల దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions in Hyderabad) విధించారు. పనులపై బయటకు వెళ్లేవారు, కార్యాలయాలకు వెళ్లేవారు.. ఆంక్షలు చూసుకుని, గూగుల్​మ్యాప్స్​లో తాము ఎప్పటికప్పుడు చేసే రూట్​ అప్​డేట్స్​ను ఫాలో అవుతూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణేశుడు.. నేడు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. వినాయక నిమజ్జనానికి భాగ్యనగరం సన్నద్ధమైంది. అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions in Hyderabad) విధించి.. శోభాయాత్ర సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేశారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు అతిపెద్ద 25 చెరువులు, 25 నిమజ్జన కోనేరుల్లో ఈ కార్యక్రమం సాగుతుందని అధికారులు ప్రకటించారు. శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్‌ నియంత్రిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గూగుల్ మ్యాప్స్​లో ఎప్పటికప్పుడు రూట్ క్లియరెన్స్​ను అప్​డేట్ చేస్తూ ఉంటామని, ప్రజలు వాటిని చూస్తూ తమ గమ్యస్థానాలకు వెళ్లాలని సూచించారు.

గూగుల్‌ మ్యాప్స్‌లో తెలుసుకునే అవకాశం

నిమజ్జనం సాఫీగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టామని నగర సీపీ అంజనీకుమార్‌ అన్నారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సోమవారం 5 గంటల్లోపు నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయనున్నామని పేర్కొన్నారు. శోభాయాత్ర సాఫీగా కొనసాగేందుకు బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకూ ఉన్న 17 కిలోమీటర్ల ప్రధాన ఊరేగింపు మార్గంలో 276 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలను విధించామని తెలిపారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకూ కొనసాగనున్న గణేశ్‌ శోభాయాత్రను గూగుల్‌ మ్యాప్స్‌కు అనుసంధానించారు. దీంతో శోభాయాత్ర గమనాన్ని నెటిజన్లు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవి

చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, మొజంజాహీ మార్కెట్‌, ఆబిడ్స్‌, బషీర్‌బాగ్‌ లిబర్టీ, హుస్సేన్‌ సాగర్‌ వరకూ ఉన్న మార్గంలో విగ్రహాలు తీసుకొస్తున్న వాహనాలు మినహా ఇతర వాహనాలు అటూ, ఇటూ వెళ్లేందుకు అనుమతి లేదు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సమీపంలోని బషీర్‌బాగ్‌ ఫ్లై ఓవర్‌ కింద మాత్రమే వాహనాలు, ప్రజలను అటూ, ఇటూ అనుమతించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆసుపత్రులకు వచ్చే అంబులెన్స్‌లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు మినహాయింపు ఇస్తున్నారు.

రూట్ మ్యాప్

అంతర్రాష్ట్ర సర్వీసులు.. భారీవాహనాలు

ఇతర రాష్ట్రాల బస్సులు, జిల్లాల బస్సులు ఆదివారం ఉదయం 10గంటలోపు మాత్రమే ఇమ్లీబన్‌ బస్టాండ్‌కు చేరుకోవాలి. తర్వాత ఆయా వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు. భారీ వాహనాలు, సరకు రవాణా వాహనాలకు నగర రహదారులపై అనుమతి లేదు. ప్రైవేటు బస్సులు కూడా సోమవారం ఉదయం 10గంటల వరకు నగరంలో ప్రవేశించకూడదు. విమానాశ్రయానికి వెళ్లేవారు బాహ్యవలయ రహదారిని వినియోగించుకోవాలి.

ఖైరతాబాద్‌ గణపయ్య వెళ్లేదిలా..

చివరిరోజు మహాగణపతి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
  • అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు భారీ వినాయకుడి విగ్రహాన్ని క్రేన్‌ సహాయంతో ట్రాలీపై ఎత్తిపెడతారు.
  • తెల్లవారుజాము 4 నుంచి ఉదయం 7 గంటల వరకు ఊరేగింపు రథంపై విగ్రహం కదలకుండా వెల్డింగ్‌ పనులు చేస్తారు.
  • ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభం
  • ఉదయం 9:30 గంటలకు ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4కు చేరుకునే అవకాశాలున్నాయి.
  • ఇనుప కమ్మలు తొలగింపు, ప్రత్యేక పూజల అనంతరం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బడా గణేష్‌ గంగమ్మ ఒడికి చేరుతాడు.
  • మహాగణపతి నిమజ్జనం అయ్యే వరకు ఆ మార్గంలో ఇతర విగ్రహాలు ఉన్న వాహనాలను అనుమతించరు.
  • ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకోవడానికి శనివారం తొమ్మిదోరోజు భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేల మంది వచ్చి లంబోదరుడిని దర్శించుకున్నారు. మండపాన్ని తొలగించే పని శనివారం సాయంత్రానికే పూర్తి చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో గణపతి దర్శనాలను నిలిపివేశారు. భారీ వినాయకుడిని ఆ ట్రాలీపై ఉంచేందుకు వంద టన్నుల బరువును ఎత్తే భారీ క్రేన్‌ సిద్ధం చేశారు.

ఆర్టీసీ బస్సులు ఇక్కడి వరకే..

  • మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులు మాసాబ్‌ ట్యాంక్‌
  • కూకట్‌పల్లి నుంచి వచ్చే బస్సులు ఖైరతాబాద్‌ సర్కిల్‌
  • సికింద్రాబాద్‌ నుంచి వచ్చే బస్సులు సీటీవో, ఎస్‌బీహెచ్‌, క్లాక్‌ టవర్‌, చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌
  • ఉప్పల్‌ నుంచి వచ్చే బస్సులు రామంతాపూర్‌ టీవీ స్టేషన్‌
  • దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే బస్సులు గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్‌
  • రాజేంద్రనగర్‌ నుంచి వచ్చే బస్సులు దానమ్మ హట్స్‌
  • ఇబ్రహీంపట్నం, మిధాని నుంచి వచ్చే బస్సులు ఐ.ఎస్‌.సదన్‌
  • ఇంటర్‌ సిటీ ప్రత్యేక బస్సులు వైఎంసీఏ నారాయణగూడ, జమై ఉస్మానియా వైపు వెళ్లే బస్సులు తార్నాక కూడలి వరకే వెళ్తాయి.
  • బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకూ ప్రధాన శోభాయాత్ర

సందర్శకుల పార్కింగ్‌ ప్రాంతాలు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఖైరతాబాద్‌, ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, ఖైరతాబాద్‌, ఆనంద్‌ నగర్‌ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయం, ఖైరతాబాద్‌, బుద్ధభవన్‌ వెనుకవైపు, సికింద్రాబాద్‌, గోసేవా సదన్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ స్డేడియం, నిజాం కళాశాల, బషీర్‌బాగ్‌, పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి.

అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో..

ఉత్సవాలకు చూసేందుకు తరలొచ్చే పర్యాటకుల కోసం రైల్వే, మెట్రో, ఆర్టీసీ యంత్రాంగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకులతో పాటు ఇతర ప్రాంతాలకూ నడిచే మెట్రో సర్వీసుల సమయాన్ని అర్ధరాత్రి ఒంటి గంట వరకూ పెంచనున్నట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. ప్రారంభ స్టేషన్ల నుంచి అర్ధరాత్రి ఒంటి గంటకు మొదలయ్యే మెట్రో సర్వీసు చివరి స్టేషన్‌కు 2గంటలకు చేరుకోనుంది. 8 ఎంఎంటీఎస్‌ ప్రత్యేక సర్వీసుల్ని అదనంగా నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఇప్పటికే ప్రకటించగా 565 అదనపు బస్సుల్ని నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది.

  • విధుల్లో ఉండే పోలీసుల సంఖ్య 27 వేలు
  • ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసే క్రేన్లు: 40
  • రసూల్‌పుర రెతిబౌలి పంజాగుట్ట జీహెచ్‌ఎంసీ సిబ్బంది 8,200
  • నగరంలో వినిగియోగిస్తున్న క్రేన్లు 300
  • నిమజ్జనం చేసే విగ్రహాలు అధికారిక లెక్క ప్రకారం: 50 వేలు
  • అడుగులలోపు విగ్రహాలను పరిగణనలోకి తీసుకుంటే లక్షపై మాటే
  • పాల్గొనే భక్తులు సుమారు 8 లక్షలు
  • తాగునీటి కోసం జలమండలి ఏర్పాటు చేస్తున్న శిబిరాలు: 119
  • సిద్ధం చేసిన వాటర్‌ ప్యాకెట్లు: 30.72 లక్షలు
  • అన్నదాన శిబిరాలకు ట్యాంకర్లతో జలమండలి ఉచితంగా నీటి సరఫరా చేస్తోంది. అవసరమైన వారు 155313 నంబరులో సంప్రదించవచ్చు.

కొవిడ్‌ నిబంధనలు పాటిద్దాం

గణేశ్ నిమజ్జననాన్ని పండుగలా చేసుకుందాం.. కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా వీడనందున అందరం కొవిడ్‌ నిబంధనలు పాటిద్దాం. నిమజ్జనం చేసేందుకు గుంపులుగా రావొద్ధు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 27వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా టీకాలు వేయించుకున్నారు. సాఫీగా నిమజ్జనం పూర్తయ్యేందుకు వీలుగా క్రేన్లకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చాం.

- అంజనీకుమార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌

ఉత్సాహంగా రండి... సురక్షితంగా వెళ్లండి

"రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో 24 ప్రాంతాల్లో నిమజ్జనం జరుగనుంది. గణేశ్ విగ్రహాలతో ఉత్సాహంగా రండి.. నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యాక సురక్షితంగా ఇళ్లకువెళ్లండి. సరూర్‌నగర్‌, సఫిల్‌గూడ చెరువులు సహా మిగిలిన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిమజ్జనం చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాం."

- మహేష్‌ భగవత్‌, రాచకొండ సీపీ

డ్రోన్లు.. డీజేలు వద్దు

"గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా చెరువుల వద్ద రక్షణ ఏర్పాట్లు చేశాం. ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చి కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానించాం. ప్రతిమలను నిమజ్జనం చేసందుకు వచ్చేవారు వాహనాలపై డీజేలను తీసుకురావద్ధు ఊరేగింపులను చిత్రీకరించేందుకు డ్రోన్లను వినియోగించకూడదు. చూసేందుకు నిర్వాహకులతోపాటు వచ్చే మహిళలు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి."

- ఎం.స్టీఫెన్‌ రవీంద్ర, సైబరాబాద్‌ సీపీ

పోకిరీలూ... జాగ్రత్త

"మహా నిమజ్జనం సందర్భంగా సాగర్‌కు వచ్చే యువతులు, మహిళలతో అనుచితంగా ప్రవర్తించే పోకిరీలను చట్టపరంగా శిక్షిస్తాం. మహిళలు, యువతులు, చిన్నారుల భద్రత కోసం వెయ్యిమంది మహిళా పోలీస్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించాం. పోకిరీలు, ఈవ్‌టీజర్లను పట్టుకునేందుకు ‘షి’ బృందాలను ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌మార్గాల్లో వినియోగించనున్నాం. రెండేళ్ల క్రితం 50 మంది పోకిరీలను పట్టుకున్నాం. జైలుకు పంపించాం."

- షికాగోయల్‌, అదనపు డీజీపీ

Last Updated :Sep 19, 2021, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.