tirupati floods: జలదిగ్బంధంలో తిరుపతి... తిండిలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు

author img

By

Published : Nov 21, 2021, 7:38 PM IST

Tirupati floods latest news

వర్షాలు తగ్గినప్పటికీ తిరుపతిలో వరద ముప్పు(Tirupati floods) కొనసాగుతోంది. ఇంకా పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తాగునీరు, తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జలదిగ్బంధంలోని కాలనీలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావంతో రైళ్లును రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఆర్టీసీ బస్సులను సైతం దారి మళ్లించి.. తిరుమల, తిరుపతికి సర్వీసులు నడుపుతున్నారు.

తిరుపతిలో కొనసాగుతున్న వరద ముప్పు

వర్షాలు తగ్గినప్పటికీ తిరుపతి(Flood Water in Tirupati) నగరానికి వరద ముప్పు కొనసాగుతోంది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. కొన్ని కోట్ల చెరువు కట్టలు తెగి నగరంలోకి వరదనీరు చేరుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కొంతమేర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. వరద ప్రభావంతో తిరుమల కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టు ప్రాంతం పూర్తిగా(Tirupati floods latest news) దెబ్బతింది. అలిపిరి కాలినడక మార్గం పాక్షికంగా దెబ్బతినడంతో.. భక్తులను కాలినడక మార్గాల ద్వారా అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలు మినహా.. భక్తులను ఇతర వాహనాలపై అనుమతిస్తున్నారు. వరదప్రభావంతో రైళ్లు, బస్సులను రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారిమళ్లించారు. ఆర్టీసీ బస్సులను దారిమళ్లించి తిరుమల, తిరుపతికి నడుపుతున్నారు.

ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటితో ఇంకా పలు కాలనీలు(Several Colonies Waterlogged ) జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నగరంలోని మహిళా యూనివర్సిటీ, శ్రీ కృష్ణ నగర్, గాయత్రీ నగర్, ఎంఆర్ పల్లి, సరస్వతీ నగర్, గాంధీపురం, లింగేశ్వరకాలనీ, ఆటోనగర్​తోపాటు పలు కాలనీల్లోని ఇళ్లకు వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతంలోని పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువులు నిండిపోవడంతో తిరుపతి శివార్లలోని పలు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. ఇళ్లలోకి నీరు రావడంతో తాగునీరు, తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారు. జలదిగ్బంధంలోని కాలనీలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది.

అండగా నిలుస్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్...

మరో పక్క జలదిగ్బంధంలో ఉన్న నగరవాసుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలించింది. పాలు, బ్రెడ్, ఆహార పానియాలను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ముంపునకు గురైన ప్రాంతాలలో పూర్తి స్థాయిలో బాధితులకు సాయం అందక ఇబ్బందులు పడుతుంటే.. ముంపు నుంచి బయట పడిన ప్రాంతాల వాళ్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తమవైపు చూడలేదని వాపోతున్నారు. వరదలో ఇంట్లో వస్తువులతో పాటు సర్వం కోల్పోయామని కన్నీటిపర్యంతమవుతున్నారు. కనీసం వీధుల్లో పేరుకుపోయిన బురద, కొట్టుకొచ్చి వస్తువులను తొలగించాలని కోరుతున్నారు.

ప్రమాదకర పరిస్థితిలో రాయలచెరువు..
భారీ వర్షాలకు జిల్లావ్యాప్తంగా అన్ని వాగులు, వంకలు, నదులలో వరద ప్రవాహం ఉద్ధృతంగా(rains in tirupati) కొనసాగుతోంది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు ప్రమాదక పరిస్థితుల్లో ఉందని.. కట్టతెగిపోయే పరిస్థితులు ఉండటంతో ఆ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

150 కుటుంబాల అవస్థలు..
తిరుచానూరు సమీపంలోని నక్కల కాలనీ పూర్తిగా నీట మునగడంతో.. 150 కుటుంబాలు తిరుచానూరు ఉన్నత పాఠశాలలో ఆశ్రయం(Tirupati floods updates) పొందుతున్నాయి. శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట పూసలు అమ్ముకునే కుటుంబాలన్నీ తిరుచానూరు సమీపంలోని గల స్వర్ణముఖి నది(Swarnamukhi river) పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నక్కల కాలనీ పూర్తిగా నీట మునగడంతో అధికారులు వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. కాలనీలలోని 250 మందిని కట్టుబట్టలతో తరలించడంతో మూడు రోజులుగా వారంతా కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. అధికారులు వచ్చి సగం కడుపు నిండేలా ఆహారం ఇచ్చి వెళ్లిపోతున్నారని.. చిన్న పిల్లలకు తాగడానికి పాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇప్పట్లో కోలుకోలేమని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

తిరుపతి నుంచి రద్దైన రైళ్లు, బస్సు వివరాలు ఇలా..
తిరుపతి-కోల్హపూర్, తిరుపతి - కాకినాడ, తిరుపతి - లింగంపల్లి, తిరుపతి-ఆదిలాబాద్, తిరుపతి- భువనేశ్వర్, తిరుపతి-బిల్సాపూర్ రద్దయ్యాయి. హజరత్ నిజాముద్దీన్- తిరుపతి రైళ్లను గుత్తి, ధర్మవరం, పాకాల మీదుగా మళ్లించారు.

  • తిరుపతి- కడప బస్సులను పునరుద్ధరించారు. తిరుపతి- నెల్లూరు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి.
  • భారీ వర్షాల కారణంగా నెల్లూరు వద్ద వంతెన సమస్య ఉన్నందున విజయవాడ వెళ్లే బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
  • తిరుపతి- విజయవాడ బస్సులను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
  • తిరుపతి నుంచి పళ్లిపట్టు వెళ్లే బస్సులను పుత్తూరు మీదుగా నడుపుతున్నారు.

ఇదీ చదవండి: రాయల చెరువుకు స్వల్ప గండి... అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.