నీట్​ ఫలితాల్లో మెరిసిన తెలుగు విద్యార్థులు.. 5వ ర్యాంకు సాధించిన తెలంగాణ విద్యార్థి

author img

By

Published : Sep 8, 2022, 7:39 AM IST

Updated : Sep 8, 2022, 8:38 AM IST

Etv Bharat

NEET 2022 results నీట్​ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరో సారి తమ సత్తా చాటారు. తెలంగాణకు చెందిన సిద్ధార్థరావుకు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించగా ఏపీ చెందిన సాయికీర్తి తేజకు 12వ ర్యాంక్​ వరించింది. మొదట 50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 8మంది ఉన్నారు.అంతే కాకుండా దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్‌సాయి 661 మార్కులు సాధించి దేశంలో తొలిర్యాంకును పొందారు.రాజస్థాన్​కు చెందిన తనిష్క జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్​ పొందారు.

NEET 2022 results: నిన్న అర్థరాత్రి విడుదలైన నీట్​(యూజీ) 2022 ఫలితాల్లో తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 711 మార్కులతో నీట్‌ ఫలితాల్లో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 25వ ర్యాంకు సాధించారు. బాలికల్లో నూని వెంకటసాయి వైష్ణవి 6 స్థానం, చప్పిడి లక్ష్మి చరిత 14, వరుం అతిథి 20వ స్థానం దక్కించుకున్నారు. బాలురు విభాగంలో ఎర్రబెల్లి సిద్ధార్థరావు 3, మట్టాదుర్గాసాయి కీర్తి తేజ 8, గుల్లా హర్షవర్ధన్‌ నాయుడు 14వ స్థానాలను ఆక్రమించారు.

అర్హత సాధించిన వారు 56.27% మంది: నీట్‌(యూజీ) 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు జులై 17న పరీక్ష రాయగా అందులో 9,93,069(56.27శాతం) మంది అర్హత సాధించారు. గత ఏడాది ఇది 56.34 శాతంగా నమోదైంది. మొత్తం ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో ఓబీసీలు 45.03%, ఎస్సీలు 13.26%, ఎస్టీలు 4.76%, జనరల్‌ 28.41%, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 8.46% మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 68,061 మంది అభ్యర్థులు నమోదు చేసుకొని పరీక్షకు 65,305 మంది హాజరయ్యారు. అందులో 40,344 మంది (61.77%) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 61,207 మంది పేర్లు నమోదుచేసుకోగా, పరీక్షకు 59,296 మంది హాజరయ్యారు. అందులో 35,148 మంది (59.27%) మంది అర్హత పొందారు. జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువమంది అర్హత సాధించారు. రాజస్థాన్‌కు చెందిన తనిష్క 715 మార్కులతో జాతీయస్థాయి తొలిర్యాంకును కైవసం చేసుకున్నారు. దిల్లీకి చెందిన వత్సా ఆశిష్‌ బాత్రా రెండవ స్థానం పొందాడు.

మెరిసిన తెలుగు తేజాలు: టాప్‌ 50లో 8 మంది తెలుగువిద్యార్థులు చోటు దక్కించుకున్నారు. 705 మార్కులతో మంగసముద్రం హర్షిత్‌రెడ్డి 36వ ర్యాంకు, అంతే మార్కులతో తెలంగాణకు చెందిన చప్పిడి లక్ష్మి చరిత 37వ ర్యాంకు, కంచన జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు, 700 మార్కులతో వరుం అథితి 50వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్‌సాయి 661 మార్కులు సాధించి దేశంలో తొలిర్యాంకును ఆక్రమించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూటూరి నేహ 695 మార్కులతో ఆల్‌ఇండియాలో 134 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎస్సీ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొమ్ము ఆదర్శ్‌ 685 మార్కులతో జాతీయ స్థాయిలో 7, ఆలిండియార్యాంకు విభాగంలో 453వ స్థానంలో నిలిచారు.

ఎస్టీకోటాలో తెలంగాణకు చెందిన ముదావత్‌ లితేష్‌ చౌహాన్‌ 688 మార్కులతో తొలిస్థానంలో, గుగులోతు శివాని 680 మార్కులతో రెండోస్థానంలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వడిత్య తేజశ్విని 675మార్కులతో మూడోస్థానంలో నిలిచారు. వీరికి ఆలిండియా ర్యాంకుల్లో వరుసగా 400, 715, 1,112 దక్కాయి. అలాగే తెలంగాణకు చెందిన లవోద్య బ్రింద 671మార్కులతో 5, అనుమేహ భూక్య 670 మార్కులతో 6వ స్థానంలో నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 1374, 1619 దక్కించుకున్నారు. ఓబీసీ కోటాలో ఏపీకి చెందిన గుల్లా హర్షవర్ధన్‌నాయుడు 3వ ర్యాంకు, తెలంగాణకు చెందిన చందల యశశ్విణిశ్రీ 8వ స్థానం సొంతం చేసుకున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణలో ఎర్రబెల్లి సిద్ధార్థ్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌లో మట్టా దుర్గాసాయికీర్తి తేజ తొలిస్థానంలో నిలిచారు.

కార్డియాలజిస్ట్‌నవుతా!:

మాది కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం సురారం గ్రామం. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఉండి చదువుకుంటున్నా. నాన్న హనుమంతరావు వ్యాపారి. అమ్మ లావణ్య గృహిణి. శ్రీ చైతన్యలో అధ్యాపకులు బాగా సహకరించారు. ఎప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా పరిష్కారం చూపేవారు. గంటలు గంటలు చదివేవాడిని కాదు. చదివిన కొద్దిసేపైనా ఏకాగ్రతతో సాధన చేసేవాడిని. ఫిజిక్స్‌లో తొలుత కొంచెం వెనుకబడ్డా. తర్వాత పుంజుకున్నా. టాప్‌5లో ఉంటానని ఊహించలేదు. దిల్లీ ఎయిమ్స్‌లో చేరడమే లక్ష్యం. కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తా. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తా. తిరిగొచ్చి ఇక్కడ పేదలకు సేవలందిస్తా.

- ఎర్రబెల్లి సిద్ధార్థరావు, ఆల్‌ ఇండియా అయిదో ర్యాంకు, తెలంగాణ మొదటి ర్యాంకు

ఇవీ చదవండి:

Last Updated :Sep 8, 2022, 8:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.