వైభవంగా సాగుతున్న లష్కర్ బోనాలు... నేడు రంగం కార్యక్రమం

author img

By

Published : Jul 18, 2022, 7:02 AM IST

Lashkar Bonalu

Lashkar Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకల్లో... ప్రధాన ఘట్టమైన 'రంగం' కార్యక్రమం ఇవాళ జరగనుంది. భవిష్యవాణి అనంతరం అంబారిపై అమ్మవారి ఊరేగింపు వైభవంగా సాగనుంది. ఫలహారం బండ్ల ఊరేగింపు సైతం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Lashkar Bonalu: సికింద్రాబాద్‌ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆదివారం తెలవారుజామునుంచే అమ్మవారిని దర్శించుకున్న భక్తులు... బోనాలు, ఒడిబియ్యం, సారె, సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెల్లవారు జామున 4 గంటలకే అమ్మవారికి తొలి బోనం సమర్పించగా... ఎమ్మెల్సీ కవిత 2000 మంది మహిళలతో ఊరేగింపుగా వచ్చి మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

బోనాల వేడుకల్లో ప్రధాన ఘట్టమైన రంగం ఇవాళ జరగనుంది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించి... అమ్మవారు భవిష్యవాణి పలకనుంది. ఈ కార్యక్రమాన్నే రంగం అంటారు. రంగంలో అమ్మపలికే వాక్కు నిజమవుతుందని భక్తుల విశ్వాసం. భవిష్యవాణి అనంతరం అమ్మవారి... అంబారి ఊరేగింపు వైభవంగా సాగనుంది. అంబారి ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో... అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

సాయంత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఫలహారం బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగనుంది. నగరంలోని దాదాపు 40కిపైగా ప్రాంతాల నుంచి ఫలహారం బండ్లు వస్తాయని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అయ్యే ఈ వేడుక అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. ఫలహారం బండ్ల ఊరేగింపుతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర పూర్తి కానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.