- అధికారులపై పెట్రోల్ దాడి..
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరులో ఓ యువకుడు అధికారులపై పెట్రోల్ దాడి చేశారు. దారి విషయంలో ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన అధికారులపై గంగాధర్ అనే స్థానికుడు.. క్రిమిసంహారక మందులు పిచికారి చేసే స్ప్రేయర్ తో పెట్రోల్ తో స్ప్రే చేసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
- నానమ్మ ఊర్లో మంత్రి కేటీఆర్ సందడి..
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని కొనాపూర్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. తన నానమ్మ ఊరైన కొనాపూర్లో మంత్రి ప్రశాంత్రెడ్డితో కలిసి... సీసీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 'మన ఊరు – మన బడి ' కార్యక్రమంలో భాగంగా... తన నానమ్మ జ్ఞాపకార్థం... సొంత ఖర్చులతో నిర్మించ తలపెట్టిన పాఠశాలకు శంకుస్థాపన చేశారు.
- రాగల మూడు రోజుల పాటు వర్షాలు..
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
- తెరాసనే ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష..
తెరాసను ఒంటరిగా ఎదుర్కోలేక కాంగ్రెస్, భాజపా కలిసి కుట్ర చేస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం చేసే విపక్షాలు కావాలో మేలు చేసే తెరాస కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
- ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణ అరెస్టు..
ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ అరెస్టును తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మరోవైపు పరీక్షల నిర్వహణా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.
- మైనారిటీ గుర్తింపు అంశంపై సుప్రీం అసంతృప్తి!
మైనారిటీల గుర్తింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి పట్ల సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా.. ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై సుప్రీం విచారణ జరిపింది.
- దేశద్రోహం కేసులను ఎందుకు నిలిపివేయకూడదు?
దేశద్రోహం చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పునఃపరిశీలన పూర్తి చేసే వరకు ఈ చట్టం కింద చర్యలు తీసుకోకుండా రాష్ట్రాలను ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించింది.
- పిల్లల కోసం రైల్వే శాఖ సరికొత్త ప్రయోగం!
రైలులో ప్రయాణించే తల్లీపిల్లల కోసం సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే చిన్న పిల్లలు పడుకోవడానికి ప్రత్యేకంగా బెర్త్లను ఏర్పాటు చేసింది. లోయర్ బెర్త్ పక్కన వీటిని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం లఖ్నవూ మెయిల్ను పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది.
- పుతిన్ పిలుపుతో రష్యా సేనల దూకుడు..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విక్టరీ డే ప్రసంగం అనంతరం.. ఆ దేశ సేనలు ఉక్రెయిన్పై భీకరంగా దాడులు చేస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఉక్రెయిన్ పరిశ్రమలపై దృష్టిపెట్టాయి. కాగా, రెండు నెలల క్రితం రష్యా చేసిన బాంబు దాడుల్లో 44 మంది చనిపోయినట్లు తాజాగా వెల్లడైంది. మృతదేహాలను శిథిలాల నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
- మహేశ్-రాజమౌళి సినిమా షూటింగ్పై విజయేంద్రప్రసాద్ క్లారిటీ
మహేశ్బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 'సర్కారువారి పాట' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే చిత్ర షూటింగ్లో మహేశ్బాబు పాల్గొంటారని ఇటీవల తెలిపారు. ఈ క్రమంలో అగ్ర దర్శకుడు రాజమౌళితో సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనికి ప్రముఖ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సమాధానం ఇచ్చారు.