Tollywood Drugs case: పూరి, తరుణ్​లు​ మాదకద్రవ్యాలు తీసుకోలేదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి

author img

By

Published : Sep 18, 2021, 4:19 PM IST

Updated : Sep 19, 2021, 4:53 AM IST

Tollywood Drugs case: పూరి జగన్నాథ్, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవు

16:15 September 18

రక్తం, వెంట్రుకలు, గోళ్లు పరీక్షించి తేల్చి చెప్పిన ఎఫ్ఎస్ఎల్

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ దర్యాప్తు చేసిన టాలీవుడ్‌ మత్తుమందుల కేసులో సినీ ప్రముఖులకు పూర్తిస్థాయిలో క్లీన్‌చిట్‌ లభించింది. 2017లో బహిర్గతమైన ఈ వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు చేసిన ఎక్సైజ్‌శాఖ.. అప్పట్లో పలువురు సినీ ప్రముఖులను విచారించినా ఏ ఒక్కరి పాత్రపైనా నిగ్గు తేల్చలేకపోయింది. గతంలోనే 11 కేసులకు సంబంధించిన అభియోగ పత్రాల్లో ఇతర నిందితుల ప్రమేయంపై ఆధారాలు సమర్పించారు తప్ప.. సినీ ప్రముఖుల గురించి ప్రస్తావించలేదు. 

తాజాగా చివరిదైన 12వ కేసులోనూ క్లీన్‌చిట్‌ లభించడంతో ఉత్కంఠ వీడింది. సినీ ప్రముఖులు మాదకద్రవ్యాలు తీసుకున్నారా, లేదా అని తేల్చేందుకు వారి రక్తం, గోర్లు, వెంట్రుకల్లాంటి నమూనాల్ని సేకరించి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో విశ్లేషించాలని భావించారు. అయితే నార్కోటిక్‌ డ్రగ్స్‌ చట్టం ప్రకారం అనుమానితుల నమూనాలు సేకరించాలంటే వారి స్వచ్ఛంద అనుమతి తప్పనిసరి. ఆ నిబంధన ఆధారంగా పలువురు నమూనాలు ఇవ్వలేదు. దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటుడు తరుణ్‌ మాత్రం స్వచ్ఛందంగానే తమ నమూనాల్ని ఇచ్చారు. 

2017 జులై 19న పూరి జగన్నాథ్‌, 22న తరుణ్‌ నమూనాల్ని ఉస్మానియా ఆసుపత్రి వైద్యుల ద్వారా వాటిని సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. నమూనాల విశ్లేషణలో జాప్యం కారణంగా ఆ ఒక్క కేసులో అభియోగ పత్రం దాఖలులో ఆలస్యమైంది. ఎక్సైజ్‌శాఖకు గత డిసెంబరు 8న అందిన ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఇటీవలే వెలుగుచూసింది. పూరి, తరుణ్‌ మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని ఆ నివేదిక స్పష్టం చేసింది. దీంతో మొత్తం 12 కేసుల్లోనూ సినీ ప్రముఖులకు ఎలాంటి ప్రమేయం లేదని తేలినట్లయింది. కీలక నిందితుడు కెల్విన్‌పై నమోదు చేసిన అభియోగ పత్రంలో పూరి, తరుణ్‌ రక్త నమూనాల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు లేవని పేర్కొనడంతోపాటు ఎఫ్‌ఎస్‌ఎల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.ఆర్‌.గుణశీల వాంగ్మూలాన్నీ నమోదు చేశారు.

సినీ ప్రముఖులకు ఎక్సైజ్‌శాఖ క్లీన్‌చిట్‌ నేపథ్యంలో మనీలాండరింగ్‌ అంశం కింద ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జరుపుతున్న విచారణ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. ఎక్సైజ్‌ కేసులో లేని రానా, రకుల్‌ప్రీత్‌సింగ్‌లను ఈడీ విచారించింది. అప్పటి కేసులో లేని పేర్లు ఇప్పుడెలా వచ్చాయనేది చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత కథనాలు..

Last Updated :Sep 19, 2021, 4:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.